November 5, 2012



విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే కాంగ్రెస్ సభ
విదేశీ కంపెనీలకు రాహుల్ బ్రాండ్ అంబాసిడర్
అవినీతిపరులపై చర్యలేవి? : రేవంత్ రెడ్డి

విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సదస్పును ఏర్పాటు చేసిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల వలన రైతులు, వ్యాపారులను చిన్నాభిన్నం చేసే విధంగా ఎందుకు ఎఫ్‌డీఐలను తీసుకువస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సోమవారం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వాల్ మార్ట్ ప్రచారకర్తగా వ్యవహరించారని ఆరోపించారు. కాంగ్రెసు ప్రజా సదస్సు పేరుతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విదేశీ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినట్లుగా ఉందన్నారు. సోనియా, రాహుల్‌లు తమ పేర్ల చివర్ల ఉన్న గాంధీని తొలగించుకోవాలని డిమాండ్ చేశారు. నాడు జాతిపిత మహాత్మా గాంధీ విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే.. నేడు రాహుల్ గాంధీ వాల్ మార్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసంగిస్తున్నారన్నారు. దేశాన్ని నిర్దేశించ వ్యక్తిగా ఆయన తీరు లేదన్నారు.

అవినీతి క్యాన్సర్ వంటిదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిపై సోనియా 16 నిమిషాలు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 20 నిమిషాలు, రాహుల్ గాంధీ 18 నిమిషాలు మాట్లాడారని, క్యాన్సర్ వంటిది అని చెప్పడం మినహా, అవినీతిపరులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెప్పలేదన్నారు. ఒక్క నిమిషం కూడా అవినీతిపరులపై తీసుకునే చర్యల గురించి మాట్లాడలేదన్నారు. సోనియా గాంధీ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గాంధీ పేరును వారు తొలగించుకోవాలన్నారు.

విదేశీ సంస్థలకు కొమ్ముకాసేందుకే కాంగ్రెస్ సభ



రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
రైతులకు పంటబీమా పతకం అమలుచేయాలి
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం
ప్రధాని ఎందుకు పర్యటించలేదు?

 తుఫాను ప్రభావానికి కుదేలైన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వచ్చి మీకు అండగా ప్రభుత్వం ఉందని భరోసా ఇవ్వాలి. అలాంటిది రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతవరకు పర్యటనకు రాలేదని చంద్రబాబు విమర్శించారు.

సోమవారం ఉదయం తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టాన్ని అంచనావేయలేకపోవడం వల్లే రైతులకు పరిహారం అందడం లేదని ఆయన ఆరోపించారు. రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ విధానాల మధ్య రైతులు చితకిపోతున్నారని, రాష్ట్రాన్ని ప్రభుత్వం భ్రష్టుపట్టించందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను సమస్యల సుడిగుండంలో నెట్టి, బలప్రదర్శన కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతుందని చంద్రబాబు అన్నారు. నీలం తుపాన్‌తో రాష్ట్రం అతలాకుతలం అయితే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. గత 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం కంటితుడుపు చర్యలు చేపడుతూ ప్రజల్ని మభ్యపెట్టిందేకానీ, ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. ఇంతవరకు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద ప్రాంతాల్లో సోమవారం ఉదయం టీడీపీ బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. తునిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు బాధితులు పరామర్శించారు. వర్షాల కారణంగా తునిలోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం,రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం