January 4, 2013



మా ఇంటి మహాలక్ష్మి! కూతురు కాదు.. ఇది మా అమ్మ! ఆడపిల్లను ఉద్దేశించి ఇలాంటి మాటలు దాదాపు ప్రతి ఇంట్లోనూ వింటూనే ఉంటాం! కానీ, వారి పట్ల వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది! గిర్నిబావి దాటిన తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లోకి గురువారం అడుగు పెట్టాను. అక్కడ మొత్తం విద్యార్థులు 480! కానీ, వారిలో విద్యార్థినులు కేవలం 180 మాత్రమే! పాదయాత్రలో ఇలాంటి పాఠశాలలు చాలానే చూశాను. మెజారిటీ పాఠశాలల్లో ఆడ, మగ నిష్పత్తి దాదాపు ఇలాగే ఉంది. ఆడపిల్ల విషయంలో ఈ సమాజంలో ఎంత వివక్ష ఉందనడానికి ఇదే నిదర్శనం. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాల్లో ఆడపిల్ల చదువుకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అదే సమయంలో, రాను రాను ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇక, ఆడపిల్లల చదువు సాగేదెలా!?

ఇవే ఆలోచనలతో దస్రూనాయక్ తండా దిశగా అడుగులు వేస్తున్నాను. ఆ తండాకు చేరుకుంటున్న సమయంలో ఇంజనీరింగ్ విద్యార్థినులు ర్యాలీగా వచ్చి కలిశారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో తలపెట్టిన భారత్ బంద్‌లో భాగంగా వాళ్లంతా ర్యాలీ చేశారు. ఇంతటి కుగ్రామంలోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వాళ్ల వెనక ఏ నాయకుడూ ఉండి నడిపించడం లేదు. స్వచ్ఛందంగానే చేయీ చేయీ కలిపి బంద్‌ను విజయవంతం చేశారు. వారిలో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను.

ఒకవైపు, చదువుకున్న విద్యార్థినుల్లో చైతన్యం! మరొకవైపు వారు చదువుకోనివ్వకుండా సవాలక్ష ఆటంకాలు! ఆడపిల్లలను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో నా హయాంలో బాలికా సంరక్షణ పథకం పెట్టా. మగవారితో సమానంగా ఉద్యోగావకాశాలు కల్పించా. కానిస్టేబుళ్లు, కండక్టర్లుగా వారికి ప్రాధాన్యం ఇచ్చాను. వారు శారీరకంగా బలహీనులు కావచ్చు. కానీ, మానసికంగా శక్తిమంతులు. ఏదైనా సాధించగల తెలివితేటలు వారి సొంతం. అవకాశాలు కల్పిస్తే మగవారితో దీటుగా ప్రతిభ కనబరుస్తారు. నాయకులు చేయాల్సిందదే!!

మన ఇంటి మాలక్ష్ములు



అడుగడునా.. పక్కా ప్లానింగ్
పాదయాత్రలో విజయవంతం వెనుక కఠోర క్రమశిక్షణ
నిర్వహణలో వందలాది మందికి భాగస్వామ్యం


పటిష్టమైన నిర్వహణ నైపుణ్యానికి నిజమైన నిదర్శనం అన్నట్టు చంద్రబాబు పాదయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. పకడ్బందీ ప్లానింగ్ ఉంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా నిర్వహించవచ్చుననడానికి బాబు నడక ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పాదయాత్ర నిర్వహణ వెనుక ఉన్న వ్యూహం, లక్ష్యం ఏమైనా .. ఒక రాజకీయ పార్టీ ఎలాంటి ఒడుదొగుకులు లేకుండా, ఎక్కడా అంతరాయం కలుగకుండా గత 90 రోజులకుపైగా నిర్వహిస్తున్న పాదయాత్ర.. మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఒక పాఠం వంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి రోజు ఉదయం 11 గంటలకు మొదలవుతున్న యాత్ర రాత్రి సుమారు 11 గంటలకు ముగుస్తోంది. మధ్యలో గంటా రెండు గంటలు విరామం. బాబు రాత్రి బస ముందే నిర్ణయమైపోతుంది. ఆయన ప్రత్యేక బస్సులో బస చేస్తారు. దాని చుట్టూర ఐదారు గుడారాలు.. 30కిపైగా వాహనాలు.. యాత్ర నిర్వహణలో పాలుపంచుకునే 500మందికిపైగా సిబ్బంది.. వంద మందికిపైగా వలంటీర్లు..

మరో 300ల మందికిపైగా పోలీసులు.. రోప్ పార్టీ.. కమెండోలు.. సొంత రక్షణ సిబ్బంది.. బాబు వ్యక్తిగత సహాయకులు.. వైద్య సిబ్బంది.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే రెస్క్యూ టీం.. ఇవి కాకుండా బాబును కలిసేందుకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే నాయకులు.. వారి వాహనాలు.. వీరందరి కోసం వంటవాళ్లు.. వంట సామాగ్రి... ఇంత పెద్ద వ్యవస్థ రోజూ బాబు వెంట సాగుతుంటుంది.

ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే.. దీన్నంతా సమన్వయం చేయడం మరో ఎత్తు. పాదయాత్ర సజావుగా సాగడం వెనుక అనేక అంశాలు సమ్మిళితమై ఉన్నాయి. రవాణా, కమ్యునికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు, భద్రత, సమయ పాలన, టీం వర్క్, మార్గదర్శనం, అవసరాల గుర్తింపు, సదా సన్నద్ధత, అన్నిటికీ మించి పార్టీ పట్ల, నాయకుడి పట్ల కార్యకర్తల్లో విధేయత. ఇవీ పాదయాత్రలో ప్రస్ఫుటంగా కనిపించే అంశాలు. టెంట్ల విషయాన్నే తీసుకుంటే బాబు బస చేసిన చోట నిముషాల్లో టెంట్లు వేయడం, తీయడం కనిపిస్తుంది. అస్సాంకు చెందిన ఐదుగురు కూలీలు ఇందులో పాలు పంచుకుంటున్నారు.

వంటలు పూర్తి చేసే బాధ్యతను స్థానిక నాయకులు, కార్యకర్తలే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షణాల మీద చేరవేయడానికి హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది. బాబు తన ప్రసంగాల్లో ప్రస్తావించే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలనూ సమకూరుస్తోంది. ఇందుకు ఆధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. బాబు ఏ మూలన ఉన్నా మాట్లాడేందుకు వీలుగా శాటిలైట్ వ్యవస్థ నిరంతరం అందుబాటులో ఉంటుంది.

పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని రూపొందించారు. జామర్, మైనింగ్ డిటెక్టర్ వాహనాలు, ప్రత్యేకమైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, మరో అత్యవసర వాహనంతో పాటు మరికొన్ని ప్రత్యేక రక్షణ పరికరాలున్న వాహనాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి.

బాబు ప్రసంగం స్పష్టంగా వినపడేలా డీజే సౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాత్రికేయుల కోసం, కరెంట్‌కు ఇబ్బంది లేకుండా అధిక సామర్థ్యం కలిగిన జనరేటర్, లైటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. "టీమ్ వర్క్ వల్లే వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయి. పార్టీ పట్ల, నాయకుడి పట్ల కార్యకర్తల్లో ఉన్న అపారమైన అభిమానం, గౌరవం, చిత్తశుద్ధి ఇందుకు కారణమ''ని పాదయాత్రను మొదటి నుంచి సమన్వయపరుస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు.

చిన్న లోపము లేకుండా సాగుతున్న యాత్ర





రాజకీయాలను వైఎస్ కలుషితం చేసేశారు
పొట్టగొట్టే నగదు బదిలీని అమలు కానీయబోం
మహిళల పక్షపాతిగానే ఉంటా
వరంగల్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

"పులివెందుల రౌడీలతో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేశారు. తన పాలనలో అవినీతి, రౌడీయిజానికి పెద్ద పీట వేసి జిల్లాకి ఓ రౌడీ చొప్పున తయారు చేశారు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలోనూ పులివెందుల రౌడీలతో హత్యా రాజకీయాలు చేశారంటూ కొండా మురళి దంపతులపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగించిన ఆయన, మహిళల పక్షపాతిగా తనను తాను ప్రకటించుకున్నారు.

వరంగల్ జిల్లా కొమ్మాల స్టేజీ వద్ద ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చేసినట్టుగానే, వరంగల్ జిల్లాలోనూ వైఎస్..ఓ రౌడీ రాజకీయ నాయకుడిని పెంచి పోషించారని, కొల్లి ప్రతాపరెడ్డి లాంటి తెలుగుదేశం నాయకులు వారి చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ఇలాంటివారిని తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైసీపీ.. తోక పార్టీ అని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు అవినీతి తప్ప,అభివృద్ధి అక్కరలేదని విమర్శించారు.

తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశారని దుయ్యబట్టారు. 2004 కంటే ముందు రాజశేఖరరెడ్డి కుటుంబం ఆస్తులతో ఇప్పటి వారి ఆస్తులను పోల్చితే ఎంతో దోపిడీ చేశారనేది అర్థం అవుతుందన్నారు. నగదు బదిలీ పేరుతో పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నగదు బదిలీని మగవాళ్ల ఖాతాలో జమ చేస్తున్నారని, ఇదే జరిగితే ఆ డబ్బు బెల్టు షాపుల్లో ఖర్చవుతుందని చెప్పారు. మరోవైపు పేద ప్రజలు గంజికి కూడా నోచుకోని స్థితి దాపరిస్తుందని ఆందోళన వ్యక్త ం చేశారు. ఇలాంటి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని కోరారు.

పేదల బతుకులను ఆగం చేస్తే టీడీపీ ఊరుకోబోదని హెచ్చరించారు. కిరణ్ ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిందని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులపాలు చేసిందని, విద్యుత్ సమస్య మరింత సమస్యల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ చార్జి పేరుతో మరోసారి ప్రజల నెత్తిన బాంబు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

పత్తికి రూ.5వేల నుంచి 6వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడందరమూ ఫలితం అనుభవించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతుండగా సభలో కొంతమంది యువకులు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. " తమ్ముళ్లూ..ఆ సెల్ తెచ్చిందీ నేనే'' అని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచామన్నారు.

జిల్లాకో పులివెందుల రౌడీ



1468 కిలోమీటర్ల మైలురాయి బ్రేక్

90 రోజుల్లో 1480 కిలోమీటర్లు

మరో వెయ్యి కిలోమీటర్లు నడిచే అవకాశం

కింద పడినా వదల్లేదు. కాలు నొచ్చినా ఆగలేదు. షుగర్ పెరిగినా రాజీలేదు. అడుగు ముందుకు పడుతూనే ఉంది. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రల్లో కొత్త రికార్డు నమోదైంది. 54 ఏళ్ల వయసులో వైఎస్ 68 రోజులపాటు 1468 కిలోమీటర్లు నడిచిన రికార్డును... 63 సంవత్సరాల చంద్రబాబు బద్దలు కొట్టారు. 1480 కిలోమీటర్ల మార్కును దాటారు. ఆయన మరో వెయ్యి కిలోమీటర్లు నడిచే అవకాశముంది. అంటే... సమీప భవిష్యత్తులో బాబు రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరేమో!

హైదరాబాద్, జనవరి 3 : పాదయాత్ర...ప్రజల్లో కలిసిపోయేందుకు ఓ మార్గం! అధికార పీఠానికి దగ్గరయ్యేందుకు నేతలు ఎంచుకునే సాధనం! దాదాపు పాతికేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కోసం కలవరించి, పలవరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి... పాదయాత్ర ద్వారానే తాను అనుకున్నది సాధించగలిగారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన 1,468 కిలోమీటర్ల 'ప్రజా ప్రస్థానం' అప్పటికి 'న భూతో!'. ఇప్పుడు వైఎస్ రికార్డును చంద్రబాబు బద్దలు కొట్టారు.

వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమై, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ పోటీ ఎదుర్కొంటున్న చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' అంటూ నడక మొదలుపెట్టి 1480 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అయితే, 1,468 కిలోమీటర్ల దూరాన్ని వైఎస్ 68 రోజుల్లోనే పూర్తి చేయగా, పాదయాత్రకు తోడు పార్టీ వ్యవహారాలూ చూడాల్సి రావడం, నడకలో గాయపడటం, నీలం తుపాను, సీనియర్ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం వంటి కారణాలతో 90వ రోజుకు గానీ ఆ మైలురాయిని దాట లేకపోయారు. దస్రూనాయక్ తండా క్రాస్ వద్ద ఆయన వైఎస్‌ను దాటేశారు. దీనికి గుర్తుగా క్రాస్ వద్ద టీడీపీ కార్యకర్తలు స్థూపం నిర్మించారు.

వైఎస్ తన 54వ ఏట పాదయాత్ర చేపట్టగా... చంద్రబాబు 63ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్) యాత్ర పూర్తిచేసి డిసెంబర్ 28వ తేదీనుంచి వరంగల్‌లో తిరుగుతున్నారు. యాత్ర ముగిసేనాటికి మరో తొమ్మిది జిల్లాల్లో ( ఖమ్మం, నల్లగొండ, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) నడవనున్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో యాత్రను ముగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. నాటి వైఎస్ పాదయాత్రకు, నేటి చంద్రబాబు పాదయాత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు.

చంద్రబాబు @1480 పాదయాత్రలో వైఎస్‌ను దాటిన బాబు