December 2, 2012

హైదరాబాద్, డిసెంబర్ 2 : తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద జరగనుంది. చంద్రబాబు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఎత్తొండ గ్రామంలో ఆయన ఆదివారం రాత్రి బస చేశారు. అదే గ్రామంలో సోమవారం ఉదయం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఆదివారం వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం ఇక్కడ నుంచి బస్సుల్లో బయలుదేరి అక్కడకు వెళ్తున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈ నెలలో జరగబోయే మరో దఫా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు
చంద్రబాబు పాదయాత్ర సోమవారం నాటికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తెలుగు మహిళ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోఅన్ని నియోజకవర్గాల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపట్టనున్నారు. టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయనున్నారు.

నేడు బాబు వద్ద టీడీఎల్పీ భేటీ


పెంటాఖుర్దులో నేటితో పూర్తి

నిజామాబాద్, డిసెంబర్ 2 : నిజామాబాద్ జిల్లాలో సోమవారం చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటనుంది. అనంతపురం జిల్లా హిందుపూర్ నుంచి అక్టోబర్ 2న ఆయన పాదయాత్ర ప్రారంభించి.. ఈ 62 రోజుల్లో ఐదు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. బోధన్ మండలం పెంటాఖుర్దులో చంద్రబాబు 1000 కిలోమీటర్ల మైలురాయి దాటనున్నారు. ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు పెంటాఖుర్దు వేదికగా వేడుకలకు సిద్ధమవుతున్నాయి.

ఇదే రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా ఉండటంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 1982 డిసెంబర్ 2న జాడి జమాల్‌పూర్‌లో ఎన్టీఆర్ బస చేసిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు కూడా డిసెంబర్ 3న అదే గ్రామంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

జాడి, పెంటాఖర్దుల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను బాబు ఆవిష్కరిస్తారు. అలాగే వెయ్యి మంది మహిళలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. మరోవైపు బాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని రాష్ట్రమంతటా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం 120 మంది రక్తదానం చేయగా, 2 వేల మందికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

1000 కిలోమీటర్ల బాబు యాత్ర


02.12.2012 ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు...(andhrajyothi)

ఇంటికొకరు కర్రపట్టి పోరాడాలి!
బ్రిటీష్ వాళ్ల కన్నా కాంగ్రెస్సే ఎక్కువ దోచింది
అదో గజ దొంగల పార్టీ
మాదిగల పొట్టగొట్టింది వైఎస్సే
దాని కోసమే యువరాజు సేన సర్వే
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి
62 రోజుల్లో ఐదు జిల్లాల్లో నడక

నిజామాబాద్, డిసెంబర్ 2 : "కాంగ్రెస్ గజదొంగల పార్టీ. బ్రిటీష్‌వారి కన్నా ఆ పార్టీ వాళ్లే ఎక్కువ దోచారు. ప్రజాధనాన్ని లూటీ చేశారు. వాళ్లంతా దోపిడీ దొంగలు. వైఎస్, ఆయన స్నేహితులు, అనుచరులంతా కలిసి రూ.8 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్ల దాకా దోచుకున్నారు. భూగర్భ వనరులనూ వదలలేదు. ఈ దొంగలే ఇప్పుడు దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇలాగే కొనసాగితే దేశమూ రాష్ట్రమూ నాశనమవుతాయి. ఈ కాంగ్రెస్ దొంగల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కర్రపట్టుకొని పోరాటం చేయాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా కొడిచర్ల నుంచి ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించి 18.9 కిలోమీటర్ల దూరం నడిచారు. కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి షాపులకు వెళ్లి వారితో మాట్లాడారు. పొతంగల్ బస్టాండ్ ఎదుట ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాన్య ప్రజలు కష్టాల సుడిగుండంలో విలవిల్లాడటానికి వైఎస్ పాలనే కారణమని దుయ్యబట్టారు.

"వైఎస్ సీఎం అయ్యాక హైదరాబాద్ చుట్టూ 8 వేల ఎకరాల భూములు, 23 సెజ్‌లను అమ్ముకొని వేలకోట్లు విదేశాల్లో దాచుకున్నాడు. మాదిగల కోసం మేము వర్గీకరణ తీసుకురాగా వైఎస్ దాన్ని తొలగించి వారి పొట్టకొట్టాడు. మైనారిటీలను మభ్యపెట్టి మోసం చేశాడు'' అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశామని, గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, ఆసుపత్రులు, మౌలిక వసతులు కల్పించామని గుర్తుచేశారు. కానీ కొందరు మాయల మ రాఠీలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. 1994లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తాము అభివృద్థి పథంలోకి తీసుకొస్తే.. తమ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ లక్షల కోట్ల ఆదాయా న్ని దోచుకుందని విమర్శించారు.

"యూరి యా బస్తా కోసం రైతులు లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెంట్ బిల్లు చూస్తే గుండెలు ఆగుతున్నాయి. కరెంట్ ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ దొంగతనం చేయడం వల్లే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తానని చెప్పాను'' అని వివరించారు. మహానేత ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా టీడీపీ బలహీనవర్గాలను పల్లకి ఎక్కించిందని చెప్పారు. "అధికారంలోకి వస్తే 2500 కోట్లతో మైనారిటీల కోసం ప్రణాళికను అమలు చేస్తాం. 15 సీట్లు ఇ స్తాం. ఇస్లామిక్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలను ఇస్తాం '' అని హామీ ఇచ్చారు.

అవినీతిపైన పోరాటం చేస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం అవినీతిని ప్రొత్సహించే నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు చేస్తున్న ప్రయత్నాలే దీనికి నిదర్శనమన్నారు. "రాష్ట్రాన్ని దోచుకుని జైల్లో ఉన్న జగన్ పార్టీతో దోస్తి కడితే తమకు ఎంతలాభం వస్తుందని రాహుల్ అనుచరులు రాష్ట్రంలో సర్వే చేస్తున్నారు. వారికి విలువలు లేవు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పోరాడుతున్నారు'' అని దుయ్యబట్టారు. కొత్త మోసాలు, కొత్త ఎత్తులతో ప్రజలను మళ్లీ వంచించేందుకు టీఆర్ఎస్ నేతలు వస్తున్నారని చెప్పారు. యూపీఏ మోసం చేసిందని, ఇక ఎన్డీయేను విశ్వసిద్దామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నట్టు వచ్చిన వార్తలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

" తెలంగాణ కోసం తనను ఢిల్లీ పిలిచారని చెప్పిన కేసీఆర్ అక్కణ్నుంచి వచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని దొంగనాటకం ఆడుతున్నారు. కానీ తామసలు కేసీఆర్‌ను పిలువలేదని వయలార్ రవి ప్రకటించారు. మొన్న బీజేపీని తిట్టిన కేసీఆర్, ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడతానని చెపుతున్నాడు. ఇది ద్రోహం కాదా?'' అని బాబు ప్రశ్నించారు. బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్ ఎడారిగా మారే పరిస్థితి ఉంటే కేసీఆర్ ఎందుకు పోరాటం చేయలేదని,ఆ పని చేసిన తమను ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ లాంటి వారిని నమ్ముకుంటే అధోగతి పాలు తప్పదని, ఆయన వల్ల ఒరిగేదేమి ఉండదని చెప్పారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని మిగిలిన పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు అధికారం ఉందని, అందువల్ల తెలంగాణపై వారే నిర్ణయం తీసుకోవాలన్నారు. బిల్లుపెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కావాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

" వైఎస్ ఉన్నప్పుడు నాపై 35సార్లు కోర్టుకు వెళ్లారు. 25 విచారణ కమిటీలు వేశారు. నిజంగా నేను తప్పు చేస్తే వదిలిపెట్టేవారా? నేను నిజాయితీతో ఉన్నాను. విలువలు పాటిస్తున్నాను. అందుకే నా ఆస్తులూ ప్రకటించా''నని గుర్తు చేశారు. మిగిలిన పార్టీల నేతలు ఈ పని చేయగలరా అని ప్రశ్నించారు. పాదయాత్ర తన కోసం కాదని, జనం కోసం అని పునరుద్ఘాటించారు.

"నా లాంటి నాయకుడు ఈ వయసులో ఇలాంటి యాత్ర చేయలేడు. సామాజిక న్యాయం కోసమే ఇదంతా. ఏ పార్టీ మేలు చేస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని కష్టాల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావడానికే నేను వచ్చాను'' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శనివారం రాత్రి చంద్రబాబును చూసేందుకు వచ్చారు. పాదయాత్ర కొడిచర్లకు చేరుకునే సమయానికి అక్కడికి చేరుకున్న ఆమె బాబుతో పాటు రాత్రి బస చేశారు. ఉదయం రెం డు గంటల వరకు భువనేశ్వరి, బాబుతోనే ఉన్నారు. ఇదిలాఉండగా చంద్రబాబు ఉదయం ఫిజియోథెరపీ చేయించుకున్నారు. దీని వల్ల యాత్ర ఆలస్యంగా మధ్యాహ్నం 3.05 గంటలకు ప్రారంభించారు.

వైసీపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు రాహుల్ యత్నం


నిజామాబాద్‌లో ఆరో రోజైన సోమవారం ఎత్తొండ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తారు. క్రాస్‌రోడ్డు మీదగా పెంటాఖుర్దు చేరతారు. అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనూ పార్టీ టీడీపీఎల్పీ భేటీలోనూ పాల్గొంటారు. అనంతరం పాత సాలంపాడ్ మీదుగా కుమ్మనపల్లి, సాలూర క్యాంప్, సాలూర గ్రామాలకు చేరతారు. అక్కడనుంచి జాడి జమాల్‌పూర్‌కు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

నేటి షెడ్యూల్..

62 వ రోజు ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు 02.12.2012

62 వ రోజు ఆదివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 02.12.2012

ముందుచూపు ఎవరిది!? ప్రజా ప్రయోజనాలతో రాజకీయం చేసింది ఎవరు!? టీడీపీ హయాంలో నిజాంసాగర్ నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు ఇవ్వడమే కాకుండా చివరి ఆయ కట్టు భూములకూ సాగునీరు అందించాం. కాల్వల ఆధునికీకరణ చేపట్టాం. నిజాం సాగర్ నీళ్లను పూర్తిగా సాగుకే ఉపయోగించాలని హైదరాబాద్‌కు కృష్ణా నీళ్లు తీసుకొచ్చా. మంజీరా నీటిని కూడా చివరి ఆయకట్టు వరకూ అందేలా చేశా!

రెండేళ్ల కిందట బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశా. మాజీ ముఖ్యమంత్రి హోదాను కూడా పక్కనపెట్టి మూడు రోజులపాటు పక్క రాష్ట్రంలో జైల్లో ఉన్నాను. కానీ, ఆరోజు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నుంచి సంఘీభావం లభించలేదు. ఇతర రాష్ట్రాలతో మనకు సమస్య వచ్చినప్పుడు వాటి నుంచి నైతిక మద్దతు కూడా లభించలేదు. టీఆర్ఎస్ పట్టించుకోలేదు. సరికదా.. ఎగతాళి కూడా చేసింది. మహారాష్ట్ర మంచినీళ్ల కోసం కట్టుకున్న ప్రాజెక్టును నేను రాజకీయం చేస్తున్నానని విమర్శించింది. కానీ, బాబ్లీ ఫలితాలు ఇప్పుడిప్పుడే ఇక్కడ బయటపడుతున్నాయి. బాబ్లీ పూర్తయితే ఎస్సారెస్పీ పరిధిలోని ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని నేను అప్పుడే గుర్తించి పోరాటం చేశా.

ప్రభుత్వం లిఫ్టులు వేయకపోవడంతో మంజీరా నది పరిధిలోని రైతులు బృందాలుగా ఏర్పడి పొలాలకు సొంతంగా లిఫ్టులు వేసుకున్నారు. విద్యుత్తు లేకపోవడంతో అవి వృథాగా పడి ఉన్నాయి. నిజాంసాగర్ ఆయకట్టు చివరి భూములకూ నీళ్లు రావడం లేదు. ఇటు కరెంటు లేక లిఫ్టులూ పని చేయడం లేదు. రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ఇప్పుడు సర్వత్రా ఒక్కటే సమస్య! కరెంటు.. కరెంటు.. కరెంటు! ఇది కాంగ్రెస్ చేసిన పాపం! నీటి వినియోగంలోనూ విద్యుత్తు సరఫరాలోనూ ముందుచూపు లేని ఫలితం!

ముందు చూపు ఎవరిది?


కన్నులు మూయరు.. గన్నులు వీడరు
కంటికి రెప్పలా బాబు భద్రత
ఆయనతో పాటే నిరంతర పాదయాత్ర
సరిహద్దులతో సంబంధం లేకుండా భద్రత
భద్రతా సిబ్బందిలో ఎన్ఎస్‌జీ, స్థానిక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీ
విధి నిర్వహణలో భాగంగా వేల కిలోమీటర్ల నడక

(బాబు పాదయాత్ర నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధులు) 'వస్తున్నా.. మీకోసం' అంటూ ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు! 'మీ కోసమే వస్తున్నాం' అంటూ ఆయనతోపాటు మరికొంతమంది కూడా పాదయాత్ర చేస్తున్నారు! ఒకరు ఇద్దరు కాదు.. వందమందికిపైగానే! వీరంతా టీడీపీ కార్యకర్తలు కాదు! రాజకీయ నాయకులు అసలే కాదు. వారికి అసలు రాజకీయాలే అక్కర్లేదు కూడా!!

కానీ, విధి నిర్వహణలో భాగంగా వారు పాదయాత్ర చేయాల్సి వస్తోంది! వారే.. చంద్రబాబు భద్రతా సిబ్బంది! కన్నులు మూయరు! గన్నులు వీడరు! నిరంతరం తమ నేతను కంటికి రెప్పలా కాపాడతారు! బాబుకు వారే 'వీరభద్రులు'! దాదాపు రెండు నెలలుగా చంద్రబాబు వెంట నడుస్తూ.. పాదయాత్రలో భాగమైన భద్రతా సిబ్బందిని 'ఆంధ్రజ్యోతి' పరిశీలించింది!

చంద్రబాబు అనంతపురంలో పాదయాత్ర చేస్తుంటే ఆ జిల్లా నేతలు ఆయనను అనుసరించారు. జిల్లా సరిహద్దులు దాటగానే వారు కనుమరుగయ్యారు. ఆ తర్వాత బాబును కర్నూలు జిల్లా నేతలు అనుసరించారు. కానీ, జిల్లాలూ సరిహద్దులతో సంబంధం లేకుండా పాదయాత్ర యావత్తూ నడవడమే కాకుండా చంద్రబాబును కంటికి రెప్పలా చూసుకునేది మాత్రం భద్రతా సిబ్బందే! కేజీలకొద్దీ బరువుండే తుపాకీలను చేతపట్టుకుని నిరంతరం వారు చంద్రబాబు చుట్టే ఉంటారు. నెలల తరబడి కుటుంబాల ముఖాలను కూడా చూడరు.

ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప చిన్న పని గురించి కూడా ఆలోచించని నేటి రోజుల్లో వారి అంకితభావం నిజంగా వెల కట్టలేనిదే! చంద్రబాబు భద్రతా సిబ్బందిలో మూడు రకాల సిబ్బంది ఉన్నారు! వీరిలో మొదటి రకం ఎన్ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమెండోలు! రెండోది.. స్థానిక పోలీసులు! మూడోది, చంద్రబాబు పర్సనల్ సెక్యూరిటీ! ఎన్ఎస్‌జీ కమెండోలు ఆరుగురు ఉంటే.. బాబు పర్సనల్ సెక్యూరిటీ మరో తొమ్మిదిమంది ఉంటారు! దాదాపు 120 మంది వరకు స్థానిక పోలీసులు పాల్గొంటారు. వీరందరూ ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఎస్‌వో) నియంత్రణలో ఉంటారు.

వారే.. డీఎస్పీ స్థాయికి చెందిన నగేశ్, ఏఎస్పీ స్థాయికి చెందిన నాగేంద్ర! వీరు వారానికోసారి డ్యూటీ మారతారు. ఆ వారం రోజులూ సీఎస్‌వోలు చంద్రబాబు వెంట పూర్తిగా నడుస్తూనే ఉంటారు. స్థానిక ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భద్రతను పర్యవేక్షిస్తారు. బసలో చంద్రబాబు బస్సులోకి వెళ్లిపోయిన తర్వాత స్థానిక పోలీసులు, పర్సనల్ సెక్యూరిటీతో సమీక్షిస్తారు. తర్వాతి రోజు రూట్ మ్యాప్, భద్రతా చర్యలు, సవాళ్లు తదితరాలను సమీక్షిస్తారు.

బ్లాక్ క్యాట్స్..
ఒంటినిండా నల్లటి దుస్తులు, భుజాలపై అత్యాధునిక ఆయుధాలు. రాత్రీ పగలూ తేడా లేకుండా విధులు! ఇదీ బ్లాక్ క్యాట్ కమెండోల ప్రత్యేకత. దేశంలోని ఏ ప్రాంతంలో విధులు కేటాయించినా కంటికి రెప్పలా భద్రతపై దృష్టి సారించడం వీరి నైజం. బాబు భద్రతా దళంలో 15 మంది కమెండోలు ఉన్నారు. వీరు మూడు రోజులకోసారి విధులు మారుతుంటారు. విడతల వారీగా ఏడుగురు చొప్పున రోజూవారీ విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో ఒకరు ఇన్‌స్పెక్టర్ అయితే, మిగిలినవారు కమాండర్లు. ఇన్‌స్పెక్టర్ భద్రతను పర్యవేక్షిస్తే ఒకరు ఆ రోజంతా పూర్తి విశ్రాంతిలో ఉంటారు. మిగిలినవారు చంద్రబాబును అనుసరిస్తారు. వీరిలో ఒకరు ప్రతి గంటకూ మారుతుంటారు.

మారిన వ్యక్తి వాహనంలో విశ్రాంతి తీసుకుంటారు. కమాండర్లు ప్రతి గంటకూ హైదరాబాద్‌లోని ఎస్పీకి నివేదిక పంపిస్తారు. దానిని వారు ఢిల్లీకి పంపుతారు. యాత్ర వివరాలు, సమస్యలు, సవాళ్లు అందులో పేర్కొంటారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా నెలల తరబడి వీరు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఏడాదిలో మూడు నెలలు మాత్రమే వీరికి సెలవులు. ఆ సెలవుల్లోనే కుటుంబాలతో గడపాల్సి ఉంటుంది.

స్థానిక పోలీసులు
స్థానిక పోలీసుల్లో దాదాపు 120 మంది వరకు చంద్రబాబు భద్రతా దళంలో ఉంటారు. వీరు రోప్ పార్టీ.. ఎస్కార్టు.. బాంబు డిస్పోజల్ స్వ్కాడ్, రోడ్ ఓపెనింగ్ పార్టీ.. కూంబింగ్ పార్టీ అని పలు రకాలు. ఏ జిల్లాకు ఆ జిల్లా పోలీసులనే ఇందుకు వినియోగిస్తారు. సరిహద్దు మారగానే చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించే జిల్లా పోలీసులు ఆయన భద్రత బాధ్యతను తీసుకుంటారు. పాదయాత్రకు రెండు కిలోమీటర్ల ముందు ఒక బృందం వెళుతుంది.

కూంబింగ్‌లో భాగంగా రోడ్డు పక్క నిశితంగా పరిశీలిస్తుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై చంద్రబాబును చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్నప్పుడు రోప్ పార్టీ క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. తోసుకొస్తున్న ప్రజలను అదుపు చేస్తూ, పాదయాత్రకు మార్గాన్ని సుగమం చేస్తూ.. ఆయన భద్రతను కంటికి రెప్పలా కాపాడుతూ ఏకకాలంలో వివిధ విధులను వీరు సమర్థంగా నిర్వర్తిస్తారు.

కాలి మడమకు ఇబ్బంది వచ్చిన తర్వాత చంద్రబాబు రోడ్డు పక్కన ఉన్న మట్టిరోడ్డుపై పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పూర్తి బహిరంగంగా ఉండడంతో సెక్యూరిటీ వారికి మరింత సమస్యగా మారింది. ఇక, చంద్రబాబును కలిసి మాట్లాడాలని, ఆయనతో కరచాలనం చేయాలని వచ్చే పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి తిట్లు, శాపనార్థాలు మామూలే!

పర్సనల్ సెక్యూరిటీ
చంద్రబాబు పర్సనల్ సెక్యూరిటీలో తొమ్మిదిమంది ఉంటారు. ముగ్గురు సెక్యూరిటీ ఆఫీసర్లు కాగా ఆరుగురు గార్డులు. విసుగూ విరామం లేకుండా వీరు నిరంతరం చంద్రబాబు వెంటే నడుస్తుంటారు. ఈ బృందం మూడు రోజులకోసారి మారుతుంది. చంద్రబాబు పిలిస్తే తప్ప ఎవరినీ ఆయన సమీపానికి రానివ్వరు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే నైట్ క్యాంపులోకి అనుమతిస్తారు.

అయితే, చంద్రబాబు పొలాల్లోకి వెళ్లడం, ప్రజలతో మమేకం కావడంతో భద్రత వీరికి కాస్త సవాలుగానే మారుతోంది. ఇక, చంద్రబాబు బస చేసినప్పుడు భద్రత వీరికి మరొక సవాలు. నలుదిక్కులా కిలోమీటరు పరిధిని వీరు ముందుగానే తమ నియంత్రణలోకి తీసుకుంటారు. రాత్రంతా పెట్రోలింగ్, నిశిత పరిశీలన తప్పనిసరి. అది నక్సల్ ప్రభావిత ప్రాంతమా? నక్సల్ సానుభూతిపరులు ఉన్నారా? అని ఆరా తీస్తారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైతే వీరి బాధ్యత రెట్టింపు అవుతుంది. నైట్ టీమ్‌లో స్థానిక పోలీసులు కూడా ఉంటారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు ఉంటారు.

భద్రతే మాకు ముఖ్యం
నాగేంద్ర, చంద్రబాబు సీఎస్‌వో

చంద్రబాబు పాదయాత్రలో ఇప్పటి వరకు ఏ జిల్లాలోనూ సమస్య రాలేదు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అధికారులు చక్కగా సహకరించారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నాం. రాబోయే తెలంగాణ జిల్లాల్లో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. కనక మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉంటున్నాం కూడా. పాదయాత్రలో ప్రజలు, నాయకుల నుంచి మాకు ఛీత్కారాలు, శాపనార్థాలు తప్పడం లేదు. అయినా, వీఐపీల భద్రతే మాకు ముఖ్యం. అదే సమయంలో, పాదయాత్ర ఉద్దేశం దెబ్బతినకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం.

బాబుకు వీరభద్రులు!


అందులో చేరే వారంతా ముందు జైలుకెళతారు
అంతా డబ్బు మాయ
బెల్లం చుట్టూ మూగే ఈగలవి
వైసీపీలోకి వలసలపై చంద్రబాబు నిప్పులు
ఎస్సీ నిధుల మళ్లింపు పాపం వైఎస్‌దే
రాష్ట్రాన్ని దివాలా తీయించాడు

నిజామాబాద్, డిసెంబర్ 1 : " వైసీపీ.. దొంగల పార్టీ. ఏదైనా మంచిపని చేయాలనుకుంటే మనం దేవుణ్ణి పూజిస్తాం. కానీ, ఆ పార్టీలోకి వెళ్లేవారు జైలుకు వెళ్లొచ్చి ఆ తరువాత ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతా డబ్బు మాయ. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడే ఉంటాయి'' అంటూ 'జంప్ జిలానీ'లపై టీడీపీ అధినేత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎస్సీల నిధులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎసరు పెట్టినట్టు చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజలను మోసాలు చేసే పార్టీలను తరిమి కొట్టాలని, తెలుగుదేశం పార్టీకి 42 ఎంపీ సీట్లు, అన్ని అసెంబ్లీ సీట్లలో గెలిపిస్తే రాష్ట్ర ముఖచిత్రాన్ని మారుస్తానని, కేంద్రంతో కొట్లాడి గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తానని ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో నాలుగోరోజైన శనివారం మైలారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్, బీర్కూర్‌లలో ఏర్పాటు చేసిన సభల్లోనూ, మీడియాలోనూ జగన్, కేసీఆర్ పార్టీల తీరును తూర్పారబట్టారు. అవినీతి సొమ్ముతో టీవీ చానల్, పేపర్ పెట్టి అరాచకాలు చేస్తున్నారని, తప్పుడు రాతలు రాసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అలాంటివారు తమనేమీ చేయలేరని హెచ్చరించారు. వైఎస్ వల్లనే రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు. పేదల సొమ్ము దోచుకున్న వారే రైతుల రుణ మాఫీ వద్దంటున్నారని మండిపడ్డారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం 2002లోనే జీవో తీసుకొచ్చామని గుర్తు చేశారు. టీడీపీ చేపట్టిన ఈ పథకాన్ని మరింత మందికి వర్తింపజేయడం తప్ప వైఎస్ చేసిందేమి లేదని అన్నారు. వైఎస్ హయాంలోనే వ్యవస్థ పూర్తిగా పతనమైందని, ఇప్పుడు రైతులకు నాలుగు గంటలు కాదుకదా ఒక్క గంట కూడా కరెంటు రావడంలేదని ఆరోపించారు. అవినీతి, అసమర్థ కాంగ్రెస్ పాలనే దీనికి కారణమన్నారు. ప్రజల సమస్యలు తెలియని కిరికిరి.. ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడని, ఇలాంటి అసమర్థులు ఎక్కడా ఉండరని దుయ్యబట్టారు.

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం వారితో చెలగాటం ఆడుతోందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ తన కనుసన్నల్లో ఉందంటూ ప్రజలను కేసీఆర్ మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా చేసినా, ఆయన పార్టీ నేతలు రాష్ట్ర మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమిటని ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా పట్టించుకోని కేసీఆర్..తన కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని కోరారు.

కాలు అడ్డంపెడితే గోదావరి నీళ్లు వస్తాయని చెప్పిన కే సీఆర్‌కు, అలా చేయొద్దని ఎవరైనా చెప్పారా అని నిలదీశారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం ప్రధాని పదవినే వదులుకున్నానని, గుజ్రాల్‌ను ప్రధాన మంత్రి చేసింది తానేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీని అనుసంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తానని భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

"మాది బడుగు, బలహీన వర్గాల పార్టీ. ఉప ప్రణాళికను సమర్థిస్తున్నాం. అయితే, ఆ నిధులను ఎస్సీ,ఎస్టీ నివాస ప్రాంతాల అభివృద్ధికే కేటాయించాలి. దీనికోసం నోడల్ ఏజన్సీలను ఏర్పాటు చేయాలి. నిధుల వినియోగంపై పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్‌కు కాక అంబుడ్స్‌మెన్‌లకు అప్పగించాలి. ఉప ప్రణాళిక చట్టానికి పదేళ్ల కాల పరిమితి పెట్టారు. ఈ కొద్ది కాలంలో దళితులు అభివృద్ధి చెందుతారా? దీనిపై ప్రభుత్వ వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఖర్చుకాని నిధులను తిరిగి ఖర్చుచేసేలా చూడాలే గానీ, వేరే పథకాలకు మళ్లించరాదు.

అలాగే.. నిధుల కేటాయింపులో ఏ,బీ,సీ,డీ వర్గీకరణకు ప్రాధాన్యతనివ్వాలి'' అని సూచించారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు పాపం వైఎస్‌దేనని దుయ్యబట్టారు. " వైఎస్ అధికారంలో ఉండగా, 21వేల 200 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారి పట్టించారు. ఔటర్ రింగ్ రోడ్, హుసేన్ సాగర్ ఆధునికీకరణ, అభయారణ్యాల నిర్మాణాలకు ఆ నిధులను వెచ్చించారు 13వేల 90కోట్ల నిధులను ప్రణాళికలో పెట్టి కేవలం పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1 కోటి 23 లక్షల మంది దళితులుండగా, 64 లక్షల మంది మాదిగ ఉప కులాల వారు ఉన్నారని, వారికి న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పదని స్పష్టం చేశారు.

తన హయాంలో వర్గీకరణ అమలుచేసి.. 24వేల 500 ఉద్యోగాలను మాదిగ ఉప కులాల సోదరులకు అందించినట్టు చెప్పుకొచ్చారు. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే వర్గీకరణను రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందన్నారు. సామాజిక న్యాయం టీడీపీ బాధ్యత అని, అందుకే ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారీటీ డిక్లరేషన్ ప్రకటించామని గుర్తుచేశారు. రాష్ట్రపతి పదవిని దళితుడైన నారాయణ్‌కు, పార్లమెంట్ స్పీకర్ పదవిని బాలయోగికి, అసెంబ్లీ స్పీకర్ పదవిని ప్రతిభాభారతికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కాకి మాధవరావుకు ఇచ్చామని గుర్తుచేశారు.

నడక కష్టమై.. అరగంట విశ్రాంతి
పాదయాత్రలో చంద్రబాబు ఉత్సాహంగా కనిపిస్తున్నా, బొబ్బలెక్కిన కాళ్లతో అడుగు తీసి అడుగు వేయలేపోతున్నారు. రోడ్డుపక్క మట్టిలో నడవడం వంటి 'దారులు' వెతుక్కుంటున్నా పరిస్థితి కష్టంగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం బొబ్బలెక్కిన కాళ్లతో నడవలేక తిమ్మాపూర్ సమీపంలో అరగంటసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి ముందుకు సాగారు

అదో దొంగల పార్టీ:చంద్రబాబు