December 2, 2012

నేడు బాబు వద్ద టీడీఎల్పీ భేటీ

హైదరాబాద్, డిసెంబర్ 2 : తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద జరగనుంది. చంద్రబాబు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఎత్తొండ గ్రామంలో ఆయన ఆదివారం రాత్రి బస చేశారు. అదే గ్రామంలో సోమవారం ఉదయం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

ఆదివారం వరకూ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం ఇక్కడ నుంచి బస్సుల్లో బయలుదేరి అక్కడకు వెళ్తున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈ నెలలో జరగబోయే మరో దఫా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీపరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చ జరగనుంది.

రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు
చంద్రబాబు పాదయాత్ర సోమవారం నాటికి వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. తెలుగు మహిళ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలోఅన్ని నియోజకవర్గాల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపట్టనున్నారు. టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయనున్నారు.