September 12, 2013

తెలుగు జాతిని గాలికొదిలేసి ఊరుకోలేం



  తెలుగు జాతిని దాని ఖర్మానికి దానిని వదిలేసి కూర్చోలేమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 'కాంగ్రెస్ పార్టీ ఒకరిపై ఒకరిని ఎగదోసి వినోదం చూస్తోంది. రెండు ప్రాంతాల ప్రజలను పరస్పరం శత్రువులుగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. మంటలార్పే కనీస ప్రయత్నమైనా చేయడం లేదు. ఒక ప్రాంతంలో నెల రోజులుగా ప్రజలు రోడ్లపై ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్‌ను, సీమాంధ్రలో వైసీపీని ముందు పెట్టి ఆట ఆడిస్తోంది.

ఈ దుర్మార్గ రాజకీయాన్ని మనం చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోనూ బలంగా ఉన్న పార్టీ మనదొక్కటే. మూడు ప్రాంతాల్లోని తెలుగువారు బాగుండాలి. సమస్యలేమిటో అందరితో చర్చించాలి. ఆమోదయోగ్యంగా పరిష్కరించాలి. సామరస్య పరిష్కారాలు కావాలి. అటైనా ఇటైనా ఇదే మన డిమాండ్. దీనికోసం పోరాడదాం' అని ఆయన తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఇక్కడ తన నివాసంలో రెండు విడతలుగా ఉభయ ప్రాంతాల నేతలతో సమష్టి సమావేశాలు నిర్వహించారు. అధికారంలో ఉన్నప్పుడు నిప్పులా బతికామని, గుండెనిండుగా ఆత్మ విశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ వైఖరిని బలంగా చాటాలని ఆయన వారిని కోరారు.

'మనం ఏం తప్పు చేశామని భయపడాలి? 2004 వరకూ మనది సమైక్య వైఖరి. తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు కూడా అందరి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరాం. వైసీపీ మాదిరిగా ఒకరోజు కేంద్రం తనకు నచ్చింది చేయాలని, మరో రోజు సమన్యాయమని, ఇంకోరోజు సమైక్యవాదమని చెప్పలేదు. ఎవరికీ అన్యాయం జరగవద్దన్నదే మన వైఖరి. తెలుగువారెవరూ మనకు శత్రువులు కారు. అన్ని ప్రాంతాల్లో తెలుగువారు మనను ఆదరించడం వల్లే ఇంతకాలం నిలవగలిగాం. వారి రుణం తీర్చుకోవాలి' అని ఆయన పేర్కొన్నారు.

'జైలు పార్టీలు, ఫాంహౌస్ పార్టీలు మాట్లాడగా లేనిది బయట ఉండి మాట్లాడటానికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఒక ప్రాంతంలో టీఆర్ఎస్‌ను, మరో ప్రాంతంలో వైసీపీని కలుపుకొని రాజకీయం చేయాలని చూస్తోంది. ఈ కుమ్మక్కును మనం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. దూకుడుగా వెళ్ళండి. ఎన్నికలు ఎలా జరిగినా వచ్చేది మనమే. దానికి మన సన్నద్ధతలో వైఫల్యం ఉండకూడదు' అని ఆయన వారితో అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లను టీడీపీ ఖాయంగా గెలుచుకుంటుందని, అందులో అనుమానమే అవసరం లేదని ఆయన ధీమాగా చెప్పారు. ఎన్ని రాజకీయ తుఫాన్లు, ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తల కాళ్లకు మొక్కినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు.

భయపడి ఇంట్లో కూర్చుంటే రాజకీయాలు చేయలేమని, తాను సీమాంధ్ర ప్రాంత పర్యటనకు వెళ్తానంటే చాలామంది నాయకులు వద్దన్నారని, మొండిగా వెళ్లడంవల్ల ఇప్పుడు పార్టీ మెరుగైన స్థితిలో ఉందని ఆయన అన్నారు. ఎన్డీయే హయాంలో తెలంగాణను తానే అడ్డుకున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్య తెలంగాణలో తమకు ఇబ్బంది కలిగించిందని మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే కొత్తకోట దయాకరరెడ్డి అన్నప్పుడు చంద్రబాబు దానిపై వివరణ ఇచ్చారు. 'ఎన్డీయేతో మనం 1998లో కలిశాం. అప్పట్లో మనది సమైక్య వైఖరి.

తెలంగాణ ఆలోచన చేయవద్దని మనం ఆ సమయంలో ఎన్డీయేను కోరిన మాట నిజం. ఆ సమయంలో కేసీఆర్ మన పార్టీలో మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు పార్టీ వైఖరిని సమర్థించాడు. అప్పుడు అసలు తెలంగాణ డిమాండ్ లేదు...ఉద్యమం లేదు. ఆనాటి పరిస్థితినే నేను చెప్పాను. ఆ తర్వాత మారిన పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా మనమే లేఖ ఇచ్చాం. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి' అని చంద్రబాబు ఆయనకు సూచించారు. సీమాంధ్ర ప్రజల్లో సమైక్యవాదన బలంగా ఉందని, దానిని పరిగణనలోకి తీసుకుని పార్టీ వ్యూహాన్ని రూపొందించాలని ఆ ప్రాంత నాయకుడు ఒకరు కోరినప్పుడు... విభజన తర్వాత వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నదే ఇప్పుడు పార్టీ లేవనెత్తుతున్న డిమాండని చంద్రబాబు చెప్పారు.

ఈ వారంలో ఢిల్లీ యాత్ర అవకాశం ఉందని చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు. నెల రోజులకు పైగా రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా ఊరుకోవడం సరికాదని, కేంద్రం స్పందించి వారితో చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలన ్న డిమాండ్‌తో ఆయన ఈ యాత్ర చేయనున్నారు. ప్రధాని, రాష్ట్రపతితోపాటు వివిధ పార్టీల నేతలను కూడా ఈ యాత్ర సందర్భంగా కలవాలన్న యోచనలో ఆయన ఉన్నారు. 'మనం ఏ ఒక్క ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై నెల రోజులుగా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ఒక ప్రాంతంలో పాలన పూర్తిగా స్తంభించింది.

ఇంత పెద్ద వ్యవహారంపై కాంగ్రెస్ తన పార్టీలో కమిటీ వేసుకుంటే దానితో ఉపయోగం లేదు. కేంద్రం నేరుగా రంగంలోకి దిగి సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్టాలి. అందరితో మాట్లాడాలి. ఒకవేళ రాజకీయపార్టీలతో మాట్లాడటం ఇబ్బంది అనుకుంటే ఇరు ప్రాంతాల జేఏసీలను పిలవండి. వారి మనోభావాలు తెలుసుకోండి. ఇద్దరినీ ఒకచోట కూర్చోబెట్టి ఎవరి సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. వదిలేసి ఊరుకోవడం సరికాదు. ఇదే చెబుదాం' అని ఆయన అన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉభయప్రాంతాల నేతలను తనతోపాటు తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. ఢిల్లీ యాత్ర తర్వాత రాష్ట్రంలో ఆయన రెండోవిడత పర్యటన మొదలు కానుంది.

ఒక్కో జిల్లాలో నాలుగైదు రోజులపాటు పర్యటిస్తానని, మొదటి విడతలో మాదిరిగా పూర్తిగా గ్రామాల్లో కాకుండా రోజుకు రెండుమూడు నియోజకవర్గాల్లో పెద్ద సభల్లో పాల్గొనేలా మార్పుచేర్పులు చేస్తున్నానని ఆయన వివరించారు. 'ఈ యాత్ర రాష్ట్రం అంతటా కొనసాగుతుంది. సీమాంధ్ర తర్వాత తెలంగాణలో కూడా పర్యటిస్తాను. మొత్తం 23 జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. ఈ యాత్ర పూర్తి కావడానికి మొత్తం 115 రోజులు పడుతుంది. అయినా పూర్తి చేస్తాను' అని ఆయన చెప్పారు. టీవీ చర్చల్లో పాల్గొనే విశ్లేషకులు వాసుదేవ దీక్షితులు, కుటుంబరావులతో గురువారం ఉదయం చంద్రబాబు తమ పార్టీ నేతలతో భేటీ నిర్వహించారు. టీవీ చర్చల్లో ప్రభావవంతంగా పాల్గొనడంపై వారు తమ సూచనలు ఇచ్చారు.

రెండు ప్రాంతాల ప్రజలను పరస్పరం శత్రువులుగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.

విభజన తర్వాత రాష్ట్ర నెలకొన్న పరిస్థితులపై పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నివాసంలో జరిపిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెస్సే కారణమనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై మరోసారి సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నట్లు ఆ పార్టీ నేత సోమిరెడ్డి తెలిపారు.

పార్టీ నేతలతో ముగిసిన చంద్రబాబు సమావేశం

ముఖ్యమంత్రికి సిగ్గుంటే సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ ప్రధానకార్యదర్శి వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద నియమించే కమిషనర్లకు ఉండాల్సిన అర్హతలపై చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నా వాటిని తోసిరాజని తమ పార్టీకి చెందిన క్రియాశీల రాజకీయ నాయకులను ఈ పదవిలో నియమించాలని ముఖ్యమంత్రి చూడటం దారుణమని, అందుకే కోర్టు ఆయనకు చెంపపెట్టు వంటి తీర్పు ఇచ్చిందని వర్ల వ్యాఖ్యానించారు.


'పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇంతియాజ్ అహ్మద్ టిడిపి అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయారు. ఆయనను ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లోకి తీసుకొని సమాచార కమిషనర్‌గా నియమిస్తారా? ఈ పదవులు ఉంది రాజకీయ పునరావాసానికేనా? తాంతియా కుమారి కాంగ్రెస్ తరపున జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. విజయనిర్మల పోయిన ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్దిగా పోటీచేసి ఆ పార్టీతోపాటు కాంగ్రెస్‌లో చేరారు.

ముఖ్యమంత్రికి సిగ్గుంటే రాజీనామా చేయాలి: టిడిపి

దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఓ కీలు బొమ్మలా మారారని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. 45 రోజులుగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతున్నారని ఆయన అన్నారు. సరైన పాలన కోసం ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని తలసాని పేర్కొన్నారు.

45 రోజులుగా సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతున్నారు...............

అందరూ ఊహించిన రీతిలో కాకుండా ఎవరి ఊహలకూ అందని విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన మొదటివిడత ” తెలుగుజాతి ఆత్మ గౌరవ యాత్ర ” సూపర్ హిట్ అయింది. 14 రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాగిన ఈ యాత్రకు జనం బ్రహ్మరధం పట్టారు. అడుగడుగునా చంద్రబాబు కు ప్రజలు నీరాజనాలు అందించారు. ప్రతిచోటా ఆయన ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. రాత్రిళ్ళు ఆలస్యమైనా, భోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా బాబు కోసం జనం ఎదురు చూడటం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరచింది. వాస్తవానికి చంద్రబాబు చేసిన ఈ యాత్ర చాలా రిస్కు తో కూడిన ప్రయత్నం. ఈ యాత్ర చేయాలనే సంకల్పం బాబు కు రాగానే చాలామంది పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపధ్యంలో విభజన కు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పట్ల సహజంగానే ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు ఉంటాయని, ఈ సమయంలో ఈ యాత్ర చేయటం మంచిది కాదని పార్టీ క్యాడర్ ముక్త కంఠంతో బాబు కు సలహా ఇచ్చింది. బాబు యాత్ర విఫలమయ్యే అవకాశాలు వున్నాయంటూ మీడియా కూడా పలు కథనాలు రాసింది. CBN-Bus-Yatraవిభజనకు తాము అనుకూలమంటూ 2008 లోనే లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ని కార్నర్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ బరిలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ఆ రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పక్క ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్ర లో యాత్ర చేస్తారని ఆ పార్టీలు ప్రశ్నించాయి. బాబు యాత్రకు సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని, చంద్రబాబు కు భంగపాటు తప్పదని ఆ పార్టీలు ఆశించాయి. అయితే చంద్రబాబు మాత్రం మొండిగా ” ఆత్మ గౌరవం ” నినాదాన్ని భుజాన వేసుకుని సాహసంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టి ప్రజాగారం లోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు లో ఈ యాత్రకు ఆయన నాంది పలికారు. తొలిరోజు నుంచే బాబు యాత్రకు ప్రజలనుంచి సానుకూల స్పందన కనిపించింది. ఆయన చెప్పింది జనం శ్రద్ధగా విన్నారు…. స్పందించారు….! దాంతో చంద్రబాబు లో కూడా ఉత్సాహం రెట్టింపయింది. తన విమర్సల దూకుడు, వాడి పెంచారు. ఈ సారి నేరుగా సోనియా గాంధి, మన్మోహన్ సింగ్ , రాహుల్ గాంధి లపై తన పదునైన విమర్సనాస్థ్రాలను సంధించారు. తన కొడుకు కోసం తెలుగు జాతిని రెండుగా సోనియా చీల్చిందని అన్నారు. మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కిలుబోమ్మగా మారాడన్నారు. రాహుల్ ను మొద్దబ్బాయి గా, ముద్దపప్పుగా అభివర్ణించారు. తాము విభజనకు అనుకూలమన్నామే గాని ఒక ప్రాంతానికి అన్యాయం చేయమని చెప్పలేదన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం గైకోందని అన్నారు. రాష్ట్రం లో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని అసమర్దుడిగా పేర్కొన్నారు. తన ప్రసంగాలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ని ఆయన తూర్పారపట్టారు. జగన్ అవినీతి గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలనుంచి విశేష స్పందన రావటం గమనార్హం.
NCBNవిశేషం ఏమిటంటే సమైక్యాంధ్ర ఉద్యమం లో కేవలం కాంగ్రెస్ పార్టీ యే ఉద్యమ కారుల దృష్టిలో మొదటి ముద్దాయిగా నిలబడటంతో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకపవనాలు తక్కువ మోతాదు లోనే వున్నాయి. రెండు ప్రాంతాల లోనూ పార్టీ ని కాపాడుకునే ప్రయత్నంలోనే చంద్రబాబు విభజన విషయంలో లేఖ ఇచ్చారన్న పాజిటివ్ అంశం ప్రజల్లో నాటుకున్నట్టు స్పష్టం అవుతోంది. పైగా చంద్రబాబు చెబుతున్న సమన్యాయం వాదన కూడా సమైక్యాంధ్ర ఉద్యమ శ్రేణులు సానుకూలంగా స్వీకరించాయి. సోనియా గాంధి కేవలం రాహుల్ గాంధి ని ప్రధాని ని చేయటం కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు నిర్ణయించిందన్న విషయాన్ని ఉద్యమకారులు బలంగా నమ్మారు. ఎ పి ఎన్ జి ఓ లు సైతం బాబు యాత్ర ను తాము అడ్డుకోబోమని యాత్రకు ముందే ప్రకటించటం గమనార్హం. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయగలిగితేనే 
విభజన చేయండంటూ ఈ యాత్రలో చంద్రబాబు చేసిన డిమాండ్ ప్రజల్లో బలంగా నాటుకుంది.అందుకే ఆయన సభలకు జనం పోటెత్తారు. అక్కడక్కడా అతి స్వల్ప సంఘటనలు మినహా మొదటి విడత యాత్ర జయప్రదంగా పూర్తి చేయటంలో చంద్రబాబు విజయం సాధించటం సీమాంధ్ర లోని తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీ కలిగించింది అనటంలో సందేహం లేదు. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొనటంలో బాబు సఫలికృతుడు అయ్యారు. సో… ప్రస్తుతానికి తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ లలో తెలుగుదేశం పార్టీ భద్రంగానే వుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy : Telugumirchi.com

అగ్ని పరీక్షను ఎదుర్కొనటంలో బాబు సఫలికృతుడు అయ్యారు. ....