February 14, 2013

బాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
కొలకలూరులో కుప్పకూలిన వేదిక మెట్లు


గుంటూరు జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబుకు గురువారం కొలకలూరులో పెనుముప్పు త్రుటిలో తప్పింది. వేదికపై ప్రసంగించి.. కిందకు దిగుతుండగా మెట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ, పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను పట్టుకోవడంతో.. కింద పడకుండా ఆగారు. కానీ, ఆ సమయంలో శరీరం బరువు మొత్తం కుడికాలి మీదే పడటంతో.. కుడికాలి మడమ బెణికి, నడక కష్టంగా మారింది.

వైద్యుల సూచన మేరకు పాదయాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో తన ఎనిమిదో రోజు పాదయాత్రను గురువారం ఉదయం తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు నుంచి ప్రారంభించారు. కొలకలూరు మెయిన్‌రోడ్డు సెంటర్‌లో అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ నాయకుడు నాగేశ్వరరావు సభా వేదిక ఏర్పాటుచేశారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత కిందకు దిగుతుండగా సెంట్రింగ్‌తో ఏర్పాటుచేసిన సభావేదిక మెట్లు కుప్పకూలాయి. దాంతో ఆయన కాలు బెణికింది. తర్వాత కూడా.. అక్కడినుంచి అర కిలోమీటరు దూరం నడిచిన చంద్రబాబు.. నొప్పి భరించలేక కుర్చీలో కూర్చుండిపోయారు. ఫిజియోథెరపిస్టు వచ్చి కాలి మడమను పరిశీలించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అనంతరం మరికొందరు వైద్యులు పరిశీలించి.. కొంత వాపు వచ్చిందని, పాదయాత్ర కొనసాగించడం మంచిది కాదని చెప్పి గురువారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా గాయపడ్డారు. గురువారం సాయంత్రానికి అంగలకుదురు గ్రామానికి పాదయాత్ర చేరుకోవాల్సి ఉండగా కొలకలూరు శివార్లలోనే నిలిపేశారు. చంద్రబాబు అతి కష్టమ్మీద ఫిజియోథెరపిస్టు సాయంతో ఫర్లాంగు దూరం నడిచి.. వ్యాన్‌లోకి వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, బావమరిది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్‌చేసి పరామర్శించారు.

నాడు గద్వాలలో...
చంద్రబాబు పాదయాత్రలో ఇలా వేదిక కూలడం ఇది రెండోసారి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో చంద్రబాబు ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన కిందపడిపోయారు.

బాబుకు శరద్‌యాదవ్ ఫోన్
హైదరాబాద్: చంద్రబాబుకు ఎన్డీయే నేత శరద్‌యాదవ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

నేటి నుంచి యాత్ర యథాతథం
పాదయాత్రను శుక్రవారం నుంచి యథాతథంగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వైద్యుల పరీక్షల అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు కుడికాలి మడమపై ఒత్తిడి

చంద్రబాబును పరామర్శించేందుకు ఆయన తనయుడు లోకేష్ గురువారం రాత్రి కొలకలూరు  చేరుకున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత.. తండ్రిని ఏకాంతంగా కలిసి మడమ నొప్పిపై ఆరాతీశారు. వైద్యులతోనూ చర్చించారు.

లోకేష్ పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై గుంటూరు జిల్లా పోలీసుల వైఖరి విమర్శలకు దారితీస్తోంది. ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉన్నా వారు పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కాన్వాయ్‌లోకి ్రపైవేటు వాహనాలు చొరబడుతున్నా వారు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. అలాగే ఆయన ప్రసంగించే చోట బాంబు నిర్వీర్య బృందంతో తనిఖీ చేయించడమే తప్ప వేదికల పటిష్ఠతను సరిచూడాలన్న నిబంధనను గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు.

అలాగే ప్రైవేటు వ్యక్తులను నిరోధించాల్సిందీ వారేనన్నారు. ఈ నిబంధనలను పోలీసులు పాటించకపోవడమే గురువారం కొలకలూరులో మెట్లు కూలడానికి కారణమని ఆరోపించారు. జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి 50 మందికి మించి పోలీసులను నియమించలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా నగరం దాటిన తర్వాత పర్యవేక్షణ కొరవడిందన్నారు.

కాగా, చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు మోహన్ కొలకలూరులో వేదికను ఉదయమే పరిశీలించారు. అది కనిపిస్తున్నంత పటిష్ఠంగా లేదని ఆయన గ్రహించారు. దీంతో చంద్రబాబు కిందినుంచే ప్రసంగిస్తారని చెప్పారు. అయితే టీడీపీ స్థానిక నేత కొలకలూరు నాగేశ్వరరావు "చంద్రబాబు గారూ రండి... బంగారు నాన్నా... పైకి రండి'' అంటూ మైకులో ఆహ్వానించారు. ఆయన అభిమానాన్ని కాదనలేని చంద్రబాబు, ఒకవైపు మోహన్ సంజ్ఞలతో వారిస్తున్నా మెట్లెక్కారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా మెట్లు బలహీనంగా ఉన్నట్లు ఆయనకు చెప్పకపోవడంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తమ అధినేతకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

భద్రతపై టీడీపీ ఆగ్రహం

పాదచారికి పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు మరో కష్టం వచ్చి పడింది. ఎడమకాలి చిటికెన వేలు, నడుం నొప్పి, బీపీ, షుగర్‌లు ఇప్పటికే బాధిస్తుండగా.. స్టేజ్ మెట్లు కూలిన దుర్ఘటనతో మరో బాధ(కుడికాలి మడమ) వచ్చి చేరింది. అయినాసరే.. అలుపెరగని ఆ బాటసారి తాను పాదయాత్ర కొనసాగించి తీరుతానని మొక్కవోని ధైర్యంతో చెబుతున్నారు.

తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరులో వేదికపై ప్రసంగించి దిగుతుండగా మెట్లు కుప్పకూలిపోవడంతో ఆయన ముప్పును తప్పించుకోగలిగారు కాని కొత్తగా కుడికాలికి మడమ నొప్పి బాధ తలెత్తడంతో భరించలేక పాదయాత్రకు స్వల్ప విరామం తీసుకొన్నారు. అయినా పాదయాత్రను కొనసాగించి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

కొలకలూరు నుంచి గురువారం ఉదయం జిల్లాలో ఎనిమిదో రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. కొలకలూరు గ్రామంలో మహిళల హారతులు, దీవెనలు అందుకొంటూ వారి సమస్యలు తెలుసుకొంటూ వాటిపై స్పందిస్తూ నడిచారు. పార్టీ సీనియర్ నాయకుడు మత్తే రామయ్య ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అధైర్య పడవద్దని, పార్టీ అన్ని విధాలా ఆదుకొంటుందని భరోసా ఇచ్చి రూ. 25 వేల ఆర్థికసాయం చేశారు. అనంతరం రథం సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉన్న మెయిన్ రోడ్డు కూడలికి చేరుకొన్నారు. అంతకు 10 నిమిషాల ముందే చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేయడం, మహిళలతో సమస్యలపై సంభాషించడంతో మెయిన్ రోడ్డు సెంటర్ వద్ద ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు అభివాదం చేసి వెళ్లిపోతారని అంతా భావించారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు కొలకలూరి నాగేశ్వరరావు, ఆయన సతీమణి వసంత సభా వేదిక ఏర్పాటు చేశారు. అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ విగ్రహాలు ఉన్న కూడలి కావడం, నాగేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో ఆయన విజ్ఞాపనను కాదనలేకపోయారు. గుంటూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి ్రపైవేటు వేదికలపై చంద్రబాబు ఎక్కకుండా జాగ్రత్త తీసుకొన్నారు. కొలకలూరులో మాత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలు విజ్ఞాపనను తిరస్కరించలేక వేదికపైకి చేరుకొని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్, ఎన్‌టీఆర్ చేసిన త్యాగాలను వివరించారు. సాగునీరు, స్థానిక సమస్యలపై స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం రావాలంటూ ప్రజలకు సూచించారు.

చంద్రబాబు ప్రసంగం పూర్తి కావడంతో అప్పటివరకు వేదిక మెట్లపై కూర్చున్న పార్టీ జిల్లా నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నక్కా ఆనందబాబు, జేఆర్ పుష్పరాజ్ తదితరులు కిందికి దిగారు. చంద్రబాబు మెట్ల పైకి చేరుకోగానే ఒక్కసారిగా సెంట్రింగ్ చెక్కలతో నిర్మించిన స్టేజ్ మెట్లు కుప్పకూలిపోయాయి. ఏమి జరుగుతుందో గ్రహించేలోపే చంద్రబాబు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని పట్టుకొన్నారు. సంఘటనలో చంద్రబాబు పక్కనే ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పక్కటెముకలు ఒరుసుకుపోయాయి. దాంతో ఆయన తీవ్ర నొప్పికి గురయ్యారు. ఇదే సంఘటనలో నాగేశ్వరరావు, ఆయన సతీమణి వసంత కూడా స్టేజ్ మీద నుంచి కింద పడిపోవడంతో వారికి గాయాలయ్యాయి.

చంద్రబాబు కుడికాలి మడమపై శరీరం బరువంతా పడటంతో ఆయన బాధకు గురయ్యారు. ఫిజియోథెరపిస్టు సూచన మేరకు ఆయన అక్కడి నుంచి అర కిలోమీటర్ దూరం నడిచాక నొప్పి పెరగడంతో చంద్రబాబు రోడ్డు పక్కనే కుర్చీలో కూర్చుండిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖంలో నొప్పి బాధిస్తుండటం స్పష్టంగా కనిపించింది. ఆయన కళ్లు మూసుకొని నొప్పిని భరిస్తూ తనకేమి కాలేదని, పాదయాత్ర సాయంత్రం కొనసాగిస్తానని చెప్పారు. ఆ తర్వాత గుంటూరు, తెనాలి నుంచి వచ్చిన వైద్యుల బృందం పరిశీలించిన అనంతరం గురువారం వరకు పూర్తి విశ్రాంతి అవసరమని చంద్రబాబుకు చెప్పారు. అందుకు చంద్రబాబు అంగీకరించి కష్టం మీద మరో ఫర్లాంగు దూరం నడిచి విశ్రాంతి రథంలోకి వెళ్లిపోయారు.

ఉత్కంఠ..

జిల్లా నేతల పరామర్శ


చంద్రబాబు కుడికాలి మడమ నొప్పితో విశ్రాంతి తీసుకొంటున్నారన్న సమాచారంతో జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. పాదయాత్రకు రెండు, నుంచి నాలుగు రోజుల పాటు విరామం ఉండవచ్చని కాసేపు, ఎన్నికల కోడ్ ముగిసేవరకు నిలిపేయవచ్చని మరికాసేపు నాయకులు, కార్యకర్తలు చర్చించుకొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం దాటిన తర్వాత పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహన్‌రావు, టీడీపీ జిల్లా నాయకులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గరికపాటి ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు గురువారం విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉన్నతస్థాయి వైద్య బృందం పరిశీలించిన తర్వాత శుక్రవారం ఉదయం పాదయాత్ర కొనసాగింపు ప్రకటన చేస్తామన్నారు. చంద్రబాబు మాత్రం తాను పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారని వెల్లడించారు. కాసేపటికి విశ్రాంతి రథం నుంచి చంద్రబాబు బయటకు రావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

పాదచారికి తప్పిన ప్రమాదం

సాగునీటి సమస్యపై తెలుగుదేశం పార్టీ సమరశంఖం పూరించింది. సాగర్, డెల్టా ఆయకట్టుల్లో పంటలను కాపాడేందుకు తక్షణం నీటి విడుదల చేయాలని జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం వరకు ప్రభుత్వ స్పందన కోసం నిరీక్షించి అప్పటికీ నీరు విడుదల చేయకపోతే సోమవారం మహాధర్నాకు దిగనున్నట్లు హెచ్చరించారు.

కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం సక్రమంగా సాగునీటిని విడుదల చేయలేదు. వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన వరద నీటినే విడుదల చేసింది. దాని వలన పంటకు నీరు అవసరమైన సమయంలో నీళ్లు లేక, అవసరం లేనప్పుడు నీళ్లు వచ్చి సమస్యలు తలెత్తాయి.

దాంతో ఖరీఫ్‌లో ఇంచుమించు 30 శాతం పైగా రైతులు వరి పంట వేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రబీలోనైనా నష్టాన్ని పూడ్చుకొనేందుకు మొక్కజొన్న, పెసలు వంటి ఆరుతడి పంటలు వేశారు. అయితే జనవరి నుంచి నీటిని నిలిపేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు సాగర్ ఆయకట్టుకు ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వలేదు. రబీలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే రైతులకు సరిపడా ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని మండలాల్లో మిర్చికి నీరు అవసరం. అయితే జిల్లా యంత్రాంగం సాగునీరు ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో రైతులు చంద్రబాబుకు పాదయాత్రలో నివేదించడంతో ఆయన టీడీపీ జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వానికి మూడు రోజుల గడువు విధించారు. అప్పటిలోపు సీఎం స్పందించి నీళ్లు విడుదల చేయకపోతే సోమవారం ఉదయం తాను పాదయాత్రలో ఎక్కడ ఉంటే అక్కడ మహాధర్నా చేపట్టాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించారు.

సాగునీటిపై టీడీసీ సమరశంఖం


సార్... మాకు ఉదయం పూట కరెంటు కావాలి. రాత్రి వేళ ఇచ్చే మూడు గంటల విద్యుత్ వద్దు. దాని వలన మేము పొలాల్లో నిద్ర పోవాల్సి వస్తోంది. అన్నా ఈ సారి ప్రభుత్వం మీదే. మీ సువర్ణపాలన మళ్లీ రావాలి. మన ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి. మన ప్రభుత్వాన్ని తెచ్చుకొంటే వాళ్లు మనకు అనుకూలంగా పని చేస్తారంటూ కొలకలూరు రథం సెంటర్‌లో పలువురు మహిళలు చంద్రబాబుతో సంభాషించారు. దుగ్గిరాల నుంచి వచ్చిన మరో మహిళ తమకు కాఫీ ఫ్యాక్టరీ వలన మురుగునీరు ఊళ్లోకి వచ్చి భరించలేకున్నామని చెప్పారు. దాని పని పట్టాలన్నారు. మరో మహిళ టీడీపీకి రూ. 10 వేల విరాళాన్ని అందజేశారు.

చంద్రబాబు స్పందిస్తూ 'నేను కొలకలూరును నా జీవితంలో మరిచిపోలేను. రాత్రి ఇక్కడే బస చేశాను. మీరు నిండు మనస్సులతో దీవిస్తూ మంచి రోజులు రావాలని ఆశ్వీరదించారు. చెల్లెమ్మా... మీలో కూడా లోపం ఉంది... కాంగ్రెస్ వాళ్లు మోసం, నమ్మకద్రోహం చేస్తారని ఆలోచించకుండా రెండుసార్లు గెలిపించారు. ఉచిత విద్యుత్ అని చెప్పి వైఎస్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని చెప్పారు. అతను డబ్బులు లేకుండా ఏ పని చేయడని, విద్యుత్ ప్రాజెక్టులన్ని తన వాళ్లకు కట్టబెట్టి దోచుకొన్నాడని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌ను నమ్ముకొంటే మీరు ఉండే ఇంటి కప్పు కూడా మిగల్చరన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయా? పావలా వడ్డీ కలగా మిగిలిపోయింది. మీ కష్టాలు తీరాలంటే మీలో చైతన్యం తీసుకురావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని నేను పాదయాత్ర చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

మీ సువర్ణ పాలన మళ్లీ రావాలి

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గురువారం కొలకలూరు గ్రామంలో పర్యటించిన చంద్రబాబుకు మహిళలు అడుగడుగునా నీరాజనం పలికారు. బాబుకు ఎదురేగి హారతులిచ్చి, నుదుట కుంకుమ దిద్ది స్వాగతించారు. తెలుగు మహిళల అభిమానం, ఆప్యాయతలతో ఆయన నూతనోత్సాహంతో ముందుకు సాగారు. మా బంగారు చెల్లెమ్మలు, మా బంగారు అక్కయ్యలు అని సంబోధిస్తూ యాత్రను కొనసాగించారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. వృద్ధులను ఆలింగనం చేసుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ తల్లిపాము..వైఎస్సార్ కాంగ్రెస్ పిల్లపాము

కాంగ్రెస్ తల్లిపామైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పిల్లపాము వంటిదని .. పిల్లపాముకు ఎక్కువ విషం ఉంటుందని కాటేస్తే కోలుకోలేరని అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారని,ఈ సారి జా గ్రత్త వహించక పోతే శాశ్వతంగా ఇబ్బందులు పడతారాన్నరు. కొందరు నేతలు నేరుగా చెంచల్‌గూడా జైలుకు వెళ్లి అక్కడ కొబ్బరికాయలు కొట్టి మరీ వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని, ప్రజలు ఏమనుకుంటారో అన్ని సిగ్గు కూడా వీరికి లేదన్నారు. పేదరికం ఎక్కడుంటే తెలుగుదేశం అక్కడే ఉంటుందని, ఎన్నికల రోజున నన్ను గుర్తుంచుకోండి.. ఐదు సంవత్సరాలు మీకు సేవకుడిలా ఉంటానని హామీ ఇచ్చారు.

కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్

పూర్వం భోఫోర్స్ కుంభకోణంతో దేశంలో అవినీతి విలయతాండవం చేస్తే కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలకు మారుపేరుగా నిలిచిందని చం ద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశరక్షణకు ముఖ్యనేతల ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ల కొనుగోలులో కోట్లాది రూపాయలు దోచుకోవడం సిగ్గుచేటన్నారు. కుంభకోణాలతో దేశ సంవదను దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగలను ఏం చేయాలన్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కాంగ్రెస్ నాయకులు డబ్బు సంపాదన కోసం విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు.

రామయ్యకు పరామర్శ

కొలకలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముత్తే రామయ్యను చం ద్రబాబు పరామర్శించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామయ్యను ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా మందులు వాడాలని, దిగులు పడవద్దని సూచించారు. పార్టీ తరపున రూ.25వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. పాదయాత్రలో చం ద్రబాబుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రులు కోడెల శివ ప్రసాద్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జెఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ యడ్ల గంగాధరరావు, తెనాలి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్, తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు నాగభైరవ రత్నబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు మహిళల నీరాజనం

విగ్రహావిష్కరణ సభలో కూలిన వేదిక మెట్లు
బాబు క్రింద పడకుండా పట్టుకున్న భద్రతా సిబ్బంది
వైద్య పరీక్షలు నిర్వహించిన వ్యక్తిగత వైద్యులు
యాత్రకు తాత్కాలిక విరామం : డాక్టర్ల సూచన

  'వస్తున్నా..మీకోసం' పర్యటనలో భాగంగా గురువారం గుంటూరు జిల్లాలోని కొలకలూరులో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగ్‌జ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ చేసి కిందకు దిగుతుండగా ఒక్కసారిగా వేదిక మెట్లు కూలిపోయాయి. దీంతో ఆయన కిందపడబోయారు. అప్రమత్తమైన సహాయ సిబ్బంది సమయస్ఫూర్తితో చంద్రబాబును పట్టుకున్నారు. ఈ ఘటనలో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు.

చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వైద్యలు ఆయనకు గాయాలు అయ్యాయేమోనని పరీక్షలు నిర్వహించారు. గాయాలు కాలేదని, పాద యాత్ర నిర్వహించాలని బాబు నిర్ణయించారు. అయితే ఈ పూట పాదయాత్రకు విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. కుడికాలి మడమ దగ్గర నొప్పి రావడంతో ఆర్థోపెడిక్ డాక్టర్లను పిలిపించారు. ఇదివరకే ఎడమకాలు చిటికెన వేలుకు గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు గాయాలైనట్లు తెలియవచ్చింది. రాజాకు కుడికాలు మడమ మెలిపడినట్లు తెలుస్తున్నది. ఆయన పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కాగా పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబుకు ఇది రెండో ప్రమాదం. మొదటిది మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో స్టేజి కూలింది. రెండోది గురువారం గుంటూరు జిల్లా కొలకలూరిలో స్టేజి మెట్లు కూలిపోయాయి. దీంతో బాబు రెండు గండాలు తప్పించుకున్నట్టు అయ్యింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన సతీమణి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి బాబుకు ఫోన్ చేసి ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. అలాగే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పార్టీ నేతలు కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.

అంతకుముందు గురువారం ఉదయం జిల్లాలోని కొలకలూరు నుంచి 136వ రోజు పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 72 గంటల్లో ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోతే సోమవారం రైతులతో మహాధర్నా చేపట్టనున్నట్టు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. హెలికాఫ్టర్ల కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమేనని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల ప్రైవేటు ఆస్పత్రులకే లబ్ది చేకూరుతుందని చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబు నాయుడుకు తృటిలో తప్పిన ప్రమాదం

జగన్ పత్రిక.. విష పుత్రిక
తప్పుడు రాతలతో హృదయాలను గాయపరుస్తోంది
సహకార ఎన్నికల్లో రెండు పార్టీలు కుమ్మక్కు
జగన్ బెయిల్ కోసం యత్నాల్లో భాగమే
బాబుపై రౌడీషీట్ తెరవాలనడం వారి అవివేకం
కోండ్రు మురళి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు
ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

  పనిగట్టుకుని తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. సాక్షి స్వతంత్ర మీడియానా? జగన్ మీడియానో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరో ఆకతాయిలు ఆ పత్రిక కార్యాలయంపై రాయివేస్తే టీడీపీ వాళ్ళు వేశారని అల్లరి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వాస్తవం కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోకపోయినా.. జగన్ పత్రిక తప్పుడు రాతలతో ఎన్నో హృదయాలను గాయపరుస్తోందని దుయ్యబట్టారు.

కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విలేకరులతో మాట్లాడారు. కడప పౌరుషం.. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలపై పోరాటం అంటూ జబ్బలు చరుచుకున్న వైసీపీ సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ కాళ్ల ముందు మోకరిల్లిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లకు అంతిమ యాత్ర వంటిదన్నారు. కోండ్రు మురళి పిచ్చికుక్కలాగా తమ అధినేత చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆయన మరోమారు నోరు తెరిస్తే టీడీపీ కార్యకర్తలు చూస్తూ కూర్చోరని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. వైఎస్ దత్త పుత్రుడిగా పేరొందిన కోండ్రు మురళికి అనేక కుంభకోణాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, వీటిని త్వరలోనే టీడీపీ బయట పెడుతుందని చెప్పారు.

జగన్‌పై కేసులు ఎత్తి వేయించుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోందని, కనీసం బెయిల్ అయినా దక్కించుకునేందుకు సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ కుమ్మక్కవుతోందని విమర్శించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఎన్నికలకు అభ్యర్థిని నిలబెట్టలేని వైకాపా దద్దమ్మలు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 30 మంది సహకార అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. జర్నలిస్టు నాయకుడిగా చెప్పుకొంటున్న అమర్, జగన్‌కు ఏజెంటులా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ఆయన వెంటనే జర్నలిస్ట్ యూనియన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జగన్ అక్రమాస్తులన్నింటినీ తవ్వి తీసి స్వాధీనం చేసుకుంటామని, ఆ సొమ్మును రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.

వారి మానసిక స్థాయి ప్రజలకు తెలుసు: రేవంత్ రెడ్డి

గుంటూరులో జగన్ పత్రిక కార్యాలయంపై రాళ్లు పడినందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 'గుంటూరులో చంద్రబాబు పాదయాత్రపై సాక్షి కార్యాలయం నుంచి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దాంతో ఆగ్రహం చెందిన వారెవరో వాటినే తిరిగి ఆ కార్యాలయంపై విసిరి ఉంటారు. సాక్షి పత్రిక పెట్టిన నాటి నుంచి అందులో నాలుగు పేజీలు కేవలం చంద్రబాబుపై తిట్లకు, దూషణలకు కేటాయించి రాస్తున్నారు. ఆయన కుటుంబంపై కూడా నీచాతినీచంగా రాశారు.

అయినా మేం ఏనాడూ సాక్షిపై దాడులకు దిగలేదు. అలా దిగాల్సి వస్తే ఇప్పటికే వందలు, వేల దాడులు జరిగేవి. మేం మా వాదన వినిపించడం, ఖండనలు ఇవ్వడం తప్ప దాడుల జోలికి పోలేద'ని రేవంత్ అన్నారు. 35 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబుపై రౌడీ షీట్ తెరవాలన్న వారి మానసిక స్థాయిని ప్రజలు అర్థం చేసుకోగలరని, చంద్రబాబుపై మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు వంటి వారికి ఏ విషయంలో నైపుణ్యం ఉందో ఇప్పటికే ప్రసార సాధనాల ద్వారా ప్రజలంతా తెలుసుకొన్నారని, ఆయనను పార్టీ గవర్నింగ్ కౌన్సిల్‌లో పెట్టిన జగన్ స్థాయి కూడా తెలిసిపోతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.

'జగన్ మీడియా విషయంలో ఏదైనా జరిగితే... అది మాత్రమే పత్రికా స్వేచ్ఛపై దాడి అన్నట్లు, ప్రజాస్వామ్యం కనుమరుగవుతున్నట్లు జగన్ పార్టీ నేతలు హడావుడి చేస్తున్నారు. ఇదే పార్టీ నేతలు 'ఆంధ్రజ్యోతి'పై దాడులు చే సినప్పుడు పత్రికా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? ఈ రోజు చెబుతున్న సుద్దులు ఆ రోజు వినిపించలేదేం?' అని ఆయన ప్రశ్నించారు.

కడప పౌరుషాన్ని కాంగ్రెస్ కాళ్ల ముందు పెట్టిన వైసీపీ

72 గంటల్లో ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోతే సోమవారం రైతులతో మహాధర్నా చేపట్టనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం ఉదయం జిల్లాలోని కొలకలూరు నుంచి 136వ రోజు పాదయాత్రను బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కోసం రైతలు అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కూర్చుంటే కుదరదని, రైతుల తరపున పోరాడాలని చంద్రబాబు పేర్కొన్నారు.

స్పీకర్ నియోజకవర్గ రైతుల గోడు వినాలి : చంద్రబాబు

డెల్టా ప్రజల సాగునీటి కష్టాలు తీర్చేందుకు నాడు పులిచింతల ప్రాజెక్టుకు తాము శంకుస్థాపన చేశాం. రెండేళ్లలో పూర్తి చేసేవాళ్లం. కాంగ్రెస్ పార్టీ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. గుంటూరు చానల్‌కు మరమ్మతులు నిర్వహించడం లేదు. మరోవైపు ఆధునికీకరణ చేపట్టడం లేదు. అసలు ఈ ప్రభుత్వానికి సాగునీటి యాజమాన్యం తెలియదు. 'సాగర్'లో 497 అడుగుల నీటిమట్టం ఉన్నా పంటలకు పూర్తిస్థాయిలో నీరిచ్చిన చరిత్ర టీడీపీది. నేడు 517 అడుగుల నీటిమట్టం ఉన్నా పంటలకు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గంలోని ఉప్పలపాడు నుంచి ఏడో రోజు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు వెంకటకృష్ణాపురం, జాకీర్‌హుస్సేన్‌నగర్, హాఫ్‌పేట మీదుగా కొలకలూరు వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో రైతుల తన దృష్టికి తీసుకొచ్చిన సాగునీటి సమస్యపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తన హయాంలో సాగునీటి తీరువా వసూళ్లను సంఘాలకే అప్పగించానన్నారు. ప్రాజెక్టు, డ్రిస్టిబ్యూటరీ, నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసి వారు చెల్లించిన డబ్బులు వాళ్లకే ఇస్తే ఎంతోబాగా కాలువల మరమ్మతులు పనులు చేసుకొన్నారని చెప్పారు. ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలని చెప్పి రూ. 500 కోట్లు విడుదల చేశారని, వాటిని దొంగ బిల్లులతో కాంగ్రెస్ దొంగలు నొక్కేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క పని జరగదన్నారు. గుంటూరు చానల్ కాలువ పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు దానికి రిపేర్లు, ఆధునికీకరణ చేపట్టకపోవడం దారుణమన్నారు. తాను అధికారంలోకి రాగానే చానల్‌ను ఆధునికీకరణ చేసి రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.

విజయవాడ, గుంటూరు, తెనాలిని

కలిపేసి మెగాసిటీ


చంద్రబాబు గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా మారుస్తానని చేస్తోన్న హామీలో తాజాగా తెనాలి పట్టణాన్ని కూడా చేర్చారు. ఈ మూడింటిని కలిపి హైదరాబాద్ కంటే ఒక మహానగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. దీని వలన ఒక మెగా టౌన్‌షిప్ వస్తుందని, భూముల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయన్నారు. ఆ భూములను కాంగ్రెస్ దొంగలు లాక్కొన్నట్లుగా కాకుండా రైతులే విక్రయించుకొనే అవకాశం కల్పిస్తానని చెప్పారు. అలానే ఐటీ హబ్, రింగురోడ్లు, వ్యవసాయాదారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రం నెలకొల్పి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామి ఇచ్చారు.

ఉప్పలపాడును

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా


ఉప్పలపాడుకు విదేశీ పక్షులు వస్తాయి. తెలుగుదేశం పార్టీనే అక్కడ పక్షి కేంద్రం నెలకొల్పింది. దానిని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తాను. దాంతో పర్యాటకం పెరిగి ఈ ప్రాంతం విశేషంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఉప్పలపాడు గ్రామం ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తోంది. రానున్న ఎన్నికల్లోనూ ఏకపక్షంగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయం దండగని అనలేదు

ఆ రోజున రైతుబిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి పైకి రావాలని నేను అంటే, వ్యవసాయం దండగ అని అన్నానని వైఎస్ ద్రుష్పచారం చేశాడని, అది మీరు కూడా నమ్మి ఓట్లేశారని చెప్పారు. వైఎస్ అరచేతిలో స్వర్గం చూపించాడు. ఆయన చేసింది కేవలం రెండు రూపాయల కేజీ బియ్యం పథకం. అది కూడా తమిళనాడులో ఉచితంగా ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో ఊరికి ఒకరికే ఆపరేషన్ చేసి కార్పొరేట్ ఆస్పత్రులకు దోచి పెట్టాడు. ప్రభుత్వాసుపత్రుల్లో అసలు వైద్యం మానేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. పేద వాడి ఆరోగ్యం కోసం సమగ్ర బీమా పథకం తీసుకొచ్చి అందులో డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి అన్ని వ్యాధులను చేర్చి చికిత్స చేయిస్తానన్నారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, కందుకూరి వీరయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పులిచింతల మేము పూర్తి చేస్తాం

వస్తున్నా మీ కోసం పాదయా త్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటించిన తెలుగుదేశం అధినేత చం ద్రబాబు నాయుడుకి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. సాయం త్రం 5 గంటలు నియోజక వర్గంలో ప్రవేశించిన బాబు పాదయాత్రకు లభించిన జనాదరణతో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఐదు గంటల పాటు ఏకధాటిగా జరిగిన పాదయా త్రలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలు ఓర్పుగా వింటూ ప్రజలంతా అనందంగా గడిపే మన ప్రభుత్వం రానుందంటూ ఊరట కల్పించారు. పలు చోట్ల చంద్రబాబు కు మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. విద్యార్థులు, యువత బాబు ఆటో గ్రాఫ్ కోసం పోటీపడ్డారు. చిన్నారులను ఆప్యాయంగా ముద్దాడుతూ, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్న చంద్రబాబు కోసం దారి పొడవునా జనం ఎదురుతెన్నులు చూశారు.

కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ఇంతటి పనికిమాలిన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని, కిరణ్‌ను కిరికిరి ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ ఆయన ఏ పని చేయలేడని దుయ్యబట్టారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోని ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాడని ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు దాచుకునేందుకే కాం గ్రెస్ పార్టీ తల్లి, పిల్ల కాంగ్రెస్‌గా విడిపోయిందని విమర్శించారు. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లారు తప్ప త్యాగాలు చేయలేదన్న సంగతి ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజాధనం దోచుకుంటే శిక్షలు పడాలా..లేదా ప్రజలే ఆలోచించాలన్నారు. లేదని కనికరం చూపిస్తే భావితరాలకు భవిష్యత్ ఉండదని సూచించారు.

ఈ వయసులో ఈ కష్టం మీ కోసమే


కాళ్లు నెప్పులు పుడుతున్నాయి..మొరాయిస్తున్నాయి..63 ఏళ్ల వయస్సులో పడుతున్న ఈ కష్టం ప్రజల కోసమేనంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించానని, ప్రతిపక్ష నేతగా ఉన్నానని ప్రజల కష్టాలు చూడలేక పాద యాత్ర చేపట్టానని చెప్పారు. భగవంతుడు శక్తి ఇచ్చినంత కాలం పాదయా త్ర కొనసాగుతుందని, ఇప్పటి వరకు 2000 కి.మీ సాగిన పాదయాత్ర మరెవరూ చేయలేకపోయారన్నారు. రాత్రింబవళ్లు పనిచేస్తూ .. ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతా .. నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఆలోచించండి..అందరితో చర్చించండి..ఇప్పటికైనా నన్ను నమ్మకపోతే బాధపడను.. నచ్చితే నిండు మనసుతో ఆశీర్వదించండి అంటూ చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.

ఫోన్‌కు రాని నీళ్లు

ఎస్ఎంఎస్‌కు మాత్రం మద్యం


రా ష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ చేసినా మంచినీరు దొరకదని, ఎస్ఎంఎస్ చేస్తే మాత్రం ఫుల్‌గా మద్యం అందుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మద్యం ఫుల్..నీళ్లు నిల్ అన్న పరిస్థితులు రా ష్ట్రంలో నెలకొన్నాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు.

ఏడాది ఓపిక పట్టండి

రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలు, పేదలు, మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఏడాది ఓపిక పడితే ఈ కష్టాలన్నీ గట్టెక్కిస్తానని చం ద్రబాబు భరోసా ఇచ్చారు. బాలికా సంరక్షణకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.

రెండోపంటకు నీరివ్వాల్సిందే

అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కునారిల్లుతున్న రైతనన్నను ఆదుకునేందుకు రెండో పంటకు నీరివ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. డెల్టాలో మొక్కజొన్నకు నీరందక ఎండిపోతున్న వైనాన్ని తెలుసుకున్న ఆయన రైతులకు నీరు ఇప్పించే వరకు పోరాడతామన్నారు. వెంటనే గవర్నర్‌కు లేఖ పంపుతామని, అవసరమైతే రాస్తారోకోలు చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కృష్ణా డెల్టాకు రెండో పంటకి నీళ్లిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆ దిశగా కాం గ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఆధునికీకరణలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శించారు.

అడుగడుగునా జన నీరాజనం

చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. బుధవారం ఉప్పలపాడు నుంచి వెంకట కృష్ణాపురం వరకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర జనసంద్రంగా మారింది. నందివెలుగు రోడ్డులో ఇసుక వేస్తే రాలనంతగా జనం చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉప్పలపాడు బహిరంగ సభలో చంద్రబాబు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు చంద్రబాబు సావదానంగా సమాధానం చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఓ మహిళ అనటంతో చంద్రబాబు చిరు నవ్వుతో ఆమెతో ముచ్చటించారు.

గత ఎన్నికల్లో ప్రజలు చేసిన తప్పుకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోమారు తాము అధికారంలోకి వస్తామని తప్పక ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు. ఆయా గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యం వాటికే ఇస్తామని చంద్రబాబు తెలిపారు. పలు చోట్ల మహిళలు హారతులు పట్టారు. చంద్రబాబు పాదయాత్రలో ఆద్యంతం మహిళలు ముందుండి నడిపించారు. అనేక చోట్ల మహిళలు చంద్రబాబుతో ముచ్చటించి తమ సమస్యలు విన్నవించారు. మహిళల సంక్షేమానికి టీడీపీ పెద్ద పీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి వెలినేని శ్రీనివాసరావు (బాబు), మాజీ సర్పంచ్‌లు పెద్ది అప్పాజి, భూషబాబు, దేశం నాయకులు పెద్ది సాంబశివరావు, చెన్నుపాటి సాంబశివరావు పాల్గొన్నారు.

అడుగడుగున 'నారా'జనాలు

చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర బుధవారం ఉదయం 10.45లకు ఉప్పలపాడు గ్రామం నుండి బయలుదేరింది. చంద్రబాబు బస్సు దిగగానే ఉప్పలపాడు గ్రామ మహిళలు హారతులు ఇచ్చారు. గ్రామంలో ఎన్నారైల తల్లిదండ్రులు చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. చంద్రబాబు మంగళవారం రాత్రికి ఉప్పలపాడు చేరుకున్నా, అక్కడ బహిరంగ సమావేశంలో మాట్లాడలేదు. చంద్రబాబు 2000 కి.మీ. పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పలపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 40 కేజీల కేక్‌ను చంద్రబాబు కట్ చేసి గ్రామస్తులకు తినిపించారు.

అనంతరం 2000 బెలూన్లను, రెండు పావురాలను ఆకాశంలోకి ఎగురవేశారు. అనంతరం ఉప్పలపాడు సెంటర్‌లో బహిరంగ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం చేశారు. ఉప్పలపాడు పక్షుల సంరక్షణా కేంద్రాన్ని పర్యాటక స్థలంగా తీర్చుదిద్దుతామని అన్నారు. పాదయాత్ర గ్రామం చివరివరకూ గ్రామస్తులు బంతిపూల బాటను అలంకరించినట్లు ఉంది. గ్రామ శివారులో రోడ్డుకిరువైపుల వున్న గుడిసెలలోకి చంద్రబాబు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు నుంచి వెంకటకృష్ణాపురానికి కనకతప్పెట్ల నడుమ ముందుకు సాగింది. దారి పొడవునా వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, బస్సులు బారులు తీరాయి. మార్గ మధ్యంలో చంద్రబాబు ఓ లారీ ఎక్కి ్రడైవర్‌తో సంభాషించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి నుంచి గుంటూరుకు వస్తున్న ఆర్టిసీ బస్సులోకి ఎక్కారు. బస్సులోని మహిళా కండక్టర్‌తో చంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు కండక్టర్ ఉద్యోగాలు ఇప్పించింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. బస్సులోని ప్రయాణికులకు అభివాదం తెలుపుతూ సమస్యలు తెలుసుకొని కిందకి దిగారు. గడ్డి ట్రాక్టర్ పైకి ఎక్కి రైతులతో మాట్లాడారు. అలా కార్యకర్తల ఉత్సాహాల నడుమ యాత్ర ముందుకు సాగింది. జొన్న చేలోకి వెళ్లి అక్కడ గడ్డిమోపును తలపై పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మినుము పైరును పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పాదయాత్ర వెంకట కృష్ణాపురంకు చేరుకుంది. అక్కడ చంద్రబాబు 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సాంబశివరావు 2000 మొక్కలను పంపిణీ చేశారు. సిద్ధార్ధ కాన్సెప్ట్ స్కూల్ పిల్లలందరూ చంద్రబాబును చూసేందుకు, మాట్లాడేందుకు రోడ్డుపైకి వచ్చారు. దీంతో చంద్రబాబు పిల్లలతో పాఠశాలలోకి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకొని తగిన సూచనలను ఇచ్చారు. 2.20లకు భోజన విరామం ప్రకటించారు. విరామ సమయంలో చంద్రబాబు మెదక్ జిల్లా నుండి వచ్చిన సహకార సంఘాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వచ్చిన మాజీ మంత్రి బాబూమోహన్ సందడి చేశారు. పర్చూరు నుండి ఏలూరు సాంబశివరావు 1200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీతో చంద్రబాబు యాత్రకు సంఘీభావాన్ని తెలియజేశారు. పాదయాత్ర హాఫ్ పేట ఎస్సీకాలనీకి సాయంత్రం 5.45 నిమిషాలకు చేరుకుంది. అక్కడ చంద్రబాబు పేదవారిని ఉద్ధేశించి ప్రసంగించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హాఫ్ పేట గ్రామసెంటర్‌కు చేరి అక్కడి ప్రజలనుద్ధేశించి బహిరంగ సమావేశంలో మాట్లాడారు.

చలపతి విద్యాసంస్థల విరాళం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు సంస్థల తరుపున పార్టీకి రూ. 5.20లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వైవి ఆంజనేయులు మాట్లాడుతూ 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలపతి విద్యా సంస్థల్ని ప్రారంభించారని వెల్లడించారు. 17 సంవత్సరాల నుంచి విజయవంతంగా విద్యా సంస్థల్ని నిర్వహించడం హర్షణీయమని, దేశ భవిష్యత్తు మార్చే విద్యార్థుల్ని తయారు చేయాలని ఈ సందర్భంగా వైవి ఆంజనేయులుకు ఉద్భోదించారు. కార్యక్రమంలో చలపతి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నాదెండ్ల రామారావు, సంయుక్త క్యాదర్శి సుబ్బారావు, కళాశాల విద్యార్థులు అవినాష్, ఈశ్వర్‌టోనీ, శ్రీనివాసరెడ్డి, రమ్య, యోగ్యశ్రీ,వర్షిని పాల్గొన్నారు.

ఉప్పలపాడునుంచి.. కొలకటూరు