September 29, 2013

తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కావడమే తుది లక్ష్యమంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. లోక్‌సభలో జైపాల్ రెడ్డి సమక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడి దేశ ప్రజలను మెప్పించడమే తన పంతమన్నారు. పలు అంశాలపై 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో తన మనోభావాలను పంచుకున్నారిలా...



తమనుతాము సమర్థించుకోవడానికే. విప్రోలో ఉంటే విప్రో.. ఇన్ఫోసిస్‌లో ఉంటే ఇన్ఫోసిస్ గొప్పదన్నట్లు ఉంది పరిస్థితి. సిద్ధాంతపరమైన రాజకీయాలు తగ్గి, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలు ముందుకొచ్చాయి. పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వారినే ప్రోత్సహించడమూ ఓ కారణం. కాబట్టే ఎదుటి పార్టీల్లో తమను తిట్టేవారిని దగ్గరకు తీస్తే సరిపోతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.


బాగానే ఉంది. అయితే, నేనొచ్చిన ఆర్గనైజేషన్, పెరిగిన వాతావరణం ప్రభావం ఉంటుంది కదా. టీఆర్ఎస్‌లో చాలా తక్కువ కాలం కాబట్టి పట్టించుకోనక్కర్లేదు.


నేనెప్పటికీ నో అనలేను. నొప్పించకుండా కాదనేలా తీర్చలేని ప్రతిపాదన చేస్తాను. డబ్బుతో కొనగలుగుతాం అనుకుని వచ్చినవాళ్లకు 'మీరిచ్చే పది, పదిహేను కోట్లు జీవితంలో ఏ మార్పు తీసుకులేవు. ఓ నాలుగైదు వందల కోట్లిస్తే ఆలోచిస్తా అని చెప్పాను. అలాగే వాళ్లు ఊహించనివిధంగా సీఎం పదవి అడిగాను. ఇక వాళ్లేం చెప్పగలరు?


ఇంత డబ్బుపెడితే చాలామందిని తెచ్చుకోవచ్చని వాళ్లనుకుంటారు కదా. అలాగే మనల్ని భరించడం కష్టం. నేను ఇమడటమూ కష్టమే. మేమిద్దరం ఒకరకం వ్యక్తులమే.
ఎమ్మెల్యేలకు ఎంతవరకూ ఆఫర్లుంటాయి?
పది, ఇరవై కోట్లు ఉండవచ్చు. ప్రజలలో నాయకులంటే గౌరవం లేదు. నాయకులకూ ప్రజలపై సరైన అభిప్రాయం లేదు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా... ఎలా ఉంది?
రాకముందు రాజకీయాలంటే బాగా మోజు ఉండేది. అసెంబ్లీలో లేచి మాట్లాడితే మన జిల్లా.. మన ప్రాంతం ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనుకున్నా. అయితే, ఇప్పుడు ప్రజలు గందరగోళంలో ఉన్నారో.. నేను గందరగోళంలో ఉన్నానో అర్థం కావట్లేదు. ఒక ప్రాంత దుర్మార్గుడైన ఒక అధికారిని చూశాను. అతడు 500కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పడగలెత్తి ఉంటాడు. అతడిపై మూడేళ్లు పోరాడాను. రోజూ 30, 40మంది వరకూ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఆయన ఇంటి ముందు బారులు తీరేవారు.


ఇపుడు లేదులే.. నిన్నోమొన్నో కొట్టేసినం. నానా తిప్పలు పడి అతడి అవినీతిని బయటపెట్టగలిగాం. నన్ను దారిలోకి తెచ్చుకోవడానికి 20మంది మంత్రులు, 50మంది ఎమ్మెలేల వరకూ ఒత్తిడి తెచ్చారు. అతడిపై సభలో లేవనెత్తడానికి ప్రయత్నిస్తే ఒక ప్రాంత పార్టీ సభను రోజు మొత్తం అడ్డుకుంది. మర్నాటికి పోస్టు చేయించుకున్నా అడ్డుకుంది.
అది టీఆర్ఎస్ పార్టీయే కదా?
నేను దానిగురించి చెప్పను. ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నాలుగేళ్లుగా పోరాడితే చివరకు కోర్టు జోక్యంతోగానీ అతడి అవినీతిని నిలువరించలేకపోయాం.



రాత్రి 2 గంటలకు చేతిలో బీఫారంతో అడ్రసు తెలుసుకుని నియోజకవర్గానికి వెళితే 14 రోజులలో అక్కడి ప్రజలు నన్ను గెలిపించారు. మరి వారికి ఏదో ఒకటి చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే అనేక అభివృద్ధి పనులు తెచ్చుకున్నాను. వాటిని రద్దుచేసి వేరే కాంట్ట్రాక్టర్‌కు ఇప్పించాడు. అందుకే ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాను.
ఆ అధికారి శివారెడ్డి అయ్యుంటారు?
నేను పేర్లు చెప్పను.
ఈ ఐదేళ్లలో ఏదైనా సంతృప్తి ఉందా?
నియోజకవర్గం వరకూ చాలా పనులు చేయగలిగాను. వెయ్యి కోట్లు సంపాదించినా రానంత గుర్తింపు సాధించాను. అయితే, రాజకీయాలపై ప్రజలలో ఈసడింపు ధోరణి ఎవరికీ మంచిది కాదన్న బాధ ఉంది. దేశంలో సమూల ఎన్నికల సంస్కరణలు తేవడం తక్షణావసరం. ఒకనాడు హత్యనే పెద్ద నేరంగా భావించి సీఆర్‌పీసీలో ఎక్కువగా దానిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు వెయ్యి హత్యలకన్నా ఒక అవినీతి పెద్ద ప్రమాదకరమైంది.


చాలా సాదాసీదాగా ఉండేవారికైనా రోజుకు పది వేలు ఉండాల్సిందే. సాధారణంగా అయితే.. నెలకు 10 నుంచి 15 లక్షలు కావాల్సిందే. అంటే ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో సరాసరి రూ.5 కోట్లు ఖర్చు పెట్టాల్సివస్తుంది.
ఇదంతా భరించాలంటే ఎవరైనా దందా చేయాల్సిందేనా?
కచ్చితంగా అలాగే ఉంది. సిద్ధాంతపునాదిగల వాళ్లకైనా విధిలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో నేను కొంచెం సంపాదించుకున్నాను. ప్రస్తుతం అడుక్కునే పరిస్థితో.. బెదిరించుకునే పరిస్థితో రాలేదు. తొందర్లోనే నాకు అలాంటి పరిస్థితి తప్పదనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రేవంత్‌పైనా ఆరోపణలు వచ్చాయి కదా?
నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వారి పనులు చేసిపెట్టే క్రమంలో ఆరోపణలు తప్పట్లేదు. అమెరికాలో ఉండే ఎవరిదో భూమిని కబ్జాపెడితే సాయం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరారు. బాధితుల పక్షాన వెళ్లి ప్రయత్నిస్తే ఇలా ఆరోపించారు.


ఇప్పుడు చెప్పిన స్థల వివాదంలోనే వారి విషయం ముందుకొచ్చింది. ఆ స్థలం కోసం భానుకిరణ్ తదితరులతో పోరాడాను. ఆ క్రమంలోనే భాను, మంగలి కృష్ణలతో మాట్లాడింది నిజమే. ఇదంతా జరిగింది 2005-06లో. అప్పట్లో వాళ్లెవరో కూడా లోకానికి తెలియదు. ఇప్పుడు నేను ఏ పార్టీనైతే నేను తిడుతున్నానో వాళ్లే నాపై తప్పుడు ముద్ర వేయడానికి వాళ్ల పత్రికలోనే రాసుకుని ఆరోపణలు చేశారు. అమెరికాలోనివారిని నాపై ఫిర్యాదుకు ఒత్తిడి తెచ్చారు. అయితే, సాయం చేసింది నేనేనని వాళ్లకి తెలియదు. ఆ విషయమే వాళ్లు చెప్పారు. దీనిపై రెండు పార్టీల మీడియాలో రాద్ధాంతం చేశారు.

రాజకీయ ప్రవేశం ఎలా...
మొదట ఏబీవీపీ.. తర్వాత ఆర్ఎస్ఎస్‌లో ఫుల్‌టైం పనిచేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వ్యాపారం. అప్పట్లో కిషన్‌రెడ్డికున్న సన్నిహితులలో నేనూ ఒకడినని అనుకునే వాడిని.
బీజేపీకి ఎందుకు దూరమయ్యారు?
అప్పట్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందనే ఆర్ఎస్ఎస్‌ని వదిలేశాను. పార్టీ సొంతంగా నిలదొక్కుక్కోవాలి.. రాష్ట్రాన్ని బీజేపీ పాలించాలి అన్న ఆలోచనతో ఉన్న నాకు అనవసరంగా పార్టీని టీడీపీకి అప్పజెప్పారన్న కోపం వచ్చింది. అయితే, ఆ తర్వా త అటూఇటూ తిరిగి చివరకు వద్దనుకున్న టీడీపీలోనే కీలకం కావాల్సి వచ్చింది.


తెలంగాణపై హరీశ్, నేనూ బాగా దగ్గరగా ఉండేవాళ్లం. 2003లో కల్వకుర్తిలో పార్టీకి ఎవరూ లేరని ప్రత్యక్షంగా టీఆర్ఎస్‌లోకి రావాలని కోరారు. అప్పట్లో పాలమూరు గర్జన అని పెట్టాం. అదే నా రాజకీయ ప్రవేశం అనుకోండి. అప్పట్లో టికెట్ వచ్చేస్తుందనుకోగా కాంగ్రెస్‌కు చెందిన ఢిల్లీలోని కీలక నాయకుడు టీడీపీలోని తన సన్నిహితుడిని గెలిపించుకోవడానికి ఆ సీటును కాంగ్రెస్‌కు తీసుకుని టీఆర్ఎస్‌కి వేరే సీటు ఇచ్చేలా ఒత్తిడి చేసి విజయం సాధించారు. ఇక్కడ ఒక విషయం నిజం. కేసీఆర్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నా విషయంలో మాత్రం ఆయన నాకు ఆ సీటు ఇవ్వడానికే పట్టుబట్టారు. కానీ, జరగలేదు. 2006 జడ్పీ ఎన్నికలలో చైర్మన్‌గా నా పేరును ప్రకటించారు. కానీ ఏం జరిగిందో కానీ, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో సగం స్థానాలు పొత్తులో తీసుకుని 64 జెడ్‌పీటీసీలలో రెండు స్థానాలు మాత్రమే టీఆర్ఎస్‌కు తీసుకున్నారు. ఆ రెండింటిలో కూడా నాకు ఇవ్వాల్సిన స్థానం లేదు. దాంతో నాకు కోపం వచ్చింది.


జడ్పీటీసీ ఎన్నికలప్పుడు కూడా నన్ను అవమానించారు. దాంతో పార్టీలను పక్కనబెట్టి స్వతంత్రంగా ముందుకు రావాలనుకున్నా. ప్రజలలో నేనేంటో తెలుసుకోవాలనుకుని నామినేషన్ వేసి కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల అభ్యర్థులను ఉపసంహరింపజేశాను. ఎన్నికలలో నేను, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బరిలో ఉండేలా చూసుకున్నా. ఆ ఎన్నికలలో అన్ని పార్టీల జెండాలు కప్పుకొని ప్రచారం చేసింది నేనొక్కడినే. అప్పుడు జడ్పీటీసీగా గెలిచాను. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్నా. అప్పుడు కూడా అలాగే, చంద్రబాబుతో మాట్లాడి కాంగ్రెస్‌కు ఏకగ్రీవంగా అవుతుందనుకున్న స్థానంలో పోటీకి దిగాను. ఆ ఎన్నికలలో గెలిస్తే పార్టీలోకి వస్తానని చంద్రబాబుకు చెప్పాను. అప్పుడు 18 ఓట్లతో గెలిచాను. ఆ వెంటనే తమ పార్టీలోకి రావాలంటూ నాకు చాలా పెద్దపెద్ద వాళ్లు ఫోన్ చేశారు. అయితే, నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పార్టీలో చేరాను. 2007లో వైఎస్ హవా చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో టీడీపీలో ముఖ్యులు కూడా ఎందుకు ఈ పార్టీలోకి రావడం అని అడిగారు.


వాజ్‌పేయి తదితర నేతలను చూశాక.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంట్‌లో దేశ సమస్యలపై మాట్లాడి జనంతో వీడురా నాయకుడు అని అనిపించుకోవాలని కోరిక. అలాగే, 'మీకెందుకురా రాజకీయాలు' అని అన్న ఓ నాయకుడు ఉన్న సభలో నేను మాట్లాడాలని నా పంతం. ఈ సారి మాత్రం పార్లమెంట్‌కు వెళ్లాలి అన్నది నా కోరిక. తర్వాత అయితే, ఆ నాయకుడు పోటీ చేస్తారో చేయరో తెలియదు కదా. గతంలోనే చేద్దామనుకున్నా అయితే కుదరలేదు.
జైపాల్ రెడ్డితో మీ తగదా ఏమిటీ? ప్రేమ పెళ్లి విషయంలోనా?
అదేం కాదు. ఆ విషయంలో ఆయనకు ఏ ప్రమేయం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నతమైన కుటుంబం కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.


జానారెడ్డిని ఎవరితోనూ పోల్చలేను. నాయకుడిగా ఆయన ఎవరికి ఎలా కనిపించినా వ్యక్తిగా మంచివాడు. ఎవరైనా ఏదైనా సమస్యతో వెళితే ముందు కూర్చోబెట్టి సావధానంగా వింటారు. అలాగే, ఆయనతో దగ్గరి బంధుత్వం ఉంది. జానారెడ్డి, సబిత అక్క పిల్లలతో నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. అందుకే వారి విషయంలో చర్చ జరిగే సందర్భాలలో నేను అక్కడ ఉండను అన్న విషయాన్ని మా నాయకుడికి కూడా చెప్పాను.


యూపీలో అయోధ్య అంశం ఉన్నంత కాలం బీజేపీని ఎవరూ టచ్ కూడా చేసేవాళ్లు కాదు. అక్కడున్న మసీదును కూల్చివేసిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అక్కడ బీజేపీ కోలుకోలేనంత దెబ్బతింది. అలాగే, రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోతే ఆ తర్వాత ఏమీ ఉండదు. దానికోసం పోరాడే వారికి ఏమీ ఉండదు. టీడీపీ అనేది ఒక కాలేజీ. ఫైనలియర్ వాళ్లు వెళితే కొత్తగా వచ్చే వాళ్లు వస్తుంటారు. ప్రస్తుత భావోద్వేగాల పరిస్థితి తొలగిపోతే టీడీపీ మళ్లీ కచ్చితంగా పుంజుకుంటుంది.

చంద్రబాబు వద్దనుకున్నా కూడా ఈ పార్టీ బలపడుతుంది. అదైతే నిజం. అన్ని వర్గాల ప్రజలకు ఈ పార్టీ ఒక వేదికగా ఉండడమే కారణం. ఆ వేదిక అవసరం చాలా ఉంది. ఎంతోమంది మహామహులతో పోరాడిన చంద్రబాబు ఒకవేళ అలసిపోయినా ఆ పార్టీ మాత్రం కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ని వర్గాల నుంచి నేతలను తీసుకొచ్చిన ఘనత టీడీపీదే.


దేశంలోని పరిస్థితుల రీత్యా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బీజేపీ సహా అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. కమ్యూనల్ ఎజెండా ఉందనుకుంటే దాన్ని పక్కనపెట్టి కామన్ మినిమమ్ కార్యక్రమం రాసుకుని దగ్గర కావాల్సిన ఆవశ్యకత నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదం.. చైనా రెచ్చగొట్టే చర్యలను చూస్తూ ఊరుకున్న బలహీనమైన నాయకత్వం దేశంలో ఉన్న నేపథ్యంలో ఇంకా సిద్ధాంతాలు పట్టుకుని వేళ్లాడితే జాతికి నష్టం చేసినట్లే. కాబట్టి లెఫ్ట్, రైట్ ఒక్కటి కావాల్సిందే. దీనిపై ఒక చర్చకు తెర లేవాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నా. రేపు మా పిల్లలు గౌరవించేది మేం చేసిన పనులన బట్టే. అందుకే ఈ దేశానికి ఏదైనా చేయాలన్న తపనతోనే మాట్లాడుతున్నా. ఒక పౌరుడిగా ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వం.. సామాన్య ప్రజలకు విశ్వాసం కల్పించేలా చూడాలని కోరుతున్నా.



కచ్చితంగా. ఆ కోరిక లేదని నేను చెప్పను. తెలంగాణ వచ్చాక ఆ పదవిని చేపట్టాలని ఎందుకుండదు. ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటారు. అలాగే నేనూ.
 

'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి