April 21, 2013

వైఎస్ ఇలాగే అన్నాడు.. భూస్థాపితం అయ్యాడు

కేసీఆర్‌కూ ఇదే గతి తప్పదు: మోత్కుపల్లి

హైదరాబాద్ : "తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే ప్రగల్బాలు పలికాడు. ఆయనను దేవుడు శిక్షించాడు. కేసీఆర్‌కు అదే గతి పడుతుంది'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో పబ్బం గడుపుకొంటూ.. కుటుంబం కోసం వేల కోట్ల రూపాయలు దండుకున్న కేసీఆర్.. తమ పార్టీని కానీ, తమ అధినేత చంద్రబాబుని కానీ విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 294 శాసనసభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని, రేపు అధికారంలోకి వచ్చేది కూడా టీడీపీయేనని ఆయన చెప్పారు. "రాష్ట్ర రాజకీయాలను ఏవిధంగా కూడా ప్రభావితం చేయలేని పార్టీ కేసీఆర్‌ది. ఇది ఫామ్ హౌస్ పార్టీ అయితే.. ఇంకోటి జైలు పార్టీ'' అని పరోక్షంగా జగన్‌పై కూడా మోత్కుపల్లి మండిపడ్డారు.

వైఎస్, కేసీఆర్ కుటుంబాలు పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ కుటుంబం లక్ష కోట్లు ఆర్జిస్తే.. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. వందలాదిమంది యువకుల ఆత్మ బలిదానాలతో నడుస్తున్న తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకున్నాడని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీలో బేరసారాలు సాగించారని ధ్వజమెత్తారు.