March 28, 2013

చంద్రబాబు గారూ.. మీరైనా దాహం తీర్చరూ!


కుప్పం: వేసవి ఇంకా తన పూర్తి ప్రభావం చూపకుండానే కుప్పం గ్రామ పంచాయతీలోనేకాదు.. మొత్తం కుప్పం మండలంలోనే తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. దాహం తీర్చడంలో అధికార యంత్రాంగం పూర్తి విఫలమైంది. రోజురోజుకూ ప్రజాందోళనలు అధికమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన కుప్పం పంచాయతీ ప్రజలు కొందరు ఏకంగా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడుకు లేఖ రాసి ఆయనకు ఫ్యాక్స్ చేశారు. దాహార్తి తీర్చాలంటూ మొర పెట్టుకున్నారు. ఆ లేఖ సారంశమిదీ..

మహారాజరాజశ్రీ

గౌరవనీయులైన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడుగారి దివ్య సముఖనకు, వ్రాయుచున్న అర్జీ ఏమనగా..

అయ్యా!

కుప్పం నియోజకవర్గం కుప్పం టౌను జయప్రకాశ్‌రోడ్డు, వినాయకవీధి, కొత్తపేట ప్రాంతాలలో సుమారు 200ల కుటుంబాలు కాపురముంటున్నాము. మేము అందరము కలసి వ్రాసుకొన్న విన్నపము. మేము తీవ్రమైన నీటి సమస్యను సుమారు రెండు నెలలుగా ఎదుర్కొంటున్నాము. ఇందు నిమిత్తము ఈనెల 21న జయప్రకాశ్‌రోడ్డుపై బైఠాయించి సుమారు మూడు గంటలసేపు ధర్నా చేశాము. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి గోపీనాథ్, కుప్పం తెలుగుయువత అధ్యక్షులు సత్యేంద్రశేఖర్, మరియు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ మురళీనాయక్ అందరూ పాల్గొని వాటర్ మ్యాన్ భాస్కర్ అను అతనిని విచారించారు. అతను పైపులైన్లు రిపేరిగా ఉన్నాయని వాటికి స్పేర్‌పార్ట్స్ వెయ్యాలని, అధికారులతో చెప్పినాడు. అందులకు ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ మురళీనాయక్‌గారు దానికి సరిపడ ఫండ్సును శాంక్షన్ చేసినారు. అయినా కూడా వారు ప్రజలకు ఇబ్బంది పెట్టి నీళ్లను వదులుట లేదు. తమ ఇష్టానుసారంగా తనకు కాఆవల్సినటువంటి వారికి మాత్రమే నీళ్లను వదులుతున్నారు, ఎందుకు మాకు నీళ్లు వదలడంలేదు అని అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి అన్నాడు. కనుక దయచేసి మా అందరిమీద దయ ఉంచి ఈ సమస్యను పరిష్కరిస్తూ వాటర్ మ్యాన్ మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము.

ఇట్లు

తమ విధేయులు

జయప్రకాశ్‌రోడ్డు వాసులు