April 10, 2013

పల్లె నుంచి ఎవరైనా కొత్తగా పట్నానికి వస్తే 'ఎర్రబస్సు' ఎక్కి వచ్చావా అని ఎగతాళి చేస్తారు. పట్నం మర్యాదల ప్రకారం నడుచుకోనివారి విషయంలో తరచూ ఈ మాట వింటూ ఉంటాం. అది తప్పా ఒప్పా అనేది వేరే చర్చ! కానీ, ఆ ఎర్రబస్సు ముఖం కూడా చూడని పల్లెలను ఏమనాలి? ఏసీలు, వీడియోలు, దుప్పట్లు, దిండ్లు వంటి పడక సౌకర్యాలతో అతి విలాసవంతమైన సర్వీసులను నడిపే ఆర్టీసీకి, ఈ పల్లెలు నష్టజాతకంగా కనిపిస్తున్నాయా? "చెయ్యి ఎత్తండి..బస్సు ఎక్కండి'' అంటూ గొప్పగొప్ప నినాదాలను ఒకవైపు గుప్పిస్తూ.. మరోవైపు చెయ్యి కాదు కదా.. చేతులు జోడించి ప్రార్థించినా ఈ పల్లెల్లో బస్సు ఆగడం లేదు.

మండల కేంద్రంలో ఎన్ని పిటిషన్లు పెట్టినా బస్సు చక్రం పల్లెలపైపు తిరగడం లేదు. ఎందుకు? "మా ఊరికి బస్సు నడిపితే సంస్థకు నష్టమట సార్!'' అని ఆ యువకుడు చెప్పాడు. తుని పోవడానికి అతడు ఆటో కోసం రోడ్డు మీదకు వచ్చాడు. " తునికి పోయి రావడానికి 40 రూపాయలు కావాలి సార్. ఈ కరువు రోజుల్లో అంతపెట్టి ప్రయాణాలు ఏమి చేస్తాం? ఎన్నిసార్లు అడిగినా ఆర్టీసీ వాళ్లు బస్సు తిప్పడం లేదాయె'' అంటుంటే గొంతులో అసహనం ధ్వనించింది. వందల కోట్ల నష్టాలతో ఉన్న ఆర్టీసీకి, 'పల్లె బాటే' ముళ్ల బాట అవుతున్నదా!

ఎక్కడో దూరంగా విసిరేసినట్టు అక్కడో గ్రామం..ఇక్కడో గ్రామం.. తుని రూరల్‌లో పరిస్థితి ఇది. ఒక ఊరు దాటితే కొన్ని కిలోమీటర్ల వరకు పంటపొలాలు.. సాగుపనులు చేసుకుంటున్న రైతులే కనిపిస్తారు. ఎక్కువగా పామాయల్, జీడిమామిడి, చెరుకు పండిస్తున్నారు. అక్కడక్కడ కూరగాయల తోటలు కనిపించాయి. అలాంటి ఒక తోటలో అచ్చంగా మహిళలే పనిచేస్తుండటం ముచ్చటగొలిపింది. 'ఎంత చేసినా ఏముంది సార్! పేరాపెంపా! తాగుబోతు మొగుడూ, తంటాలు పెడుతున్న ఈ సర్కారూ మా పాలిట ఒకేలా తగలడ్డారు'' అని ఆక్రోశం వెలిబుచ్చారు. వీళ్ల కన్నీరు హైదరాబాద్ పెద్దలను ముంచెత్తేదెన్నడో!

పల్లె బాటే ముళ్లబాటా!

బంగారు భూమి.. తూర్పుగోదావరి జిల్లా అనగానే మెదిలే భాగమిదే. గలగల గోదారి వొరిపిడికి జలజల దిగుబడి రాలుతుందని అనుకుంటారు. ఈ పల్లె లోతుల్లోకి నడుచుకుంటూ వెళ్లకపోతే.. నేనూ అలాగే అనుకునేవాడినేమో! పత్తి పొలంలోకి వెళ్లి దిగాలుపడిన ఆ రైతు భుజంపై చెయ్యి వేయకపోతే.. ఈ నేలకు మడే కాదు కన్నీటి తడి కూడా తెలుసునని నమ్మలేకపోయేవాడినేమో!

బొట్టు బొట్టుగా పాదుల్లోకి నీళ్లు.. మోటారు బావికి అతుక్కుపోయిన రైతు కళ్లు..బీడువారుతున్న పొలాన్ని, బతుకుని చూసి పొంగుకొచ్చే కన్నీళ్లూ..అనంతకో, పాలమూరుకో మాత్రమే కాదు.. గోదారి జిల్లాలకూ అనుభవమే! చెలమకొత్తూరు, తుని ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు బీడు పొలాలు కనిపించాయి. పోలవరం పూర్తి కాదు..పుష్కర కాలువకు గ్రహణం తొలగదు... మరి ఏం చేయాలి? పత్తిరైతు నుంచి టమోటా సాగుదారు దాకా అందరి ప్రశ్న ఇదే. తెల్లబంగారం ఇస్తున్న దనుకున్న సాగు..తెల్లబట్టను మిగిల్చింది.

వి.కొత్తూరు పొలిమేరల్లో కూరగాయల సాగు రైతులను కలిశాను. కరెంటు వేటుకు అయిన గాయాలను వారంతా చూపిం చారు. కాయలను చూపించారు.. ఎండిన బావులను చూపించారు.. మోటారు మూల్గు లను చూపించారు. ధర తెస్తుందనుకున్న టమోటా చప్పగా చితికిపోయిందని వాపో యారు. అంత పెట్టుబడికి ముట్టింది మూడు రూపాయలని (కిలో) ఖాళీ చేతులను చూపిస్తూ భోరుమన్నారు. ఇది భూమి శాపమో, భూ పాలకుల కోపమో అర్థం కావడం లేదంటుండగా, గొంతుకలు పూడుకుపోయి మాట్లాడలేకపోయారు. ఇక వీళ్లకు నేనే గొంతుక కావాలి!

'తూర్పు' మడిలో కన్నీటి తడి!

కాకినాడ: " వైఎస్ రాజశేఖరరెడ్డి తన కుమారుడు జగన్మోహనరెడ్డిని 'ఏ-1'గా చూడాలనుకున్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలలోనూ జగన్ ప్రథముడిగా ఉండాలనుకున్నారు. దొంగ కంపెనీల్లోనూ చలాయించుకు రావాలని ఆశించారు. అవన్నీ కలగలిసి ఇప్పుడు జగన్ నిజంగానే 'ఏ-1'గా మిగిలారు. సీబీఐ చార్జిషీట్లన్నింట్లోనూ ఆయనదే తొలి పేరు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని వి.కొత్తూరులో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తుని, కుమ్మరిలోవల మీదుగా నడక సాగించారు.

వెలమ కొత్తూరులో ఓ రైతు పొలంలోకి వెళ్లి టమోటా పంటను పరిశీలించారు. అనంతరం ఆ ఊరి నడుమ జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులపై సీబీఐ చార్జీషీట్లు దాఖలు కావడం, వైఎస్ హయాంలో చోటు చేసు కున్న కుంభకోణాలను ఆయన ప్రస్తావించారు. "సీఎంగా ఉన్నపుడు వైఎస్ రాష్ట్ర సంపదను దారుణంగా దోచుకున్నారు. జగన్‌కి లక్ష కోట్ల లబ్ధి చేకూర్చారు. ఈ పనిలో వైఎస్‌కు సహకరించిన మంత్రులు, అధికారులంతా ఇప్పుడు చంచల్‌గూడ జైల్లోకెళ్లారు'' అని దుయ్యబట్టారు. జగన్‌కు అన్యాయం జరిగిందన్న వైఎస్ విజయలక్ష్మి వ్యాఖ్యలపై తీవ్రం గా స్పందించారు.

" కొడుక్కి అందరూ అన్యాయం చేస్తున్నారని ఆ తల్లి గగ్గోలు పెడుతోంది. అసలు తన కొడుకు వల్ల ఎంతమంది ఐఏఎ స్‌లు జైలుకెళ్లారో ఆమె తెలుసుకోవాలి'' అని అన్నారు. దేవుడంటూ వైఎస్‌కు విగ్రహాలు పెట్టేవారు.. ఆయన వల్ల ఎవరికి మేలు జరిగిందో చెప్పాలన్నారు. నిన్న అధికారులు, ఇప్పుడు మంత్రులు జైలు దారి పట్టడానికి గానీ, చివరకు తన కుమారుడు జైలుకెళ్లడానికి గానీ వైఎస్సే కారణమని దుయ్యబట్టారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ నిండా నేరస్థులేనని ఆరోపించారు.

అవినీతి సొమ్ముతో పెట్టిన జగన్ పేపర్, టీవీలను చూడొద్దని విజ్ఞప్తి చేశారు.కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ధర్మంగా గెలిచారని, టీడీపీ కూడా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అక్రమాలపై విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించతలపెట్టిన పైలాన్‌కు ఎట్టకేలకు మంగళవారం స్థల ఎంపిక పూర్తయింది.

గాజువాక దగ్గరలోని వడ్లపూడిలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పెట్రోల్ బంక్ వద్ద 1200 చదరపు గజాల విస్తీర్ణంలో పైలాన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దుర్ముహూర్తం ముంచుకొస్తున్నదంటూ సాయంత్రం 5:30 గంటలకు శంకుస్థాపన చేశారు. అలాగే.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 27వ తేదీ ముగింపు సభను నిర్వహించాలని నిర్ణయించారు.

అన్నింట్లో జగనే 'ఏ-1'! అదే ఆ తండ్రి కోరిక.. అందుకే దోపిడీ, అక్రమాల్లో ఫస్ట్

అలాంటి నేత ఫొటో వైఎస్‌తో చూస్తే బాధేస్తోంది
వైఎస్ అవినీతిపై ఫ్లెక్సీలు పెట్టాలి..
అప్పుడైనా సిగ్గు వస్తుందేమో..
పార్టీ శ్రేణులకు బాబు పిలుపు

కాకినాడ : "కాంగ్రెస్ పార్టీపై చివరి వరకు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి ఫొటోను అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ ఫొటో పక్కన పెడతారా? ఎన్టీఆర్ వారసులమంతా దీన్ని గట్టిగా ఎదుర్కోవాలి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముదిరిన 'ఫ్లెక్సీ'ల వివాదంపై  పాదయాత్రలో ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన వైఎస్ లాంటి దొంగల ఫొటోపక్కన ఎన్టీఆర్ ఫొటో చూస్తే బాధేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇది దివాలాకోరు రాజకీయం. రాజకీయాల్లో విలువలు పడిపోయాయి. మహాత్మాగాంధీ, జ్యోతీరావు ఫూలే , అంబేద్కర్, ఎన్టీఆర్..ఇలాంటి మహానుభావుల ఫొటోలు చూస్తే ఒక స్ఫూర్తి. వైఎస్‌ను చూస్తే ఏం గుర్తుకొస్తుంది? లక్ష కోట్లు దోశాడని గుర్తుకొస్తుంది. ఎన్టీఆర్ చివరి వరకు కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేశారు. మనమంతా ఆయన వారసులం'' అని కార్యకర్తలతో అన్నారు. వైఎస్ కుటుంబ అవినీతిపై ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేయాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. "అప్పుడైనా వారికి సిగ్గు వస్తుందేమో తమ్మూళ్లూ!'' అని వ్యాఖ్యానించారు.

వైఎస్ సీఎంగా వున్నపుడు ఆయన అరాచకాలపై సోనియా, మన్మోహన్‌సింగ్‌లు మౌనం వహించడం వల్లనే ఆయన చెలరేగిపోయారని విమర్శించారు. కాగా, విద్యుత్ సమస్యలపై టీడీపీ పిలుపునకు స్పందించి బంద్ విజయవంతం చేసిన వారందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ సమస్యలు తీరేవరకు ఉద్యమం ఆగదన్నారు. కాగా, 189 రోజులుగా పాదయాత్ర చేస్తూ వందల సభలలో ప్రసంగాలు చేస్తూ, సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గొంతు బొంగురుపోయింది. " ఎక్కువగా మాట్లాడటం వల్ల గొంతుపోయింది. మీరే మాట్లాడండం''టూ తునిలో ప్రజలతో అన్నారు.

దొంగల పక్కన ఎన్టీఆరా? కాంగ్రెస్‌పై పోరులో రాజీపడని నేత ఆయన

 

తెలుగు వారి పండుగ ఉగాది , అందరికీ ఉగాది శుభాకాంక్షలు..!!