March 28, 2013

సమరమే! ప్రభుత్వం దిగిరావాల్సిందే

తెలుగుదేశం పంతంజనంలోకి వెళ్లాలని నిర్ణయం
1 నుంచి భారీ ఉద్యమం
గ్రామస్థాయి నుంచి సంతకాల సేకరణ
గవర్నర్‌కు సమర్పణ.. బాబు ప్రకటన
వామపక్షాలదీ అదే బాట
1న నిరశనలు.. 9న రాష్ట్ర బంద్
లెఫ్ట్ దీక్ష విరమణ.. కొనసాగిస్తున్న టీడీపీ


సభలో సమరం ముగించిన విపక్షాలు... ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విద్యుత్‌పై రగిలిన వేడిని... సర్కారు దిగి వచ్చేదాకా కొనసాగించాలని తీర్మానించాయి. టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా దీక్షకు దిగిన ఎమ్మెల్యేలతో... తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. కార్యాచరణ గురించి సమీక్షించారు. విద్యుత్ సమస్యలపై ఏప్రిల్ 1నుంచి దశల వారీగా ఉద్యమం చేపట్టాలనీ... గ్రామ స్థాయి నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు.

ప్రజల సంతకాలతో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. కరెంటు విషయంలో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లెఫ్ట్ నేతలు బుధవారం తమ దీక్షలు విరమించుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పది వామపక్షాల నేతలు భేటీ అయ్యారు. ఏప్రిల్ 1న జిల్లా, మండల కేంద్రాల్లో నిరశనలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే... 9న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే... బిల్లులు చెల్లించొద్దని ప్రజలను కోరాలని కూడా యోచిస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధుల దీక్షలకు లెఫ్ట్ నేతలు సంఘీభావం ప్రకటించారు.




కాకినాడ, హైదరాబాద్\ : విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టీడీపీ.. జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. రాజధాని వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా... ఏప్రిల్ 1వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ... 19వ తేదీన హైదరాబాద్‌కు తరలించి గవర్నర్‌కు సమర్పిస్తామని తెలిపారు. బుధవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు.

సర్‌చార్జీలు, కోతలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. "పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా కరెంటు కోతలు అమలవుతున్నాయి. దీనికి వైఎస్, కాంగ్రెస్సే కారణం. బడ్జెట్‌లో కరెంటుకు టీడీపీ 7.5 శాతం నిధులు కేటాయిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 శాతమే ఇస్తోంది. టీడీపీ తొమ్మిదేళ్లలో రూ.1600కోట్ల మేర చార్జీలు పెంచగా... కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31,200 సర్‌చార్జీలు బాదింది'' అని తెలిపారు. తాను సీఎంగా ఉండగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే విద్యుత్‌పై సమీక్షించి... ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించేవాడినని గుర్తుచేశారు.

ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా టీడీపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్‌గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్‌రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు.

పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలో కూర్చున్నవారికి మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం సీపీఎం, సీపీఐ ప్రజా ప్రతినిధులు గుండా మల్లేష్, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్నవారిని వైద్యులు ఉదయం, సాయంత్రం పరీక్షించారు. ప్రస్తుతానికి అందరి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

కరెంటుకోతలు, చార్జీలభారంతో ప్రజలను తిప్పలు పెడుతున్న ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్ హెచ్చరించారు. దీక్షా వేదికపై నుంచి వారు మాట్లాడారు. ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేస్తోందని, వేల కోట్ల రూపాయల భారం మోపుతోందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, విద్యుత్‌ను తెచ్చుకోవడంలో విఫలం కావడమే ఈ కష్టాలకు కారణమని... 30 మంది కాంగ్రెస్ ఎంపీలు, పదిమంది మంత్రులు దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని విమర్శించారు.