February 4, 2013

ప్రపంచ పటంలో విజయవాడ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాను.. గుంటూరు - విజయవాడ మధ్య ఔటర్ రింగ్‌రోడ్‌ను ఏర్పాటు చేసి ఈ రెండింటిని కలిపి మహానగరంగా తీర్చిదిద్దుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన క్షణమే తాను చెప్పిన ఈ మాటలను ఆచరణలో పెడతానన్నారు. సోమవారం సాయంత్రం విజయవాడ సిద్ధార్థ కళాశాల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విజయవాడ ఈ పాటికే ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, అందుకు కావాల్సిన వనరులన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ధోరణితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఉద్యోగాల్లేక యువత నిరాశలో మునిగిపోయిందని, టీడీపీ హయాంలో మాత్రమే ఉద్యోగాలు కల్పించామని, ఆ తర్వాత మళ్లీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదన్నారు.

యువతకు ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశంనే గెలిపించాలన్నారు. ప్రజలంటే ప్రభుత్వానికి భయం లేకుండాపోయిందని, తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలోనే మహిళలకు రక్షణ ఉందని చెప్పారు. విజయవాడలో 2010లో జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు మూడేళ్లయినా అతీగతీ లేకపోవడాన్ని ప్రస్తావించారు. యువత ఫేస్‌బుక్, ఎస్ఎంఎస్‌ల ద్వారా అవినీతిపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఉల్లిధరలు పెరిగి వాటిని నియంత్రించలేక గతంలో రెండు, మూడు ప్రభుత్వాలే కుప్పకూలాయని, ఆ పరిస్థితి పునరావృతం కానున్నదన్నారు. మొగల్రాజపురంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఈ ప్రభుత్వమే పెద్ద దొంగల పార్టీగా మారిందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

ఉద్యోగులకు అండగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పీఆర్‌సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తీర్చేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

ప్రపంచ పటంలో విజయవాడకు గుర్తింపు తెస్తా


 టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రవాణా రంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా సోమవారం నగరంలోని శాతవాహన కళాశాల ప్రాంగణంలో రవాణారంగ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబు మాట్లాడారు. వ్యవసాయం తరువాత రెండో ప్రాధాన్యం గల రవాణారంగ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేదని విమర్శించారు. ఈ రంగానికి జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ ప్రభుత్వం చేసినదేనన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్‌గా పేరొందిన విజయవాడ ఆటోనగర్‌లో అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 500 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ ఆటోనగర్‌లో వివిధ రకాల పరిశ్రమలకు చెందిన సుమారు 45 వేల యూనిట్లు ఉన్నాయని వీటిపై ఆధారపడిన వారు కేవలం ఐదు శాతం లాభాలను మాత్రమే పొందుతుండగా ప్రభుత్వం మాత్రం సుమారు 45 శాతం వరకూ పన్నులను విధించడం దారుణమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తం గా 45 లక్షల వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా వాటిలో సుమారు 15 లక్షల యూనిట్ల వరకూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గతంలో ఎప్పుడో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు వేలాది రూపాయల సర్‌చార్జీలు విధించడం రవాణా రంగానికి శరాఘాతంగా మారిందన్నారు. తాను అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని సమూలంగా మారుస్తానని ఆయన అన్నారు.

వ్యాపారరంగ చట్టాన్ని తమ పార్టీయే అమల్లోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. చాలా కాలంగా రాష్ట్రం లో పారిశ్రామిక, రవాణారంగాలు నష్టాల్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వేటినీ అమలు చేయడం లేదన్నారు. రెగ్యురేటరీ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలన్నారు. 1991లో ఈ రంగంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. గతంలో బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇతర పెద్ద కంపెనీలకు అవకాశం కల్పించానని ఆయన చెప్పారు. టూరిస్టు బస్సు యజమానుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

విజయవాడ నుంచి గుంటూరు వరకు ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మించి ఈ రెండింటినీ జంట నగరాలుగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రవాణా రంగ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రంలోని వాహన డ్రైవ ర్లందరికీ ఒకే విధమైన పాలసీ తీసుకు వస్తానని చెప్పారు. ఇప్పుడు అమల్లో ఉన్న బీమాను ఐదు లక్షల రూపాయ లకు పెంచుతానని ఆయన చెప్పారు. ప్రైవేట్ బస్సులకు విధిస్తున్న వ్యాట్ రద్దు చేస్తానన్నారు. 2004లో ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన లైసెన్స్‌లను ఇప్పుడు రద్దు చేస్తానని చెప్పి మళ్లీ కొత్తగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశాలివ్వడం తుగ్లక్ పరిపాలనను గుర్తుకు తెస్తోందని చంద్రబాబు అన్నారు.


రవాణారంగ సమస్యలు పరిష్కారం

కదిపేందుకు కాలు కలిసిరాదు. మాట్లాడేందుకు నోరు సహకరించదు. అయినా, ముందుకే సాగాలి. అవును, ఇది మొండితనమే. నిజమే, చేతులారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడమే. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంచుకురిసే రాత్రుల్లో నడిచాను. నెగళ్లు వేసుకునో, ఉన్ని దుస్తులో, మరేవన్నా చలిని తట్టుకునే వస్త్రాల్లో ధరించి నాకోసం ఎదురుచూసే జనమే ఆ సమయంలో గుర్తుకువస్తారు. నాకోసం రాత్రింబవళ్లూ నిలువు కాళ్ల మీద నిలబడి ఉండే వాళ్ల అభిమానమే నాకు ఆత్మబలం. ఆ బలంతోనే ఇంత మొండిగా, ఇంత నిర్పూచీగా నడు స్తున్నా ను.

కాకపోతే, వాళ్ల ఆవేదన తీరేదాకా, వాళ్ల దిగులు గుండెల బరువు తగ్గేదాకా మా ట్లాడ లేకపోతున్నాననేదే బాధ. వాళ్లతో ఆటలాడి, కష్టాలు అడిగి తెలుసుకుందామని పదేపదే ప్రయ త్నించినా నా వల్ల కాలేదు.ఐదు నిమిషాలైనా వాళ్లతో మాట్లాడలేకపోయాను. ఇటీ వలి కాలంలో గొంతు అస్సలు సహకరించడం లేదు. వాళ్ల మూగబాధను మూగగానే వినాల్సి వస్తోంది. నగరంలో కొండ బతుకు. ఎంత విచిత్రం: ఎప్పుడు ఏ బండ పైన పడుతుందో.. గుప్పెడు ప్రాణాన్ని ఎప్పుడు ఏ విష పురుగు కాటేస్తుందో తెలియదు. ఆ నున్నటి రాళ్లపై నడక చావుతో సమానం. వీళ్లంతా కడుపేదలు. పారిశుద్ధ్య లోపాల వల్ల నిత్యం రోగాల బారిన పడుతున్నారట. పేరుకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

కానీ, అక్కడ సూది, దూది నుంచి ధర్మామీటరు, జ్వరం బిళ్ల దాకా ఏ కనీస వైద్యమూ వాళ్లకు అందడం లేదట. లక్ష కోట్ల బడ్జెట్, అందులోనూ వైద్యశాఖకు వేల కోట్ల కేటాయింపులు ఎక్కడ? పేదల పట్ల ఇంత పరిహాసమా? ఆరోగ్యశ్రీ అంటూ జబ్బలు చరుసుకుంటున్నారుగానీ, వీళ్లలో 76 శాతం వైద్యానికే నోచు కోవడం లేదు. చివరకు ఆరోగ్యశ్రీని కార్పొరేట్ ఆస్పత్రుల సిరుల తరువుగా మార్చివేసిన వైనం నా ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. ఈ సర్కారు రోగానికి మందు వేస్తేగానీ సర్కారు దవాఖానాలు దారికి రావు!

సర్కారు రోగానికి మందేస్తేనే..

చంద్రబాబు పాదయాత్ర మంగళవారం కృష్ణాజిల్లా విజయవాడ తూర్పు, గుం టూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాల్లో జరుగుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరుజిల్లా మంగళగిరి నియోజకవర్గానికి చంద్రబాబు చేరుకుంటారు.

నేడు గుంటూరుకు 'మీ కోసం..'

రౌడీలదే రాజ్యం!
వైఎస్ కుటుంబానికి ప్రజాభిమానం లేదు
రిగ్గింగ్‌లు, హత్యలతోనే గెలుస్తున్నారు
జంట నగరాలుగా విజయవాడ- గుంటూరు
పాదయాత్రలో చంద్రబాబు హామీ

దొంగ సంతకాలతో పిల్ల కాంగ్రెస్, ఓటుకు నోటుతో తల్లి కాంగ్రెస్‌లు ప్రజలను పచ్చి దగా చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. "దొంగ ఓ వ్యక్తిని దోస్తాడు. గజదొంగ ఓ కుటుంబాన్ని లూటీ చేస్తాడు. కానీ, కాంగ్రెస్, వైసీపీలు రాష్ట్రానే దోచేస్తున్నాయి'' అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటోమొబైల్ రంగం సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్-సికింద్రాబాద్ తరహాలో విజయవాడ-గుంటూరును జంట నగరాలుగా అభివృద్ధిచేస్తానన్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ నగరం తూర్పు నియోజకవర్గంలోని శాతవాహన కాలేజీ వద్ద నుంచి సోమవారం పాదయాత్ర కొనసాగించారు. మొగల్రాజపురం, సిద్ధార్థ సెంటర్, సున్నపు బట్టీలు, నిర్మలా కాన్వెంట్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకునేసరికి వేలాదిమంది జనం చంద్రబాబు అడుగులో అడుగు వేశారు. సిద్ధార్థ సెంటర్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు రెండు వైపులా పోటెత్తారు. సిద్ధార్థ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబం, కిరణ్ ప్రభుత్వాలను తూర్పారబట్టారు.

"పులివెందులలో మనుషులను చంపి, అనేక హత్యలు చేసి, ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసి, రిగ్గింగ్ చేస్తూ వైఎస్ కుటుంబం గెలిచిందే తప్ప.. ప్రజాభిమానంతోనూ, నైతికంగానూ ఏనాడు విజయం సాధించలేదు. అదే సమయంలో కుప్పంలో ప్రజాభిమానంతో తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది. దొంగ సంతకాలు చేయటంలో ఆశ్యర్యమేముంది తమ్ముళ్ళూ...! టెక్నాలజీని తెలుగుదేశం పార్టీ దేశాభివృద్ధికి ఉపయోగిస్తే.. ఈ కాంగ్రెస్ దొంగలు దోచుకోవటానికి, అవినీతి, అక్రమాలకు ఉపయోగిస్తున్నారు.కాంగ్రెస్ ఓ తప్పుడు పార్టీ. ఇంట్లో కూర్చుని సభ్యత్వాలు చేర్చుకుని, నోట్లతో ఓట్లను కొని సహకార సంఘాల ఎన్నికలను అపహాస్యం చేసింది. రైతులంతా ఓట్లేశారని లిక్కర్ డాన్ బొత్స అంటున్నారు. ముఖ్యమంత్రి చంకలు గుద్దుకుంటున్నారు.

రిగ్గింగ్ చేయటం ద్వారా పోలీసులతో ఇబ్బందుల సృష్టించడం ద్వారానే గెలిచారన్నది వారిద్దరూ తెలుసుకోవాలి'' అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ వెంట ఎలా కలిసి వచ్చారో అంతే స్వచ్ఛందంగా తనతోనూ కలిసి రావాలని ఆకాంక్షించారు. "63 ఏళ్ల వయసులో మీకోసం కష్టపడుతున్నాను. నా కన్నా మీది చిన్న వయసు. మీకోసం కాకుండా సమాజం కోసం కష్టపడండి. మీరంతా రోడ్డు మీదకు రావాలి. నాకు అండగా నిలబడాలి. నిలబడతారా?'' అని ప్రశ్నించగా, "ఆ.. నిలబడతాం'' అని ముక్తకంఠంతో వేలాదిమంది ప్రతిస్పందించారు.

"జేబుదొంగ ఓ వ్యక్తిని, గజదొంగ ఓ ఇంటినే దోచుకుంటాడు. కానీ తల్లి కాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్‌లు ఈ రాష్ట్రాన్నే దోచేస్తున్నారు'' అని మండిపడ్డారు. ఎన్టీఆర్ పాలనలో రౌడీలు రాష్ట్రాన్ని వదిలి పోయారని, ఇప్పుడు వాళ్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో కిలో ఉల్లిపాయలు రూ.40 ధర పలుకుతోందని, తమ పార్టీ అధికారంలో ఉండగా రూ. 4 మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు పీఆర్‌సీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు.

యాత్రలో భాగంగా, విజయవాడ ఆటోనగర్‌కు సంబంధించి ఆటోమొబైల్, రవాణా రంగ ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే, ప్రత్యేకంగా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తానని, జిల్లాకి ఓ డ్రైవింగ్ స్కూల్‌ను పెడతానని, రవాణా రంగానికి స్పెషల్ సెజ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తానని, ఆటోమొబైల్ వారికి జీరో వడ్డీపై స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని వారికి హామీ ఇచ్చారు. విజయవాడ - గుంటూరు నగరాలను జంటనగరాలుగా అభివృద్ధి చేసి, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్ట్ చేస్తాన న్నారు. ఈ రెండు నగరాలను కలిపి మెగాసిటీ చేసి ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలుపుతామని హామీ ఇచ్చారు.

ఈ దొంగలను తరిమేందుకు కలిసి రండి

విజయవాడ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని, సిబ్బందికి నెలవారీ జీతాలు సక్రమంగా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం సాయంత్రం విజయవాడ నగరంలోని డాబాకొట్ల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్పొరేషన్‌లో కాంగ్రెస్ నాయకుల పరిపాలనా తీరును ఎండగట్టారు. నగరానికి కనీసం డంపింగ్ యార్డుల్లేని స్థితికి తీసుకొచ్చారని, ఈ విషయంలో నాయకులకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. హడ్కో ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. నగరంలో 1.50 లక్షల మంది ఇళ్లు లేని నిరుపేదలున్నట్లు గుర్తించినా వారికి ఈనాటి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు. బుడమేరు ముంపు నుంచి నగరాన్ని కాపాడేందుకు రూ.40 కోట్లు అవసరమని, ఆ సొమ్మును మంజూరు చేయని ప్రభుత్వం తక్షణం నగర వాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్థానిక దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి అధిక వడ్డీలను వసూలు చేస్తోందన్నారు. రూ.50 వేల రుణం తీసుకుంటే లబ్ధిదారుడు రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్‌ను మార్పు చేశారని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన నాయకులు వారి ఆస్తులను దోచుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులకు రూ.600ల చొప్పున పింఛన్ ఇస్తామన్నారు.

సీల్డ్ కవర్ల సీఎం కిరణ్ ఢిల్లీలో పైరవీలు చేసుకోవడంతోనే సమయాన్నంత వెచ్చించిస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.నకిలీ బదిలీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం నకిలీదని చంద్రబాబు వ్యగంస్త్రాలు సంధించారు. ఈ పథకం ద్వారా ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించాల్సిందిపోయి వాటిని పెంచుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలను అందించాల్సిపోయి ప్రజలను మార్కెట్‌లకు వెళ్లి అధిక ధరలకు నిత్యావసరాలను కొనుగోలు చేసుకునేలా చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌వారికే 'గృహకల్ప' రాజీవ్ గృహకల్ప పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయన్నారు. నిజమైనా పేదలు స్థానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇళ్లల్లో తిష్ఠవేస్తున్నారని దీంతో ఇది కాంగ్రెస్ గృహకల్పగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే విధంగా ఆ పార్టీ నాయకులు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.

కార్పొరేషన్‌ను దోచేశారు

 పేదలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత అలుసు.. చాలీచాలని ఇళ్లు ఇచ్చి జబ్బలు చరుచుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం న్యూ రాజరాజేశ్వరీపేటలోని జీ ప్లస్ త్రీ ఇళ్ళ సముదాయం వద్ద జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. అవి అసలు కాపురం చేసే ఇళ్ళేనా? వీటిల్లో కాళ్ళు జాపుకుని పడుకునే వీలుందా? సిగ్గు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలకు నిర్మించి ఇచ్చే ఇళ్ళంటే ఎందుకంత నిర్లక్ష్యం. పేదలతో పెట్టుకోవద్దు. రాబోయే ఎన్నికల్లో వారంతా తడాఖా చూపిస్తారు.. జాగ్రత్త' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ అధికారంలో ఉండగా వ్యాంబే పథకం ద్వారా పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్ళకు వీటికీ ఏమాత్రం పోలిక లేదు. నాణ్యతలో అసలు పోలికే లేదని అన్నారు.

రాజీవ్‌గృహ కల్ప పథకంలో నిర్మించిన ఇళ్ళన్నీ నాణ్యతా ప్రమాణాలు లేక లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు. వాంబే పథకంలో విజయవాడ నగరంలో సుమారు మూడు వేల ఇళ్ళు నిర్మించిఇచ్చామని చంద్రబాబు అన్నారు. పేదలకు భూ పట్టాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రూపాయి తీసుకోకుండా ఇళ్ళ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చెయ్యాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఉచితంగా భూ రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందిస్తామన్నారు. ఎక్కడ పని చేసినా పేదలకంటూ ఒక ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో వ్యాంబే పథకంలో ఇళ్ళు నిర్మించామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ తాగునీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవచేశారు.

విజయవాడ నగరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవస్తుంటారు. వారందకీ ఎలాంటి సదుపాయాలు లేవన్నారు. వారు మూడు పూట్ల తింటానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇది దుర్మార్గపు ప్రభుత్వమని ఎన్నికల్లో ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలో ఐటీ, ఇతర పరిశ్రమలు స్ధాపించడానికి అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయన్నారు. కృస్ణానది నీరు, రైల్వే జంక్షన్, జాతీయ రహదారి వంటి వాటిని ఉపయోగించుకుని నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడకు ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మిస్తానని పేదలకు స్ధానికంగానే ఉపాధి అవకాశాలను కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'బాలికా సంరక్షణ'కు రూ.20 వేలిస్తా టీడీపీ ప్రభుత్వంలో బాలికాసంరక్షణ పథకం ద్వారా అమ్మాయి పుట్టిన వెంటనే బ్యాంకులో రూ.ఐదు వేలు డిపాజిట్ చేసే వారమని, అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.20 వేలు చేస్తామని బాబు ప్రకటించారు. సింగ్‌నగర్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని ఆటో, లారీ తదితర వాహనాల డ్రైవర్లకు బీమా పథకాన్ని వర్తింప జేస్తామని చెప్పారు. ఇక్కడి చేపల మార్కెట్ తదితర విషయాలపై దృష్టి పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావుతో పాటు మరికొంత మంది తనకు చాలా సన్నిహితులని, వారికి ఈ ప్రాంత ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాగవైష్ణవి హత్య జరిగి ఇన్ని ఏళ్ళు గడిచినా కేసు అతీ, గతీ లేదన్నారు. మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కేసు విచరణ చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు.

పేదలంటే ఎందుకంత అలుసు