September 12, 2013

అగ్ని పరీక్షను ఎదుర్కొనటంలో బాబు సఫలికృతుడు అయ్యారు. ....

అందరూ ఊహించిన రీతిలో కాకుండా ఎవరి ఊహలకూ అందని విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన మొదటివిడత ” తెలుగుజాతి ఆత్మ గౌరవ యాత్ర ” సూపర్ హిట్ అయింది. 14 రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాగిన ఈ యాత్రకు జనం బ్రహ్మరధం పట్టారు. అడుగడుగునా చంద్రబాబు కు ప్రజలు నీరాజనాలు అందించారు. ప్రతిచోటా ఆయన ప్రసంగాలకు అద్భుతమైన స్పందన లభించింది. రాత్రిళ్ళు ఆలస్యమైనా, భోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా బాబు కోసం జనం ఎదురు చూడటం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరచింది. వాస్తవానికి చంద్రబాబు చేసిన ఈ యాత్ర చాలా రిస్కు తో కూడిన ప్రయత్నం. ఈ యాత్ర చేయాలనే సంకల్పం బాబు కు రాగానే చాలామంది పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపధ్యంలో విభజన కు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పట్ల సహజంగానే ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు ఉంటాయని, ఈ సమయంలో ఈ యాత్ర చేయటం మంచిది కాదని పార్టీ క్యాడర్ ముక్త కంఠంతో బాబు కు సలహా ఇచ్చింది. బాబు యాత్ర విఫలమయ్యే అవకాశాలు వున్నాయంటూ మీడియా కూడా పలు కథనాలు రాసింది. CBN-Bus-Yatraవిభజనకు తాము అనుకూలమంటూ 2008 లోనే లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ని కార్నర్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ బరిలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టేందుకు ఆ రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక పక్క ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్ర లో యాత్ర చేస్తారని ఆ పార్టీలు ప్రశ్నించాయి. బాబు యాత్రకు సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని, చంద్రబాబు కు భంగపాటు తప్పదని ఆ పార్టీలు ఆశించాయి. అయితే చంద్రబాబు మాత్రం మొండిగా ” ఆత్మ గౌరవం ” నినాదాన్ని భుజాన వేసుకుని సాహసంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టి ప్రజాగారం లోకి అడుగుపెట్టారు. గుంటూరు జిల్లా పల్నాడు లో ఈ యాత్రకు ఆయన నాంది పలికారు. తొలిరోజు నుంచే బాబు యాత్రకు ప్రజలనుంచి సానుకూల స్పందన కనిపించింది. ఆయన చెప్పింది జనం శ్రద్ధగా విన్నారు…. స్పందించారు….! దాంతో చంద్రబాబు లో కూడా ఉత్సాహం రెట్టింపయింది. తన విమర్సల దూకుడు, వాడి పెంచారు. ఈ సారి నేరుగా సోనియా గాంధి, మన్మోహన్ సింగ్ , రాహుల్ గాంధి లపై తన పదునైన విమర్సనాస్థ్రాలను సంధించారు. తన కొడుకు కోసం తెలుగు జాతిని రెండుగా సోనియా చీల్చిందని అన్నారు. మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కిలుబోమ్మగా మారాడన్నారు. రాహుల్ ను మొద్దబ్బాయి గా, ముద్దపప్పుగా అభివర్ణించారు. తాము విభజనకు అనుకూలమన్నామే గాని ఒక ప్రాంతానికి అన్యాయం చేయమని చెప్పలేదన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం గైకోందని అన్నారు. రాష్ట్రం లో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని అసమర్దుడిగా పేర్కొన్నారు. తన ప్రసంగాలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ని ఆయన తూర్పారపట్టారు. జగన్ అవినీతి గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలనుంచి విశేష స్పందన రావటం గమనార్హం.
NCBNవిశేషం ఏమిటంటే సమైక్యాంధ్ర ఉద్యమం లో కేవలం కాంగ్రెస్ పార్టీ యే ఉద్యమ కారుల దృష్టిలో మొదటి ముద్దాయిగా నిలబడటంతో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకపవనాలు తక్కువ మోతాదు లోనే వున్నాయి. రెండు ప్రాంతాల లోనూ పార్టీ ని కాపాడుకునే ప్రయత్నంలోనే చంద్రబాబు విభజన విషయంలో లేఖ ఇచ్చారన్న పాజిటివ్ అంశం ప్రజల్లో నాటుకున్నట్టు స్పష్టం అవుతోంది. పైగా చంద్రబాబు చెబుతున్న సమన్యాయం వాదన కూడా సమైక్యాంధ్ర ఉద్యమ శ్రేణులు సానుకూలంగా స్వీకరించాయి. సోనియా గాంధి కేవలం రాహుల్ గాంధి ని ప్రధాని ని చేయటం కోసమే రాష్ట్రాన్ని విభజించేందుకు నిర్ణయించిందన్న విషయాన్ని ఉద్యమకారులు బలంగా నమ్మారు. ఎ పి ఎన్ జి ఓ లు సైతం బాబు యాత్ర ను తాము అడ్డుకోబోమని యాత్రకు ముందే ప్రకటించటం గమనార్హం. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయగలిగితేనే 
విభజన చేయండంటూ ఈ యాత్రలో చంద్రబాబు చేసిన డిమాండ్ ప్రజల్లో బలంగా నాటుకుంది.అందుకే ఆయన సభలకు జనం పోటెత్తారు. అక్కడక్కడా అతి స్వల్ప సంఘటనలు మినహా మొదటి విడత యాత్ర జయప్రదంగా పూర్తి చేయటంలో చంద్రబాబు విజయం సాధించటం సీమాంధ్ర లోని తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నీ కలిగించింది అనటంలో సందేహం లేదు. ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొనటంలో బాబు సఫలికృతుడు అయ్యారు. సో… ప్రస్తుతానికి తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ లలో తెలుగుదేశం పార్టీ భద్రంగానే వుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Courtesy : Telugumirchi.com