October 18, 2012

100 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలా షర్మిల పాదయాత్ర: రేవంత్ రెడ్డి



100 ఎలుకల్ని కడుపారా తినేసిన పిల్లి ఆనక తీర్థయాత్ర చేసినట్లుగా షర్మిల చేస్తున్న పాదయాత్ర ఉన్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలే కాదు... అన్న వెనకేసుకున్న అవినీతి సొమ్ము గురించి, బెంగళూరులోని విశాల భవంతుల గురించి కూడా అన్ని వివరాలను పాదయాత్రలో చెపితే బావుంటుందన్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదు తెదేపా అని చెప్పే వైకాపా, గతంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తాను జెంటిల్మెన్‌ను అనీ, కనుకనే తన వైపు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొడదామని చెప్పినా, ఇది తన తండ్రి తెచ్చిన ప్రభుత్వం కనుక 2014 దాకా చేయి పెట్టనని చెప్పిన ఘనుడు జగన్ అని దెప్పిపొడిచారు.

ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయ్యాయంటూ నిలదీశారు. పూటకో మాట చెపుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఆ ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతుందన్నారు.
No comments :

No comments :