January 16, 2013



తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు 17 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పాదయాత్రకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పార్టీకి చెందిన కంభంపాటి రాంమోహన్‌రావు, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో పర్యటించాల్సిన ప్రాంతాలు, దృష్టి సారించాల్సిన సమస్యలు, యాత్రతో పార్టీ బలోపేతం వంటి అం శాలను దృష్టిలో పెట్టుకుని రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తున్నారు. 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.

వర్ధంతి సభకు సమీపంలోని నల్లగొండ జిల్లా, రాష్ట్ర నేతలు తర లి రానున్నారు. అదేవిధంగా కోదాడ సమీపంలోని బాలాజీనగర్‌తండాలో ఎస్టీ డిక్లరేషన్‌పై తెలుగుదేశం విధానానికి సంబంధించి అధినేత చంద్రబాబు గిరిజనులతో బహిరంగసభ నిర్వహించనున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎస్టీలకు చేయనున్న మేలుపై ఒక విధాన ప్రకటన చేస్తారు.

దీన్ని సమర్ధిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘం, తెలుగుదేశంపార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మానం జరగనుంది. అనంతగిరి, కోదాడ, బాలాజీనగర్‌తండా, చిలుకూరు, నారాయణపురం, తొగర్రాయి, కాపుగల్లు, నల్లబండగూడెం వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. నల్లగొండ జిల్లా కు చేరుకునే రోజు ఉదయాన్నే కోలాటాలు, గిరిజన నృత్యాలతో సుమారు 10 వేల మంది కార్యకర్తలు చంద్రబాబుకు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలకనున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు పాదయాత్రను అనుసరిస్తారు. మొదటి రోజు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల నేతలు బాబు పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు.

వివిధ వర్గాలతో ముఖాముఖి

పాదయాత్రలో భాగంగా వివిధ రకాల కుల వృత్తుల వారితో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అందుకనుగుణంగా పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో కుల వృత్తుల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సమస్యపై గ్రామస్థులతో, ఇంజనీరింగ్ విద్యార్థులతో, వివిధ కారణాలతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యపై లబ్ధిదారులతో చంద్రబాబు ముచ్చటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మోత్కుపల్లితో రాయబారం

అధినేత తీరుతో అలక పాన్పు ఎక్కిన మోత్కుపల్లిని బుజ్జగించేందుకు పార్టీ దూతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. పాదయాత్రకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ దూతలు మోత్కుపల్లిని హైదరాబాద్‌లో కోరినట్లు తెలిసింది. దీంతో మెత్తబడిన ఆయన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

బాబు పాదయాత్రకు ముమ్మర ఏరాట్లు



కోదాడ నియోజకవర్గం నుంచి గురువారం ప్రారంభం కానున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర సందర్భంగా ఏర్పా ట్లు, ప్రజల సమీకరణ తదితర అంశాలపై ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి : పాదయాత్రను పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ?

వేనేపల్లి : పాదయాత్ర ద్వారా నల్లగొండ జిల్లాతోపా టు, కోదాడ నియోజకవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తు న్నాము. వార్డుల వారీగా గ్రామాల నుంచి పాదయాత్రకు కార్యకర్తలను, అభిమానులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. నల్లగొండ జిల్లాలో, నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉన్నదని, పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు ఈ పాదయాత్ర పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : ఏయే అంశాలు, సమస్యలను బాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ?

వేనేపల్లి : నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లాలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. సాగర్ ఆయకట్టులో నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యుత్‌పై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటుంటే కనీసం రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్‌టీ.రామారావు వర్ధంతి రోజు రైతులతో బాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

ఆంధ్రజ్యోతి : పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు ?

వేనేపల్లి : పాదయాత్రను విజయవంతం చేసేందుకు నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించి 12 నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను తరలించేందుకు పార్టీ యంత్రాం గం చర్యలు చేపట్టింది. 5రోజుల పాదయాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన తేదీల ప్రకారం పార్టీ శ్రేణులను తరలిస్తాం.

ఆంధ్రజ్యోతి : పార్టీలో ఒక వర్గం పాదయాత్రకు దూరంగా ఉంది. ఏ మేరకు విజయవంతం చేస్తారు ?

వేనేపల్లి : పార్టీలో ఒక వర్గం దూరంగా ఉన్నదన్నది అవాస్తవం. పార్టీ అధినేత పాదయాత్రతో నల్లగొండ జిల్లాలకు వస్తున్నందున పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది. పాదయాత్రలో అందరూ పాల్గొంటారు.

ఆంధ్రజ్యోతి :స్వాగత ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ?

వేనేపల్లి : పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణలో చివరి జిల్లా కావడంతో ఖమ్మం నుంచి నల్లగొండ జిల్లాకు వస్తున్న సందర్భంగా శాంతినగర్ వద్ద పెద్ద ఎత్తున స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని పార్టీ నాయకులు బాబుకు స్వాగతం పలుకుతారు. సుమారు 4వందల మంది వివిధ కళాకారులచే కోలాట, భజనలతో స్వాగతం. పాదయా త్ర పొడవునా కళాకారులు బాబు యాత్రకు ముందు ఐదు రోజులు ఉంటారు. కోదాడలో కిట్స్ కళాశాల వద్ద బ్రాహ్మణోత్తములచే పూర్ణకుంభంతో స్వాగత ఏర్పాట్లు, మేకల అభినవ్ రోడ్డులో తన ఇంటి వద్ద 500 మంది మహిళలతో హారతి ఉంటుంది. పాదయాత్రలో బాబుకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం.

ఆంధ్రజ్యోతి : సభలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారు ?

వేనేపల్లి : ప్రతి కూడలిలో చంద్రబాబు సభ ఉంటుంది. ప్రజలకోసం బాబు చేస్తున్న పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజలతో మాట్లాడించడం తదితర కార్యక్రమాలు ఉంటాయి. 18న ఎన్టీఆర్ వర్ధంతిని పురష్కరించుకుని ఖమ్మం క్రాస్‌రోడ్డులో విగ్రహావిష్కరణ అనంతరం 15వేల మందితో సభను ఏర్పాటు చేశాం. ఈ సంరద్భంగా అన్నదానం కార్యక్రమం ఉంటుంది.

పాదయాత్రతో పార్టీని బలోపేతం చేస్తాం



మద్యం మహమ్మారి పల్లెలను మింగేస్తోంది. పేదలను ముంచేస్తోంది. చాలా కుటుంబాలకు గంజి కూడా లేకుండా చేస్తోంది. కష్టం చేయడంలో మగవారికి ఎక్కడా తీసిపోరు నా ఆడపడుచులు. మొగుడు పనిచేసినా, చేయకున్నా ఇంటిని ఒక్క చేతి మీదే నడిపించగల మనోధైర్యం వాళ్ల సొంతం. ఇప్పుడు వాళ్లంతా బేజారవుతున్నారు. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి వెళ్లినప్పుడు అటువంటి కొందరు నన్ను కలిశారు. వంద కూలీలో యాభై రూపాయలు మొగుడు తాగుడుకే పోతోందని, ఇంక ఏమి పెట్టి కుటుంబాన్ని పోషించాలని వాళ్లంతా వాపోయారు.

పగలంతా పనిచేసి అలిసిపోయిన తమకు.. తాగొచ్చిన భర్తల వేధింపులు, చిత్రహింసలు తప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. బెల్టుషాపుల గురించి మాట్లాడేప్పుడు ఆ ఆడపడుచులు ఒక్కొక్కరు ఒక్కో కాళికామాతను తలపించారు. వాళ్లు పడుతున్న ఆవేదన నాకు తెలియనిదేమీ కాదు. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ దెబ్బతిన్న కుటుంబాలెన్నో నాకు తెలుసు. కల్తీ మద్యం తాగి యువకులు చనిపోతే, లేత వయసులోనే వితంతువులవుతున్న ఆడపిల్లల దైన్యాన్ని కళ్లారా చూశాను. అందుకే యాత్ర ప్రారంభంలోనే.. బెల్టుషాపుల రద్దు నిర్ణయం ప్రకటించాను.

నా రెండో సంతకం బెల్టు షాపుల రద్దుపైనే ఉంటుందని నేను వెళ్లిన ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నాను. అలాంటి ఒక సభలో ఓ యువకుడు నా దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. పేరు కోటేశ్వరరావు అని చెప్పాడు "తాగుడు మానలేకపోతున్నాను సార్. తాగినప్పుడే నేను చెడ్డోణ్ని. విడప్పుడు మాత్రం మంచిగానే ఉంటాను. ఈ మద్యాన్ని నియంత్రించి పుణ్యం కట్టుకోండి'' అని వేడుకున్నాడు. దీనిపై గట్టి నిర్ణయం తీసుకునేందుకు ఆ యువకుడి మాటలు ప్రేరణగా నిలుస్తున్నాయి.

బానాపురం వద్ద నాట్లు వేస్తున్న కూలీలు కనిపించారు."ఈ కోతలతో పంట కాదు కంట నీరే మిగులుతోంది. పనులు లేవు. పిల్లల చదువులు సాగడం లేదు. కూలి చేస్తే వచ్చేది బెత్తెడు. పెరిగిన ధరలతో ఖర్చులేమో బారెడు. ఏమి తిని బతకాలి సార్''అని దీనంగా ప్రశ్నించారు. వరిపొలాల్లో నిలబడి వాళ్లడిగిన ఈ ప్రశ్న ప్రతి పాలకుడికీ చెంపదెబ్బే!

ప్రతి పాలకుడికీ చెంపదెబ్బే!



రాష్ట్ర వ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను నియమించాల్సి ఉందని, మరో 45 రోజుల్లో ఇన్‌చార్జిలను నియమిస్తామని కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ తెలిపారు. పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. 

45 రోజుల్లో ఇన్‌చార్జిలను నియమిస్తాం : నారా లోకేష్



టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు వారు చెల్లించిన వడ్డీని తిరిగి చెల్లిస్తామని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు. ముదిగొండ మండలం వల్లభిలో పొట్ల వెంకటప్రసాద్ అధ్వర్యంలో టీడీపీ నాయకులు చంద్రబాబు పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో బంతిపూల వాన కురిపించారు. అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే 6నెలల్లో పాలన గాడిలో పెట్టడంతోపాటు కల్లు గీతకార్మికులకు ప్రతి గ్రామంలో 10 ఎకరాలు తాటి, ఈత వనాలు పెంచేందుకు భూమి ఇస్తామన్నారు. గొర్రెల కాపరులకు గొర్రెలను మేపుకునేందుకు 5నుంచి 10ఏకరాలు భూమితోపాటు, గొర్రెలకు ఉచితంగా మందులు ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న వారందరికి వారి విద్యార్హతలు, నైపుణ్యాన్ని బట్టి ఉపాధి, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించి చేయూతనిస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. వర్గీకరణ చేయించి విద్యాఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేస్తామని చెప్పారు.

గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ వర్గీకరణ వల్ల ఎందరికో ఉద్యోగావకాశాలు లభించాయని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. బెల్ట్ షాపులు రద్దు చేసి మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తానని ప్రకటించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా నీరు అందించి తాగు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. ఈ సభలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు దోపిడీ పార్టీలని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోపిడీ చేసి జైల్‌కు వెళ్లాడు. ఇప్పటికే సీబీఐ విచారణలో రూ.43వేల కోట్ల సంపద బయటపడింది. ఆయన్ని విడిపించేందుకు విజయలక్ష్మి కోటి సంతకాల పేరుతో రాష్ట్రపతి వద్దకు వెళ్లటం సిగ్గు చేటని, అవినీతికి వ్యతిరేకంగా యువత సెల్ మేసెజ్‌లతో యుద్ధం చేసి అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. 'కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారింది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా తప్పుడు కేసులు, అరెస్టులతో రాజకీయం చేస్తున్నారని, వీరి కేసులకు భయపడేదిలేదని హెచ్చరించారు. ఈ సభలో మాజీ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నాయకులు స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

పండగపూటా.. ఆగని పాదయాత్ర

పల్లెలు పచ్చగా ఉన్నప్పుడే అసలైన పండుగ. ప్రజల ఇబ్బందులు తీరినప్పుడే తనకు నిజమైన పండుగ అని భావించిన బహుదూరపు పాదచారి చంద్రబాబు సోమ, మంగళవారాల్లో పండుగ రోజూ పాదయాత్ర కొనసాగించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర సోమవారం మకర సంక్రాంతి, మంగళవారం కనుమ రోజుల్లో కూడా య«థావిధిగా కొనసాగింది. సోమవారం కాస్త ఆలస్యంగా యాత్ర మొదలుపెట్టిన బాబు మొదట ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామశివారు మామిడి తోటలో రైతులతో సమావేశమై వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు రావటం లేదని, విత్తనాలు, ఎరువులు కల్తీతోపాటు అధిక ధరలు భరించలేకపోతున్నామని చంద్రబాబు ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బాబు స్పందిస్తూ.. ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తగిలితీరుతుందన్నారు. రైతుల క్షోభ దేశానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. నీటి ఇబ్బంది నివారణకు సూక్ష్మ సేద్య విధానాన్ని అవలంబించాలని సూచించారు. తాను అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం చిరుమర్రి, వనంవారి కృష్ణాపురం గ్రామాల మీదుగా అమ్మపేట చేరుకొని స్థానిక రవీంద్రభారతి స్కూల్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం కనుమ పండుగ రోజూ బాబు పాదయాత్ర కొనసాగింది. ప్రజలకు సుపరిపాలన కావాలంటే సమర్ధ నేత అధికారంలో ఉండాలని విద్యార్థులకు బాబు వివరించారు. అనంతరం కమలాపురం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావటం ఒక చారిత్రక అవసరమన్నారు. తరువాత బాణాపురం సమీపంలో పొలాల్లో వరినాట్లు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. వారిసమస్యలు అడిగి తెలుసుకున్నారు. మిర్చి రైతులతోనూ ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ముదిగొండ శివారు వల్లభిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లాలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కార్యక్రమం మంగళవారం ఏడో రోజు 9 కిమీ సాగింది. ముదిగొండ మండలం అమ్మపేట నుంచి కమాలాపురం, అయ్యగారిపల్లి, బాణాపురం, పెద్దమండవ క్రాస్ రోడ్డు, వల్లభి వరకు సాగింది. రాత్రికి నేలకొండపల్లి మండలం అప్పలనర్సాపురంలో చంద్రబాబు బస చేశారు. ముదిగొండ మండలంలో అన్ని గ్రామాల్లో బాబుకు ఘన స్వాగతం లభించింది. అమ్మపేట రవీంద్రభారతి పాఠశాలలో చంద్రబాబు ముచ్చటిస్తూ.. విద్యార్థులందరికీ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అమ్మగారిపల్లిలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తామని ప్రకటించారు.

నేడు బాబుయాత్ర ఇలా

వస్తున్నా మీ కోసం యాత్ర బుధవారం నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహపురం నుంచి ప్రారంభమవుతుంది. రాయిగూడెం, చెరువు మాదారం వరకు చేరి రాత్రికి అక్కడే బస చేస్తారు.

డ్వాక్రా మహిళలకు వడ్డీ వాపస్