February 4, 2013

రవాణారంగ సమస్యలు పరిష్కారం


 టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రవాణా రంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు జిల్లాకో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా సోమవారం నగరంలోని శాతవాహన కళాశాల ప్రాంగణంలో రవాణారంగ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబు మాట్లాడారు. వ్యవసాయం తరువాత రెండో ప్రాధాన్యం గల రవాణారంగ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి సారించలేదని విమర్శించారు. ఈ రంగానికి జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ ప్రభుత్వం చేసినదేనన్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్‌గా పేరొందిన విజయవాడ ఆటోనగర్‌లో అనేక ఇబ్బందులు కనిపిస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 500 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ ఆటోనగర్‌లో వివిధ రకాల పరిశ్రమలకు చెందిన సుమారు 45 వేల యూనిట్లు ఉన్నాయని వీటిపై ఆధారపడిన వారు కేవలం ఐదు శాతం లాభాలను మాత్రమే పొందుతుండగా ప్రభుత్వం మాత్రం సుమారు 45 శాతం వరకూ పన్నులను విధించడం దారుణమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తం గా 45 లక్షల వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా వాటిలో సుమారు 15 లక్షల యూనిట్ల వరకూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గతంలో ఎప్పుడో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు వేలాది రూపాయల సర్‌చార్జీలు విధించడం రవాణా రంగానికి శరాఘాతంగా మారిందన్నారు. తాను అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని సమూలంగా మారుస్తానని ఆయన అన్నారు.

వ్యాపారరంగ చట్టాన్ని తమ పార్టీయే అమల్లోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. చాలా కాలంగా రాష్ట్రం లో పారిశ్రామిక, రవాణారంగాలు నష్టాల్లో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వేటినీ అమలు చేయడం లేదన్నారు. రెగ్యురేటరీ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలన్నారు. 1991లో ఈ రంగంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. గతంలో బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇతర పెద్ద కంపెనీలకు అవకాశం కల్పించానని ఆయన చెప్పారు. టూరిస్టు బస్సు యజమానుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

విజయవాడ నుంచి గుంటూరు వరకు ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మించి ఈ రెండింటినీ జంట నగరాలుగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రవాణా రంగ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాష్ట్రంలోని వాహన డ్రైవ ర్లందరికీ ఒకే విధమైన పాలసీ తీసుకు వస్తానని చెప్పారు. ఇప్పుడు అమల్లో ఉన్న బీమాను ఐదు లక్షల రూపాయ లకు పెంచుతానని ఆయన చెప్పారు. ప్రైవేట్ బస్సులకు విధిస్తున్న వ్యాట్ రద్దు చేస్తానన్నారు. 2004లో ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన లైసెన్స్‌లను ఇప్పుడు రద్దు చేస్తానని చెప్పి మళ్లీ కొత్తగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశాలివ్వడం తుగ్లక్ పరిపాలనను గుర్తుకు తెస్తోందని చంద్రబాబు అన్నారు.