April 21, 2013

ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకే పాదయాత్ర


డిచ్‌పల్లి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ వీజీ.గౌడ్ అన్నారు. శనివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు 64 జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వీజీగౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి శనివారానికి 200 రోజులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 27 వరకు 2800 కిలో మీటర్లు మైలు రాయిని దాటనున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు.

రైతాంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చి మూడు గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. చంద్రబాబు మరో ఏడాదిలో సీఎం కావడం తథ్యమన్నారు. తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు అందినంత దోచుకో మిగిలింది దాచుకో అన్న విధంగా సాగుతోందన్నారు.

రాష్ట్ర కార్యదర్శి దినేష్ మాట్లాడుతూ చంద్రబాబు ఆశయ సాధన కోసం తెలుగుదేశం శ్రేణులంతా కలిసి పనిచేసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం డిచ్‌పల్లి పీహెచ్‌సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పద్మారావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు తారాచంద్, సాయిలు, లక్ష్మాగౌడ్, అం జయ్య, బలరాం, బ్రహ్మానందం, నాగార్జున, శ్రీనివాస్‌గౌడ్, సలీం, గంగాధ ర్, అబ్బులు, ఎర్రన్న పాల్గొన్నారు.