September 20, 2013

తాము మేధావులు కామని, కాని తెలంగాణ,ఆంద్రలలో జరిగిన అభివృద్దిపై చర్చకు కెసిఆర్ వస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సవాల్ చేశారు. హైదరాబాద్ లో ఎంత అభివృద్ది చేశారో,దానిలో ఎవరి వాటా ఉందో చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ఆమె అన్నారు. లక్షలాది జనం ఇప్పుడు సీమాంద్రలో రోడ్లపైకి వచ్చారంటే పనిపాట లేక వచ్చారని అనుకున్నారా అని ఆమె అన్నారు. కెసిఆర్ కన్నా ఎక్కువగా పిట్టకధలు తాము కూడా చెప్పగలమని ఆమె అన్నారు.

కెసిఆర్ కన్నా పిట్టకదలు చెప్పగలను

జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి ని మూడున్నరేళ్లు జైలులో ఉంచితే, జగన్ ను అప్పుడే వదలిపెడతారా అని టిడిపి ప్రశ్నించింది. జగన్ ను పదహారు నెలలకే వదలిపెట్టే ప్రయత్నం చేస్తోందని రాజకీయాలకు పనికి వస్తారనే అలా చేస్తున్నారని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కేసులో ఒక్క ఆస్తి కూడా జప్తు చేయలేదని ఆయన విమర్శించారు. పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా అని ఆయన ప్రశ్నించారు. పొట్లూరు వరప్రసాద్ పేరును ఛార్జీషీట్లలో ఎందుకు చేర్చలేదని ఆయన అన్నారు. సండూర్ పవర్ పై కూడా కేసు పెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి గీతారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా



అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి త్వరగా బెయిల్‌పై బయటకు రావడం కోసమే హడావుడిగా సీబీఐ చార్జీషీట్లను దాఖలు చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో గతంలో సిబిఐ అదనపు సంచాలకులుగా పని చేసిన లక్ష్మీ నారాయణ ఏడాదిన్నరకు పైగా విచారణ జరిపి ఐదు ఛార్జీషీట్లు వేస్తే, తర్వాత వచ్చిన అధికారులు మాత్రం వారం రోజుల్లోనే ఐదు ఛార్జీషీట్స్ వేశారని అన్నారు. జగన్ బెయిల్ కోసమే తాజాగా హడావుడిగా ఐదు ఛార్జీషీట్లు వేశారని ఆరోపించారు.

గతంలో ఐదు ఛార్జీషీట్లు వేసేందుకు అన్ని రోజులు తీసుకుంటే తాజా ఐదు ఛార్జీషీట్లను వారం రోజుల్లోనే ఎలా వేశారని యనమల ప్రశ్నించారు. జగన్ ఓ విషపు చేప అని ఆయన బయటకు వస్తే చాలా ప్రమాదమన్నారు. జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుందన్నారు. అలాగే అతను జైలు నుండి బయటకు వస్తే సమాజాన్ని అవినీతి విషంతో నింపి వ్యవస్థలను అంతం చేస్తాడని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుంది