July 30, 2013

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం ప్రకటిస్తే.. అనుసరించాల్సిన వ్యూహాలపై బాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం నుంచి హస్తినలో జరుగుతున్న పరిణామాలను చాలా క్షుణ్ణంగా గమనిస్తున్న బాబు పార్టీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అందుబాటులో ఉన్న నేతలతో బాబు భేటీ !

 ఇప్పటి వరకు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇటు రాష్ట్రంలోనూ, అటు జిల్లాలోనూ టీడీపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. చిత్తూరులోని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికార కాంగ్రెస్, వైసీపీలు ఓటర్లను మభ్య పెట్టడానికి వేల రూపాయల నగదు, మద్యం పంపిణీ చేసినా ప్రజలు మాత్రం టీడీపీ బలపరచిన అభ్యర్థులనే గెలిపించారన్నారు. అవినీతి మయమైన కాంగ్రెస్, వైసీపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తొలి, మలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 3,759 సర్పంచ్ స్థానాలు గెలుచుకుందన్నారు.
జిల్లాలో 407 సర్పంచ్ స్థానాలు గెలుచుకుని టీడీపీ మొదటి స్థానంలో ఉండగా, 247 స్థానాలతో వైసీపీ రెండవ స్థానంలో, 187 స్థానాలతో కాంగ్రెస్ మూడవ స్థానంలో, స్వతంత్రులు 75మంది విజయం సాధించారన్నారు. 31వ తేదీన నిర్వహించనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ తన హవా కొనసాగిస్తుందన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పాదయాత్ర ఫలితంగానే నేడు పంచాయతీ ఎన్ని
కల్లో టీడీపీ ఘన విజయం సాధించిందన్నారు. చంద్రబాబు పాదయాత్ర ముగిసిన నెల రోజుల తరువాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల జగనన్న బాణం పేరుతో మరో ప్రజా ప్రస్థానం అంటూ పాదయాత్ర చేస్తోందని, అసలు షర్మిల ఎందుకు పాదయాత్ర చేస్తోందో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. 2014లో నిర్వహించనున్న ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు సీఎం కావడం తథ్యమని వారు జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు దొరబాబు, మహదేవ నాయుడు, నాని, కఠారి మోహన్, వై.వి.రాజేశ్వరి, మోహన్ రాజ్, విల్వనాధం తదితరులు పాల్గొన్నారు.
 

మూడో విడతలోనూ టీడీపీదే హవా