March 4, 2013

అది పేరున్న పట్టణం.. నాలుగు ప్రధాన నగరాలకు అది జంక్షన్.. అంతకన్నా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహానుభావుడు జన్మించిన ప్రాంతం.. ఇంతటి విశిష్టత కలిగిన ప్రాంతం సహజంగానే అభివృద్ధి చెందాలి. నాలుగు వైపుల నుంచి వీచే గాలులతో ప్రగతిలో ముందుండాలి. దేశంలో ఎక్కడైనా అలా జరుగుతుందేమో తెలియదు.

కానీ, ఆ ప్రాంతం మన రాష్ట్రంలో ఉండటం..అందులోనూ టీడీపీకి కంచుకోట కావడంతో పామర్రు నిర్లక్ష్యపు నీడలోకి జారిపోతోంది. తారక రామారావు నడియాడిన ఈ గడ్డ గుండా నడుస్తుంటే ఆ మహానుభావుడి జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధం మనసులో మెదిలింది. ఎదురైన ప్రతివారూ మామయ్యను గుర్తుచేయడం ఆనందం కలిగించింది. అదేసమయంలో రోడ్డు నుంచి అభివృద్ధి పనులు, పక్కా ప్రభుత్వ భవనాల దాకా.. ఎక్కడా నాటి రూపురేఖలు కనిపించకపోవడం చాలా బాధనిపించింది. ఇలాంటి రద్దీ ప్రాంతం కనీస సౌకర్యాలకైనా నోచుకోకపోవడం రాజకీయ వివక్ష కాదా?

పామర్రు నుంచి కనుమూరుకు దారితీసిన నాకు, ఈ పాలకుల అభివృద్ధిని వెక్కిరిస్తూ ఆ మెగా వాటర్ స్కీమ్ కనిపించింది. నా హయాంలో ఇక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాను. కోటి ముఫ్ఫై లక్షలు మంజూరు చేసినట్టు గుర్తు. అప్పుడు చేసిన పనులే తప్ప మరేమీ కదలిక లేదట. ఇప్పటికీ అది అందుబాటులోకి రాలేదట. ఈ వేసవి ఎద్దడి నుంచి ప్రజలను కంటిరెప్పగా రక్షించే స్కీమ్ ఇది. నా మీద రాజకీయ పోరాటం చేయాల్సిందిపోయి, ఈ అమాయకులను కాల్చుకు తింటున్నారు. ఇదెక్కడి న్యాయం? వీళ్లకసలు పుట్టగతులు ఉంటాయా?

ఆ మహానుభావుడి గడ్డపై నడక!

చంద్రబాబు నాయుడు 150 రోజులుగా చేస్తున్న పాదయాత్ర చూపుతున్న ప్రభావంపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే తర్వాత పరిస్థితి చాలా మెరుగైందని, పార్టీ వాణి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి పాదయాత్ర ఒక బలమైన సాధనంగా ఉపయోగపడిందన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. వంద రోజులతో ఆయన పాదయాత్ర ఆపేస్తే బాగుండేదన్న పార్టీ సీనియర్లు కూడా ఇప్పుడు కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు.

అక్టోబర్ 2న మొదలుపెట్టి.. బాబు ఇప్పటిదాకా రాయలసీమలోని రెండు జిల్లాలు, తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, కోస్తాలో రెండు జిల్లాల్లో ఇప్పటివరకూ పర్యటించారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన వంద రోజుల తర్వాత వచ్చిన సహకార ఎన్నికల్లో ఐదారు జిల్లాల్లో పార్టీ మంచి పనితీరు కనపర్చింది. రెండు జిల్లాల బ్యాంకులను కైవశం చేసుకొంది. 'బాబు పాదయాత్ర వల్ల వచ్చిన స్పందన దీనికి కొంత కారణం' అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ఆ పార్టీ సొంతంగా చేయిస్తున్న సర్వేల్లో పాదయాత్ర తర్వాత టీడీపీ వైపు మొగ్గు కొంత పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

యాత్ర ఓకే.. నేతల సంతృప్తి

పేదల సొమ్ము తినే కుట్ర: బాబు

విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అన్నిరకాల దోపిడీలు అయిపోయాయని, ఆధార్ పేరుతో పేదల డబ్బులు కాజేసేందుకు కాంగ్రెస్ దొంగలు కుట్ర పన్ను తున్నారన్నారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. పామర్రు, బలిపర్రు, పెదమద్దాలి, జమ్మిగొల్లేపల్లి, కొమరవోలు మీదుగా 16 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పామర్రులో జరిగిన సభలో ప్రభుత్వం, విద్యా విధానాన్ని తూర్పారబట్టారు.

" దేశ పురోభివృద్ధికి తోడ్పడే విద్యావ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. దానివల్ల ఈనాడు సమాజం పెడదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ పాపం కాంగ్రెస్‌కు తగిలి తీరుతుంది''అని ఆక్షేపించారు. కోతల వల్ల విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతమన్నారు. " కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఎన్టీరామారావు లాంతరు కింద చదువుకుని మహానుభావుడయ్యారు. ఆ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకెళ్లాలి. కరెంటు కష్టాలకు కుంగిపోవద్దు. లాంతర్ల సాయంతోనైనా చదువు కొనసాగించాల''ని ఉత్సాహపరిచారు.

అభివృద్ధి చెందిన దేశాలలో ప్రభుత్వాలు విద్యని ఉచితంగా అందిస్తుండగా, మనదేశంలో మాత్రం ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఏడేళ్లలో రెండు డీఎస్సీలకు నోటిఫికేషన్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో బొజ్జలు నింపుకోవడం తప్ప కాంగ్రెస్ మంత్రులు విద్యావ్యవస్థపై దృష్టి సారించలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని అనాథని చేశారని విమర్శించారు. వైఎస్ హయాంలో దొంగలు రాజ్యమేలారని, వారిలో కొందరు ఇప్పుడు జైళ్లలో ఉండగా, మరికొందరు కిరణ్ కేబినెట్‌లో కొనసాగుతున్నారన్నారు.

అధినాయకుడు బావయ్యే : బాలయ్య
తెలుగుదేశం పార్టీకి ర థసారథి, నాయకుడు, అధినాయకుడు చంద్రబాబు నాయుడేనని , రెండో పవర్ సెంటర్‌కు తావులేదని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. లోకేశ్ అయినా మరెవరయినా పార్టీలో కష్టపడి పని చేయాల్సిందేనన్నారు. సోమవారం పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. కృష్ణా జిల్లా కొమరవోలులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. పాదయాత్రకు మంచి స్పందన ఉందని, 2014లో టీడీపీకి అధికారం త«థ్యమని చెప్పారు.

ఇది దోపిడీ 'ఆధార్'!

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో అనంతపురం జిల్లా నేతలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, చమన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు పాదయ్రాతపై సునీత ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే స్థానాన్ని తమ జిల్లాకే ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీత మీడియాతో తెలిపారు.

అనంతపురం జిల్లా నేతలతో బాబు సమావేశం

పమిడిముక్కల ప్రజలుచెప్పిన సమస్యలకు పరిష్కారం చూపుతానని రాష్ట్రాభివృద్ధికోసం ప్రపంచ దేశాల నుండి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిచేసి తన నిజాయితీని నిరూపించుకుంటానని మాజీ ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పమిడిముక్కలమండలం మంటాడ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సమస్యలవలయంలో ఉన్నారన్నారు. రాష్ట్రం అదోగతిలో ఉంది. అభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి రాష్ట్రాభివృద్ధికోసం ఆగిపోయిన పెట్టుబడులు మళ్ళీ తీసుకువస్తానని చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో విద్యుత్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని ఫలితంగా ప్రజలపై రూ.32వేల కోట్ల భారంపడిందని చంద్రబాబు చెప్పారు.

ప్రజలు ఆర్థిక భారాన్ని మోస్తూ అష్టకష్టాలు పడుతున్నా సిగ్గుమాలిన ప్రభుత్వంపట్టించుకోవడం లేదన్నారు. మరో వైపు పరిశ్రమలు దివాళా తీసి నిరుద్యోగం పెచ్చుమీరుతున్నా ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. జరుగుతున్న దారుణాలు, ప్రజల కష్టాలు ప్రభుత్వ అసమర్థతను తెలియజెప్పేందుకు తాను వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్నట్లుచంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నారని, శాంతి భద్రతలు క్షీనించి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయని చంద్రబాబు విమర్శించారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు అధికారం కోసం కట్టుక«థలు చెబుతున్నాయని వారి చేతికి అధికారం వెళితే ఇళ్ళ పైకప్పులు కూడ మిగలవని చంద్రబాబు ఎద్దేవ చేశారు.

తన ప్రభుత్వం 2004 లో మిగులు బడ్జెట్‌లను, మిగులు కరెంట్‌ను అప్పగిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఖజానాను జగన్మోహరెడ్డికి దోచిపెట్టారన్నారు. ఇక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమాత్రం జ్ఞానం తెలియని వ్యక్తని పేర్కొన్నారు. రైతులుకరెంట్ కష్టాలను ఎదుర్కొంటున్నారని, కరెం ట్ కోత వల్ల పొలాలకు వెళ్ళిన రైతులు నాలుగువేల మంది పాము కాటుకు, కరెంట్ షాకుకు మరణించారని చెప్పారు. జలయజ్ఞంపేరుతో రూ.80 వేల కోట్లు పనులు చేపట్టి అధిక శాతం దిగమిగ్గారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అందరిని మెప్పించే పరిపాలన అందిస్తానని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఐటీ రంగంలో రాష్ట్రానికి గుర్తింపు తెస్తా అంతర్జాతీయ స్థాయిలో ఐటీని అభివృద్ధిచేసి రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తానని చంద్రబాబు నాయు డు అన్నారు. వెలమకాలనీ సమీపంలో చెన్నై (తమిళనాడు) నుంచి వచ్చిన ఆంధ్ర ఇంజనీర్‌లను ఉద్దేశించి చంద్రభాబు ప్రసంగించారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ప్రతిష్ఠాత్మాకంగా తీర్చిదిద్దానని చెప్పారు. తాను ప్రతి క్షణం యువత అభివృద్ధికోసం తపన పడ్డానన్నారు.ప్రస్తుతం రాష్ట్రం రౌడీలు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల అ డ్డాగా మారిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ రంగ అభివృద్ధికి ఏపీ చిరునామాగా మార్చి 2020 విజన్‌తో రాష్ట్రాభివృద్ధిలో అగ్రగామిగా విరజిల్లే ప్రణాళికను తెస్తే కాంగ్రెస్ పార్టీ దానిని విచ్చిన్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబును కలసిన ఇంజనీరింగ్ ఉద్యోగులు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తేనే పూర్వపు వైభ వం సాధ్యమని పేర్కొన్నారు. పామ ర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ వర్ల రామయ్య, ఎంపీ కొనకళ్ళనారాయణరావు, ఎమ్మెల్సీ వై.వి.వి. రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేస్తా

మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల భవన్‌లో ట్రైబల్ సబ్‌ప్లాన్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఎస్టీ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా సంఘాలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నేతలు తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఎం. శ్రీనివాస్, డి. వెంకటేశ్వరరావు, జగన్నాథం వాకిలయ్య, కె గురవయ్య తదితరులు ప్రసంగించారు. సమావేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం