May 8, 2013


గైర్హాజరుపై టీడీపీ వర్గాల ఆవేదన

హైదరాబాద్ : పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలుగువారి మనసు గాయపడేలా నిర్వహించారని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. గతంలో పీవీ నరసింహారావు విషయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా వ్యవహరించారని, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఒక తంతులా ముగించారని ఆ పార్టీ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరైనా సోనియా గైర్హాజరు కావడం ఎన్టీ రామారావును అగౌరవపర్చడమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

తెలుగువారిలో తొలి ప్రధాని అయిన పీవీ విషయంలోనూ సోనియా ఇలాగే కక్షపూరితంగా వ్యవహరించారని, ఆయన చనిపోతే కనీసం చూడటానికి కూడా రాలేదని గుర్తుచేశారు. విగ్రహావిష్కరణ కూడా మరీ మొక్కుబడి తంతులా పూర్తి చేశారన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొద్ది నిమషాల్లోనే మొత్తం కార్యక్రమాన్ని పూర్తిచేశారని, ఎన్టీఆర్‌ను స్మరించుకోవడానికి.. ఆయన గురించి రెండు మాటలు చెప్పడానికి ఎవరికీ అవకాశం ఇవ్వలేదని వారంటున్నారు.

'గతంలో ఇతర నేతల విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కనీసం అరగంటపాటు జరిగాయి. ఇప్పుడు మాత్రం అలా జరగలేదు. అనేక మంది ప్రముఖులొచ్చినా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవాల్సి వచ్చింది' అని ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ఒకరు వాపోయారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్లమెంటు ఆవరణలోని తమ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కూర్చున్నప్పుడు ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఉత్తరాది నేతల విగ్రహావిష్కరణ అయితే పార్లమెంటులో దీనికి భిన్నమైన వాతావరణం కనిపించేదని కొందరు ఎంపీలు ఆయనతో అన్నారు.

చంద్రబాబు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. 'అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంలో ఇలాగే చేశారు. పార్లమెంటులో విగ్రహావిష్కరణను సంవత్సరాల ఏళ్లతరబడి సాగదీశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్దాం' అని ఆయన వారితో అన్నారు. కాగా, ఎన్టీఆర్ పట్ల రాజకీయ ద్వేషభావం ఉండటం వల్లే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి రాలేదని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విమర్శించారు.

"జాతికి ఘనమైన సేవలు అందించిన విశిష్ట నేతలకే పార్లమెంటులో విగ్రహం పెడతారు. ప్రతినేతకూ పెట్టరు. లోక్‌సభ స్పీకర్ నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరు కావడం అనవాయితీ. కాని సోనియా గాంధీ ఈ అనవాయితీని విస్మరించి ఎన్టీ రామారావు స్మృతిని అగౌరవపర్చారు. ఇందిరాగాంధీని ఎన్టీఆర్ ధిక్కరించారన్న కక్షనే ఆమె మనసులో పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది. తాను రాకుండా చూసుకోవడానికి ఎంపీల ఫిర్యాదుల వ్యవహారం నడిపించారు. ఆమె రాదల్చుకొంటే ఈ ఫిర్యాదులు ఒక అడ్డా''
- టీడీపీ ఎంపీ

తెలుగువారికి అవమానం సోనియా తీరు అప్పుడూ.. ఇప్పుడూ అంతే

భారతరత్న కూడా సాధిస్తా
పుస్తకావిష్కరణ సభలో పురందేశ్వరి



న్యూఢిల్లీ : తన తండ్రిని అభిమానించే అందరి సహకారంతో ఎన్టీఆర్‌కు భారతరత్నను కూడా సాధిస్తానని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ అనంతరం ఏపీభవన్‌లో దగ్గుబాటి దంపతులు ప్రచురించిన ఎన్టీఆర్ ఛాయాచిత్ర పుస్తకావిష్కణ కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ తెరిచిన పుస్తకం లాంటిదని, కానీ ఆయన వ్యక్తిత్వం గురించి బిడ్డలమైన తమకంటే ప్రజలకే ఎక్కువ తెలుసుకునే అవకాశం లభించిందని ఈ సందర్భంగా పురందేశ్వరి అన్నారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించటం అంత సులభం కాదని, కొంత కష్టమైనా.. ఇకపై తాను ఆ దిశగానే పనిచేస్తానన్నారు. చరిత్ర కొందరిని బాధిస్తుందని, అంత మాత్రాన వారి కోసం చరిత్రను బయటపెట్టకపోవటం సముచితం కాదని, కాబట్టి ఎన్టీఆర్‌తో వెంకయ్యనాయుడికి ఉన్న అనుభవాలను పుస్తకరూపంలో తీసుకురావాలని ఆమె కోరారు. రాజీలేని రాజకీయ యోధుడు ఎన్టీఆర్ అని వెంకయ్య నాయుడు కీర్తించారు. అటు రాజకీయ రంగంలోను, ఇటు చలనచిత్ర రంగంలోను ఎన్టీఆర్ అందం అందరినీ ఆకర్షించేదని, ఇప్పుడు అంత అందం మహేశ్‌బాబుకు మాత్రమే ఉందన్నారు.

రాష్ట్రంలో అసలు సిసలు కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, ఎంతోమంది చేయలేని పనిని ఆయన చేసి చూపించారన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమని సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం ముందు ఒక శకం అయితే, స్వాతంత్య్రానంతరం ఎన్టీఆర్‌తో మరొక శకం ప్రారంభమైందని బాలకృష్ణ అన్నారు. అత్యున్నత శిఖరాలు చేరాలంటే సత్సంకల్పం, అకుంఠిత దీక్ష కావాలని ఆయన ఎప్పుడూ అంటుండేవారన్నారు.

ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మొదలుపెట్టిన కార్యక్రమాలను తర్వాత దేశవ్యాప్తంగా అంతా అనుసరించారని చెప్పారు. ఎన్టీఆర్ బతికుంటే ప్రధాని అయ్యేవారని ఆచార్య కోనేరు రామకృష్ణారావు చెప్పారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదని, తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులంతా సాధించిన విజయమని సభకు అధ్యక్షత వహించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జయకృష్ణ, మోహనకృష్ణ, జయశంకరకృష్ణ, పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ అంత అందం.. మళ్లీ మహేశ్‌కే: వెంకయ్య

న్యూఢిల్లీ : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లక్ష్మీపార్వతి చాలా చురుగ్గా వ్యవహరించారు. సరిగ్గా చంద్రబాబు, ములాయం తదితరులు విగ్రహం వద్దకు వస్తుండగా ఆమె వారికంటే ముందు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ సహా అందరినీ పేరుపేరునా పలకరించారు. స్పీకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో ప్రధానితో పాటు ముందు వరుసలో ఉన్న చంద్రబాబు పక్కనే లక్ష్మీపార్వతి నిలబడ్డారు.

చంద్రబాబును అడిగి మరీ ఆయన చేతిలో ఉన్న గులాబి రేకుల్లో సగం తీసుకుని ఎన్టీఆర్ విగ్రహంపై వేశారు. తాను ఎన్టీఆర్ భార్యనని కొందరికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబం మొత్తం మళ్లీ కలుసుకున్న సందర్భంగా అందరినీ పేరుపేరునా పలకరించానని, ఎవరూ తనను చూసి చిరాకు పడలేదని చెప్పారు. మీరాకుమార్ తనతో మాట్లాడారని, ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారన్నారు. తాను స్పీకర్‌కు క్షమాపణలు కూడా చెప్పానన్నారు.

కలివిడిగా లక్ష్మీ పార్వతి



అత్యంత సంతోషకరమైన రోజు: చంద్రబాబు
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం టీడీపీకి, తెలుగుజాతికి, దేశ ప్రజలకు అత్యంత సంతోషకరమైన సందర్భమని చంద్రబాబు అన్నారు. తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమ నాయకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయటం పట్ల పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ సభ్యుడిగా తనకు ఎంతో ఆనందంగా ఉన్నదని, ఈ కార్యక్రమంలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్ఫూర్తి, ప్రేరణతో తాము ఆయన లేని లోటును భర్తీ చేసుకుంటూ, ఆయన ఆశీస్సులతో ముందుకు వెళుతున్నామన్నారు.

పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తెలుగు ప్రజల చిరకాల వాంఛ అని, దీనికి ఎన్నో అవాంతరాలు ఎదురైనా.. చాలాకాలంగా టీడీపీ ప్రయత్నిస్తూనే ఉన్నదని తెలిపారు. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడం తన అదృష్టమని, ఆయన ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సేవ అంటే ఏమిటో ఆయనే నేర్పించారని చెప్పారు. ఒకసారి 104 డిగ్రీల జ్వరం ఉన్నా.. భారీ వర్షాలతో సతమతం అవుతున్న ప్రజల వద్దకు వెళ్లి వచ్చిన తర్వాతే విశ్రాంతి తీసుకున్నారని, ఇది ఆయన పట్టుదలకు నిదర్శనమని చెప్పారు.



ఒకసారి ఢిల్లీ వచ్చామని, ఆరోగ్య సమస్య రావటంతో ఆయన ఆస్పత్రి పాలైనా, తనను మాత్రం అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు తమ మధ్య ఎన్నో ఉన్నాయన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలని ఆయన తపన పడ్డారన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు.

ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని, సహకార సమాఖ్య వ్యవస్థ ఏర్పడాలని, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి పనిచేయాలన్న సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించారని, అవన్నీ ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తున్నాయన్నారు. సోనియా హాజరు కాకపోవటం, విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదాలను ప్రస్తావించగా.. తమకు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటే ముఖ్యమని, తెలుగు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నది తెలుగు ప్రజలందరి ఆకాంక్ష అని, ఆ మహా నాయకుడికి ఘన నివాళులు అర్పించాలంటే రాజకీయాలకతీతంగా కలసి పనిచేయాలని చెప్పారు.

ఈ మేరకు తాము ఉద్యమాలు చేశామని, ఢిల్లీలోని నాయకులు మాత్రం గుర్తించలేదన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అన్ని మహానాడుల్లోనూ తీర్మానాలు చేశామని, పోరాటాన్ని కొనసాగించి భారతరత్న సాధిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విగ్రహ నమూనా తమ వద్ద ఉన్నదని, దాన్ని పరిశీలించి ఆమోదిస్తే తక్షణం ఏర్పాటు చేయవచ్చని వెల్లడించారు.

హాజరైన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారు.. ఉపరాష్ట్రపతి హమీద్అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు కమల్‌నాథ్, జైపాల్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్, గులాంనబీ ఆజాద్, చిరంజీవి, పళ్లంరాజు, నారాయణస్వామి, రాజీవ్ శుక్లా, మునియప్ప, జ్యోతిరాదిత్య సింథియా, కిల్లి కృపారాణి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి, వెంకయ్యనాయుడు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, అజీజ్ పాషా, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ వోరా, శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలె, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, అన్నాడీఎంకే నాయకుడు తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఒ బ్రెయిన్, లోక్‌శక్తి పార్టీ నాయకుడు రామ్‌విలాశ్ పాశ్వాన్, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, మందా జగన్నాథం, అనూ టాండన్, రాపోలు ఆనందభాస్కర్, స్వతంత్ర ఎంపీ జయప్రద హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలువేసి నివాళులర్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, ఆయన భార్య, బాలకృష్ణ దంపతులు, రామకృష్ణ దంపతులు, విజయకృష్ణ, మోహనకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీడీపీపీ నాయకుడు నామా నాగేశ్వరరావు సహా పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అచ్చతెలుగు పంచెకట్టుతో హాజరై అలరించారు. సినీనటుడు మోహన్‌బాబు, మాజీ ఎంపీలు యలమంచిలి శివాజీ, ఎంవీవీఎస్ మూర్తి, ఎన్టీఆర్ వ్యక్తిగత సిబ్బంది, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారు. కాగా.. వైద్య చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ మాత్రం హాజరుకాలేకపోయారు.

"ఎన్టీఆర్ హీరోయిన్‌ను తాకకుండానే శృంగారం పండించేవారు. ముఖ కవళికలతోనే గొప్ప అభినయాన్ని ప్రదర్శించేవారు. ప్రజలకు ఏదో చేయాలని ఎప్పు డూ తపించిపోయేవారు. రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్''
-బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు

"ఎన్టీఆర్ సభలకు వస్తున్న జనాన్ని చూసిన ఇందిరాగాంధీ.. అందుకు కారణమేంటని అడిగా రు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి వేషాలు వేయడం వల్లేనని కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. అయితే ఆయన శత్రువులుగా నటించినవారిని తే వాలని ఇందిర చెబితే, 'ఆ వేషాలు కూడా ఆయనే వేశార'న్నారు.''
-యలమంచిలి శివాజీ

"మహబూబ్‌నగర్‌లో ఆకలిచావులు ఉన్నాయని ఒకసారి మేం ఎన్టీఆర్‌కు చెప్పాం. వెంటనే దాని పై సమాచారం రప్పించుకుని, 24 గంటల్లో 50వేల కరువు పింఛన్లు మంజూరు చేశారు. అంత వేగం గా స్పందించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయన ప్రజలకు చిరస్మరణీయుడయ్యారు''
- సీపీఐ నేత సురవరం

అత్యంత సంతోషకరమైన రోజు: చంద్రబాబు


విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన బాలకృష్ణ తన సోదరి పురందేశ్వరి నివాసంలోనే బస చేశారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఆయన చంద్రబాబుతో ఉన్నారు. ఆయనతో పాటే టీడీపీపీ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత మళ్లీ పురందేశ్వరి దంపతులు ఏర్పాటుచేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెంటనే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరో కుమారుడు కళ్యాణ్‌రామ్, ఆయన భార్యను వెంట పెట్టుకుని హరికృష్ణ సెంట్రల్ హాల్‌కు వెళ్లారు.

టీడీపీపీ ఆఫీసులో బాలకృష్ణ.. సెంట్రల్ హాల్‌కు హరికృష్ణ





ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకావడంతో అందరి దృష్టీ ఆయనపైనే పడింది. ప్రధాని సహా జాతీయ నాయకులంతా చంద్రబాబును పలకరించారు. ములాయంసింగ్ యాదవ్, శరద్ యాదవ్, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులంతా కార్యక్రమంలో ఉన్నంతసేపూ చంద్రబాబుతోనే ఉన్నారు. అనంతరం సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి పార్లమెంటు భవనంలోని టీడీపీపీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారిరువురూ చాలాసేపు చర్చించుకున్నారు. తర్వాత బయటకు రాగా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ చంద్రబాబును పలకరించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.

అందరి దృష్టీ బాబు పైనే

ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల హాజరు
చంద్రబాబు సహా టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబం రాక
అందరినీ దగ్గరుండి ఆహ్వానించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి
ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న సాధించడమే లక్ష్యం: చంద్రబాబు



న్యూఢిల్లీ : తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహం పార్లమెంటులో ప్రతిష్ఠితమైంది. 9.3 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం 10.30 గంటలకు ఆవిష్కరించారు. పార్లమెంటు భవనంలో రాజ్యసభ ప్రవేశప్రాంతం కుడివైపున దీన్ని ఏర్పాటుచేశారు.

ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ , పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ నాయకులు, టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, లక్ష్మీపార్వతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అందరికీ స్వాగతం పలికారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి మయాచార్యను సత్కరించారు.

పార్లమెంటులో అన్నగారు! ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన స్పీకర్

న్యూఢిల్లీ

సుదీర్ఘ పాదయాత్ర వల్ల ఆయనకు కుడికాలు నొప్పి పెడుతోంది. ఎడమకాలి చిటికెనవేలికి కూడా గాయమైంది. నడుము నొప్పి కూడా బాధిస్తోంది. ఈమేరకు ఆయన్ను పరీక్షించిన వైద్యులు కొన్ని చికిత్సలు చేశారు. బుధవారం కూడా ఆస్పత్రికి రావాలని సూచించడంతో ఆయన హైదరాబాద్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. సాయంత్రం తాను బస చేసిన తాజ్ మాన్‌సింగ్ హోటల్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల తీరుపై చర్చించారు.
: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మధ్యాహ్నం స్థానిక లజ్‌పత్ నగర్‌లోని వర్థన్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు చంద్రబాబును పరీక్షించారు.

చంద్రబాబుకు ఢిల్లీలో వైద్యం.. నేడూ ఆస్పత్రికి

ఆమె గైర్హాజరుకు కారణం ఎవరు
కాంగ్రెస్ ఎంపీలలో తీవ్ర విభేదాలు

న్యూఢిల్లీ : మాజీప్రధాని పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనివ్వకుండా చేసినందుకు అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చాలామంది తప్పుబట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయస్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రాకుండా సోనియాగాంధీ తప్పు చేశారని, తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు కాంగ్రెస్ ఎంపీల నుంచే రావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే సోనియా గౌరవం ఎంతో పెరిగేదని అంగీకరిస్తున్నారు.

నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ మంగళవారం కూడా తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తమ కుటుంబాన్ని ఏకం చేశారని ఎంపీలు అంటున్నారు. కానీ కొద్దిమంది ఎంపీల చెప్పుడు మాటలు విని ఆమె తన స్థాయికి భిన్నంగా వ్యవహరించారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించినందువల్ల తామెలా వెళ్తామని పనబాక లక్ష్మి, కేఎస్‌రావు, సాయిప్రతాప్, అనంత వెంకటరెడ్డి చెప్పడం, మరో ఒకరిద్దరు ఎంపీలు ఆమెకు తప్పుడు సలహాలనివ్వడంతో విగ్రహావిష్కరణకు హాజరు కాకుండా సోనియా వెనుకంజ వేశారని తెలుస్తోంది.

"నిజానికి వైఎస్ ఎన్టీఆర్‌తో తీవ్రంగా విభేదించేవారు. అయినా పార్లమెంట్‌లో ఒక తెలుగునేత విగ్రహావిష్కరణ జరిగితే వెళ్లడం మన ధర్మం.. సోనియా రావట్లేదని తెలిసి వెళ్లలేకపోయాం'' అని కేవీపీ అన్నారు. అయితే అదే సమయంలో సోనియా విగ్ర హావిష్కరణకు రారని తెలిసినా.. కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, బాపిరాజు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్టీఆర్ పట్ల గౌరవంతో విగ్రహావిష్కరణకు వెళ్లారు.

కేవలం పురందేశ్వరి పట్ల కోపంతోనే కొందరు విగ్రహావిష్కరణకు వెళ్లలేదని, సోనియాను కూడా వెళ్లకుండా అడ్డుపడ్డారని వ్యాఖ్యానాలు వినపడ్డాయి. ఏమైనా ఈ కార్యక్రమానికి వెళ్లే విషయంలో కాంగ్రెస్ ఎంపీలలో చీలికలు స్పష్టంగా కనపడ్డాయి. చంద్రబాబుకు ప్రాధాన్యం లభించినా ఈ కార్యక్రమం సుఖాంతం అయినందుకు పలువురు పురందేశ్వరిని అభినందించారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రత్యేకంగా పురందేశ్వరిని పిలిచి ఆహ్వానాల విషయంలో తాను ప్రశ్నించినందుకు ఏమీ అనుకోకూడదని, కార్యక్రమం బాగా జరిగిందని అభినందించారు.

తెలుగువారంటే సోనియాకు గౌరవం లేదా?