April 21, 2013

అవినీతిపై పోరాడితే..యువత మీవెంటే..

కొయ్యూరు
: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అవినీతి పెచ్చుమీరిందని, దీని నిర్మూలనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటే యువత మీ వెంటే నడుస్తుందని విశాఖపట్నం నుంచి వచ్చిన యువ వైద్యుల బృందం చంద్రబాబుకు విన్నవించింది.  తామరం బీఈడీ కాలేజీ ఆవరణలో బసచేసిన చంద్రబాబును విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువ వైద్యులు కృష్ణకిశోర్, సతీశ్, కాశేశ్వరరావు, రమేశ్, సునీల్, వీరయ్యచౌదరి, రాజేంద్రలతోపాటు మరో పదిమంది వైద్యుల బృందం కలిసింది.

బాబు ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులపై పరీక్షలు జరిపి కొన్ని సలహా,సూచనలు ఇచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రంలో పెరిగిన అవినీతిని అంతమొందించేందుకు ప్రజల్లో చైతన్యం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత అవినీతిపై అన్నివర్గాల వారితో చర్చించి పార్టీపరంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రత్యక్ష పోరాటాలకు రంగం సిద్ధంచేసే చర్యలు తీసుకుంటానని యువవైద్య బృందానికి హామీ ఇచ్చారు.