April 21, 2013

జగన్ అవినీతిపై టీడీపీ శంఖారావం

నల్గొండ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అవినీతి, కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగట్టేందుకు పాదయాత్రతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో పాలన సాగిస్తోందని అన్నారు. అప్పుడు దివంగత వైఎస్ కూడా ప్రజలను మభ్యపెట్టి దౌర్జన్యంగానే అధికారంలోకి వచ్చారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ పార్టీ పెట్టారని, వైస్సార్‌సీపీని భూ స్థాపితం చేస్తామని భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఉందని, ఆయన సీఎం కావాలని, 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చే దిశగా కృషి చేస్తామని, అందుకు నల్గొండనుంచే సత్తా చాటుతామని భూపాల్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు వస్తే పేదలకు, రైతులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.