April 17, 2013

ఆ పార్టీల పతనం మొదలైంది! సర్వేలు అదే సూచిస్తున్నాయి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో సీట్లన్నీ తమవేనని జబ్బలు చరిచిన పార్టీల పతనం మొదలైందని, తాజా సర్వేలు అవే సూచిస్తున్నాయని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని, సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీలే నిలదొక్కుకోగలవని తాజాగా వెల్లడైన 'సీ ఓటర్' సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. శవాల మీద.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసేవారి కాలం చెల్లుతోంది. అక్కడ వైసీపీ తమకు 40 సీట్లు వస్తాయని, ఇక్కడ టీఆర్ఎస్ 15 సీట్లు వస్తాయని ప్రచారం చేసుకొన్నాయి.

ఏడాది ముందే వాటి పతనం మొదలైంది. ఈ ఏడాదిలో ఇంకా పడిపోవడం ఖాయం. కొద్ది రోజుల్లో ఈ పార్టీలు కనుమరుగు అవుతాయి. పతనం మొదలైందన్నది ఈ సర్వేలు ఒక సంకేతంగా బహిర్గతం చేశాయి. ఆ సర్వేలో వచ్చినంత కూడా ఆ పార్టీల పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది' అన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయి టీడీపీ వైపు చూస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.