April 17, 2013

'నారా'జనం

విశాఖ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర మూడో రోజు ఆహ్లాదకరం గా సాగింది. మంగళవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎ క్కువగా ఉన్నా పాదయాత్ర ప్రారంభించే సమయానికి చిరుజల్లులు కురవడంతో బాబు కాస్త హుషారుగానే యాత్రను కొనసాగించారు. సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర ప్రారంభించిన ఆయన నాతవరం మండలం ములగపూడి, ఎం.బెన్నవరంలలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి వైఖరితోపాటు స్థానిక సంస్థలపై కూడా చంద్రబాబు ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. మెట్టపాలెం, కృష్ణాపురం, బైయపురెడ్డిపాలెం జంక్షన్ మీదుగా బలిఘట్టం చేరుకుని రాత్రిబస చేశారు. దారిపొడవునా మహిళలు హారతులివ్వగా, పెద్దసంఖ్యలో ప్రజలు తమ సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లారు.