February 7, 2013

దళితులు, మైనారిటీలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు... వీరందరి కష్టాలు తీర్చడమే నా ప్రధాన లక్ష్యం. ఏ వర్గాల కోసం పాదయాత్ర కార్యక్రమం చేపట్టానో... ఆ వర్గాలకు చెందిన వారందరినీ నేడు కలిశాను. వారితో మనసు విప్పి మాట్లాడాను. వారి వాడలకు వెళ్లాను. వీధుల్లో తిరిగాను. వారు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకున్నాను.

గుంటూరు జిల్లాలో కాజా గ్రామం వద్ద మాదిగ తమ్ముళ్లు నన్ను కలిశారు. తమ పల్లెలోకి రావాలని పట్టుపట్టారు. నా యాత్ర మార్గంలో వారి గ్రామం లేనప్పటికీ... నా పట్ల వారు చూపిస్తున్న అభిమానమే నన్ను అటువైపు నడిపించింది. వర్గీకరణ చేస్తానన్న నా మాటపై ఉన్న నమ్మకంతో వారు పాదయాత్ర ఆసాంతం నాకు అండగా నిలుస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి తెలుగుదేశం పార్టీ ద్వారానే సమాధానం లభిస్తుందని వారు గట్టిగా భావిస్తున్నారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాను. కాజా గ్రామంలోనే దళిత క్రిస్టియన్ సోదరులను కలిశాను. క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారిలో పేదరికం పోలేదు. కొందరు వారిని ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ప్రతి దానినీ రాజకీయాలతో ముడిపెట్టడం బాధాకరం.

నంబూరు సభలో ముస్లిం సోదరులు ఓ సభ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మైనారిటీ విధానం వారిలో కొత్త ఆశలు కల్పించింది. వారిని నమ్మకాన్ని వమ్ము చేయను. ఇదే గ్రామంలో రజకులు నన్ను కలిశారు. వారి కష్టాలు చెప్పుకొన్నారు. ఓ సీనియర్ నేతగా, బాధ్యతగల పార్టీకి అధ్యక్షుడిగా కుల మతాలకు అతీతంగా పేదవాళ్లందరికీ అండగా ఉండి, వారిని పైకి తీసుకు రావాలన్నదే నా తాపత్రయం.

అభిమానమే నడిపిస్తోంది


ఇక నుంచి ప్రతీ ఆదివారం తన పాదయాత్రకు విరామం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విరామం రోజున టీడీపీ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీని వలన పార్టీలోని లోటుపాట్లు సరిదిద్దే అవకాశం కలగడంతో పాటు నాయకుల పనితీరును తెలుసుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు తీసుకొన్న ఈ తాజా నిర్ణయంతో ఆదివారం పాదయాత్రకు విరామం లభించనుంది.

అన్ని మతాలను గౌరవించాలి: బాబు

మంగళగిరి: ఒక పార్టీ అన్ని మతాలను గౌరవించాలని చంద్రబాబు చెప్పారు. పాదయాత్రలో భాగంగా.. కాజలో టీడీపీ రాష్ట్ర క్రైస్తవ విభాగం ఏర్పాటు సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పేద వాడికి సహాయ పడాలనే విషయం బైబిల్‌లో స్పష్టంగా చెప్పారన్నారు. క్రైస్తవులలో యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టి లభించే చర్యలు చేపట్టాలన్నారు.

టీడీపీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని, కొన్ని పార్టీలు కొన్ని కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని, అది సమర్థనీయం కాదన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రులు జేఆర్.పుష్పరాజ్, పెద్దిరెడ్డి, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ శాంతరాజు, జనరల్ సెక్రెటరీ జాన్ వెస్లీ, ఉపాధ్యక్షులు పీఎండీ.వరప్రసాద్, సెక్రెటరీలు హేలెన్‌బాబు, రాజ్‌కుమార్ చిట్టి, పాస్టర్లు, బిషప్‌లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రతి ఆదివారం పాదయాత్రకు సెలవు

కిరణ్‌కు ఫోజెక్కువ
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
ప్రజలపై పెద్ద కరెంటు బాంబు వేయబోతున్నారు
జగన్ అవినీతిపరుడని జడ్జీలు నమ్మారు
అందుకే బెయిల్ ఇవ్వడం లేదు
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రంలో ప్రస్తుతమున్నది చెత్త ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డికి సబ్జెక్టు తెలియదని, అయినా సరే తనకంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడుతుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలపై రెండు కరెంటు బాంబులు వేసిన కిరణ్.. మరో పెద్దబాంబు వేయబోతున్నారని చెప్పారు. ర్రాష్టాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి రెండో రోజు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను కొనసాగించారు.

మండుటెండలో నడక కొనసాగిస్తూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ ముందుకుసాగారు. తాను అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలు ఇప్పటివరకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేయిస్తానని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవంతో డబ్బులు సంపాదించుకొనే మార్గాన్ని చూపిస్తానని వాగ్దానం చేశారు. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. జగన్ అవినీతిని చంద్రబాబు మరోసారి ఎండగట్టారు. "జగన్‌కు ఏ న్యాయమూర్తి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. న్యాయవ్యవస్థ ఎంతో పటిష్ఠమైనది. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు''అని పేర్కొన్నారు.

సాక్షి ఒక విషకన్య
సాక్షి పత్రిక, టీవీ రాస్తున్నవి, చూపిస్తున్నవి అన్నీ అసత్యాలేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సాక్షి'ని విషకన్యగా ఆయనన అభివర్ణించారు. "చరిత్రలో ఒక రాజు విషకన్యకు విషం ఎక్కించి తనకు ఇష్టంలేని వాళ్లను చంపేందుకు ఉసిగొల్పుతాడు. అలాంటి విషకన్యే సాక్షి. ప్రజల భూములు బడాబాబులకు దోచి పెట్టి అందులో పెట్టుబడులు పెట్టించారు. అది రాసేవన్నీ తప్పుడు రాతలే. నా పాదయాత్రకు లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అడ్డగోలు రాతలు రాస్తోంది'' అని ధ్వజమెత్తారు. కాజలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాదయాత్రకు ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళగిరి మండలం కాజ గ్రామానికి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

చంద్రబాబు ప్రసంగాలకు 'ఎన్నికల కోడ్ '
ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు, ప్రసంగాలకు గుంటూరులో పోలీసులు అడ్డు చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి పది దాటిన తరువాత రాజకీయ నాయకులు ఎటువంటి ప్రచారం, ప్రసంగాలు చేయకూడదని పోలీసులు చంద్రబాబుకు సూచించారు. దీంతో గురువారం రాత్రి ఆ సమయానికి పెదకాకాని మండలం నంబూరులో చంద్రబాబు ప్రసంగాలు ముగించుకున్నారు. మౌనంగా పాదయాత్ర నిర్వహించి పెదకాకానిలోని శంకర కంటి వైద్యశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

బాబుకు డీహైడ్రేషన్: వైద్యులు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాతావరణం పగలు మండుటెండ, సాయంత్రం చలిగా ఉంటోందని, ఎక్కువసేపు చంద్రబాబు ఎండలో నడవడంతో డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాబుకు గొంతు నొప్పి ఉండటంతో ప్రసంగాల సమయాన్ని తగ్గించుకోవాల్సిందిగా ఆయనకు సూచించానన్నారు. ఎడమ కాలి చిటికెన వేలు నొప్పి తిరగబెడుతూనే ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో వైద్యబృందం బాబును పరీక్షించేందుకు వస్తుందన్నారు.

జగన్ అవినీతిపరుడని జడ్జీలు నమ్మారు అందుకే బెయిల్ ఇవ్వడం లేదు

అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా
మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు
కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి : చంద్రబాబు

ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదనే జగన్మోహన్‌రెడ్డి పిల్ల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని, జైలు పార్టీకి ఓటేస్తే మీరూ జైలుకెళతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ ఎందుకు రావడంలేదో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. జగన్ లక్ష కోట్లు దోచారని సాక్ష్యాత్తు ఒక న్యాయమూర్తే అన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. దీనిని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోందని ఆయన ప్రజలకు వివరించారు.

గురువారం ఉదయం ఎస్ఆర్ఐ వైద్య కళాశాల నుంచి 129వ రోజు పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గుంటూరు, విజయవాడ నగరాలను జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరీల ముఖ్యమంత్రని, ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా జిల్లాలో చంద్రబాబు యాత్రకు అనూహ్యంగా స్పందన వచ్చింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాబుకు నీరాజనాలు పలుకుతున్నారు.

సీఎం కుర్చీ ఇవ్వలేదనే జగన్ పిల్ల కాంగ్రెస్ ఏర్పాటు

నా కాళ్లకు బలం ఈ కార్యకర్తలే. నడుస్తుంది నేనైనా ఉత్సాహంగా మునుముందుకు నన్ను నడిపిస్తుంది వీళ్ల అభిమానధనమే. పాదయాత్ర తొలిరోజు నుంచీ వెంట ఉన్నవారు కొందరైతే, జిల్లాలకు వెళ్లినప్పుడు ఎదురొచ్చి.. తమ జిల్లా పొలిమేరల దాకా వెంట నడిచి వీడ్కోలు చెప్పేవారు మరికొందరు. ఇంతమంది ఇంత కష్టపడుతున్నారు కాబట్టే నేను వేరే ఆలోచన లేకుండా జనంతో మమేకం కాగలుగుతున్నాను. విజయవాడ నుంచి గుంటూరుకి వస్తున్నప్పుడు ఎందుకో తెలియని భావోద్వేగం కమ్మేసింది. నాలోనే కాదు, ఆ కార్యకర్తల్లోనూ కన్నీటి చెమ్మ కదలాడింది. అయినా, ఉత్సాహంగానే నన్ను గుంటూరు జిల్లాకు అప్పగించి వెనుదిరిగారు. వీళ్లకు ఎంత రుణపడ్డానో!

ప్రకాశం బ్యారేజ్ దాటి ఉండవల్లిలో అడుగుపెట్టగానే తాటాకుల గుడిసెల్లోంచి బిలబిలమంటూ జనం బయటకు వచ్చారు.యాత్ర సాగుతున్న మార్గంలో నాలుగైదు చోట్ల మహిళలు గుమిగూడటం కనిపించింది. "ఏమమ్మా ఎలా ఉన్నారు'' అంటూ దగ్గరకెళ్లాను. 'ఎలా ఉంటాం సార్.. మంచినీళ్లు బిందెలు పట్టుకొని క్యూలో నిలుచున్నాం. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట నీళ్లిస్తారు.

తోసుకెళ్లి బిందె ముందుపెడితే నీళ్లు దొరికినట్టు.. లేదంటే లేదు. రోజూ నీటి యుద్ధాలే'' అంటూ నిట్టూర్చారు. పక్కనే కృష్ణా జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీళ్లు సౌకర్యం కూడా కల్పించలేని ఈ పాలకులు దేనికి? ఈ గ్రామంలో ఎక్కడా పక్కా గృహమే కనిపించలేదు. అన్నీ తాటాకు కప్పులే. అవి ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. చిన్నపాటి గాలివాన వచ్చినా బతుకు అతలాకుతలమే. రాష్ట్రమంతా లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని ఊదరకొట్టే పాలకులు..ఉండవల్లి ప్రజలకు ఏమి చెబుతారు?

నా కాళ్లకు బలం వీళ్లే!

సోలార్.. సార్!
పాదయాత్రలో తొలిసారి దర్శనం

గుంటూరు జిల్లాలో ఎండ విరగ కాయడంతో చంద్రబాబు సోలార్ ఫ్యాన్ క్యాప్‌ను ధరించారు. ఈ ఫ్యాన్ సౌరశక్తితో పనిచేస్తుంది. ఫ్యాన్ తిరుగుతూ ముఖంభాగం వరకు చల్లని గాలి వీస్తుంది. ప్రకాశం బ్యారేజి వద్దకు చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వేసవిని తలపించినట్లుంది. ప్రతిరోజూ ఎండ వేడిమి తట్టుకోవడానికి చంద్రబాబు పెట్టే క్యాప్ కాకుండా తొలిసారిగా మొఖంపై ఎదురెండ పడకుండా చల్లదనాన్ని ఇచ్చే పసుపు పచ్చని సోలార్ క్యాప్‌తో దర్శనమిచ్చారు.

ఈ క్యాప్‌ల తయారీకి బెంగళూరు, పుణె ప్రసిద్ధి. ఈ క్యాప్‌కు పై భాగంలో చిన్న సోలార్ ప్యానెల్ బిగించి ఉంటుంది. అది సూర్యరశ్మిని గ్రహించి సోలార్ శక్తిని ఎల్రక్టికల్ శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సోలార్ సెల్‌లో నిక్షిప్తమౌతుంది. అక్కడ నుండి చిన్న వైరు ద్వారా క్యాప్ ముందు భాగంలోని ప్లాస్టిక్ ఫ్యాన్‌కు కనెక్టు చేస్తారు. ఎండ తీవ్రతను బట్టి ఫ్యాన్ వేగం మారుతుంది. వద్దనుకున్నప్పుడు ముందు భాగంలో ఉండే చిన్న స్విచ్‌తో ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పనిచేయడానికి సోలార్ శక్తి నుండి వచ్చే ఐదు వోల్టుల కరెంట్ సరిపోతుంది.

సోలార్ ఫ్యాన్ క్యాప్ పెట్టిన అధినేత

మోసగాళ్లకు మోసగాడు!
ఓటేస్తే ఒడ్డున పడాలని చూస్తున్నాడు
తప్పు చేయకపోతే ఇంతకాలం జైలులోనా?
సచివాలయానికి వెళ్లకుండానే లక్ష కోట్లు
వెళ్లి ఉంటే పంచభూతాలూ మిగలవు
జగన్‌ను ఏకిపారేసిన చంద్రబాబు
గుంటూరులోకి 'మీ కోసం'
తొలి రోజు పాదయాత్రకు జనం బ్రహ్మరథం

"మోసగాళ్లకు మోసగాడు జగన్. ఆయనకు ఓటేస్తే దాన్ని తన కేసుల మాఫీకి తప్ప ప్రజలకు ఏమీ చేయడు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకు సమస్య కాదని, గతంలో ఒకసారి ఆ పని చేస్తే కాంగ్రెస్, వైసీపీలు డబ్బుతో రాజకీయాలను కంపు కొట్టించాయని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న చంద్రబాబు.. బుధవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి జిల్లాలో నడకకు శ్రీకారం చుట్టారు.

ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట, దౌలత్‌నగర్, మంగళగిరి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి మీదుగా 17 కిలోమీటర్లు నడిచారు. అంతకుముందు.. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన శ్రేణులు, జనంతో ప్రకాశం బ్యారేజ్ జనసాగరంగా మారింది. తెలుగు యువత నాయకులు అందించిన పట్టు వ్రస్తాలను చంద్రబాబు కృష్ణానదిలో జారవిడిచారు. ర్రాష్టాన్ని సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మకు నమస్కరించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డప్పు కొట్టి శ్రేణులు ఉత్సాహపరిచారు. సీపీఐ జిల్లా నాయకులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు జెండాలతో వచ్చి స్వాగతం పలికారు. ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు స్వహస్తాలతో తయారు చేసిన పాదరక్షలను బాబుకు బహూకరించారు.

అక్కడ ఇంచుమించు ముప్పావుగంట పాటు మండుటెండలో నిలబడి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వైసీపీలను తూర్పారబట్టారు. "జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండానే ఆయన రూ. లక్ష కోట్లు దోచారు. అదే వెళ్లి ఉంటే రాష్ట్రంలో పంచభూతాలూ మిగిలేవి కావు'' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ సీఎం కాగానే రాష్ట్రంలో దోపిడీకి బీజం పడిందని ఆరోపించారు. "2009 ఎన్నికలకు ముందు ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసి వైఎస్ పోయారు. 'కిరికిరి' సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి వీటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు పంపించి డబ్బులు కొట్టేశారు'' అని ఆరోపించారు.

కృష్ణానదిలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక ప్రదేశంగా తాను అభివృద్ధి చేయగా, రియల్ ఎస్టేట్ పేరుతో దాన్నీ కొట్టేయడానికి కాంగ్రెస్ దొంగలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు 100 చదరపు గజాల స్థలం ఇవ్వని వైఎస్ తన అల్లుడికి మాత్రం బయ్యారంలో లక్షన్నర ఎకరాల గనులను ధారాదత్తం చేశారని ఆరోపించారు. "జగన్‌కు బెయిల్ ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలి. జగన్ రూ. లక్ష కోట్లు దోచారని సాక్ష్యాత్తు ఒక న్యాయమూర్తే అన్నారు. దీనిని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోంది'' అని ప్రజలకు వివరించారు. గుంటూరు, విజయవాడ నగరాలను తాను అధికారంలోకి వస్తే జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

తప్పు చేయకపోతే ఇంతకాలం జైలులోనా?