April 17, 2013

సమాజ సేవలో టీడీపీ ముందంజ

నాతవరం: సమాజసేవలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం డి.ఎర్రవరంలో ఆయన ఎన్టీఆర్ ట్రస్టు, విశాఖ డెయిరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదవారికి అందుబాటులో ఉండేవిధంగా ఇలాంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబునాయుడు రోగులకు మందు లు అందజేశారు. అనంతరం చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో చంద్రబా బు బస్సులో సమీక్ష నిర్వహించారు.

తాండవ నీరు మర్రిపాలెంకు ఇవ్వాలని వినతి తాండవ రిజర్వాయర్ నీరు మర్రిపాలెం ఆయకట్టు రైతులకు ఇవ్వాలంటూ తెలుగు యువత కార్యదర్శి గవిరెడ్డి శివ ఆధ్వర్యంలో గ్రామస్థులు మంగళవారం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు. దగ్గరలో ఉన్న వల్సంపేట గ్రామం నుంచి పైపులు ద్వారా తమ పొలాలకు సాగునీరు అందించాలని వీరు కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈసమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబునాయుడు మర్రిపాలెం గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

ఈసందర్భంగా గుమ్మిడిగొండ గ్రామానికి చెందిన బయలపూడి చంటిబాబు మాటాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. గుమ్మిడిగొండకు చెందిన వర్రే అచ్చియ్యనాయుడు మాట్లాడుతూ, నేడు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.