April 21, 2013

చంద్రబాబు దృష్టికి చెరకు రైతుల సమస్యలు

అనకాపల్లి
: చెరకు పంట గిట్టుబాటు కావడంలేదని బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన పలువురు రైతులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా చంద్రబాబు బంగారమ్మపాలెంలో చెరకు క్రషర్ దగ్గరకు వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరకు పంటకు పెట్టుబడి పెరిగిపోతున్నదని, ఆశించిన ఫలితం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖర్చులన్నీ పోగా నష్టమే మిగులుతున్నది కానీ పెట్టుబడి కూడా రావడంలేదని వాపోయారు. పరపతి కోసమే సాగుచేస్తున్నాం తప్ప ఫలితం కనిపించడంలేదని చంద్రబాబుకు గోడు వెళ్లబుచ్చారు. తమ పరిస్థితిని ప్రభుత్వం అర్థంచేసుకోవడం లేదని వాపోయారు. మీరొచ్చాకైనా తమ పరిస్థితి బాగుపడుతుందని ఆశిస్తున్నామని అన్నారు.