September 13, 2013

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో అంతా వెన్నుపోటుదార్లే : సోమిరెడ్డి

ఉన్నత విలువలు, ఉత్తమ పాలకుడు అంటూ గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పొగిడిన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇప్పుడు చంద్రబాబును విలన్ అంటున్నారని తెలుగుదేశం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తన స్వార్ధం కోసం అరవైతొమ్మిది మందిని 420గా మార్చిన జగన్ దేవుడిలా కనిపిస్తున్నారా అని ఆయన ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. విజయమ్మ చుట్టూరా గతంలో చంద్రబాబును పొగిడినవారే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తలను సృష్టిస్తే, జగన్ దొంగలను సృష్టించారని ఆయన అన్నారు. విజయమ్మకు ఒక వైపు జగన్ పై లక్ష కోట్ల ఆరోపణల పుస్తకం రాసిన మైసూరా రెడ్డి, మరో వైపు చంద్రబాబు నిజాయితీకి మారు పేరు అని మెచ్చుకున్న శోభా నాగిరెడ్డి,చంద్రబాబు రాజకీయాలలో ఒక్క మగాడు అని పొగిడిన రోజా ఇంకో వైపు నిలబడ్డారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో లాలూచీ వల్లనే ఇడి తన విచారణను మందగింప చేసిందని, జగన్ ఆస్తులను జప్తు చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు. అన్ని పార్టీలకు వెన్నుపోటు పొడిచినవారినే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో పెట్టుకున్నారని సోమిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఉమ్మారెడ్డి రాసిన పుస్తకాన్ని చూపించి సోమిరెడ్డి విమర్శలు చేశారు.రాజకీయ స్వార్ధంకోసం ఉమ్మారెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

తన స్వార్ధం కోసం అరవైతొమ్మిది మందిని 420గా మార్చిన జగన్ దేవుడిలా కనిపిస్తున్నారా