March 15, 2013

యాత్రకు ప్రత్యేక బస్ సర్వీస్:'వస్తున్నా మీకోసం ట్రిప్. కాం' వెబ్‌సైట్‌


హైదరాబాద్: చంద్రబాబును కలిసి సంఘీభావం తెలపాలనుకొనే వారి కోసం వారాంతాల్లో ప్రత్యేక బస్ సర్వీసు నడపాలని 'స్పందన' స్వచ్ఛంద సంస్థ నిర్ణయించింది. శని, ఆదివారాల్లో చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడకు తీసుకువెళ్లి ఆయనను కలిపించి తీసుకురానున్నట్టు సంస్థ నిర్వాహకులు పవన్, పట్టాభి, ప్రత్యగాత్మ తదితరులు గురువారం ఎన్టీఆర్ భవన్‌లో తెలిపారు. "వివిధ రకాల వృత్తి వ్యాపారాల్లో ఉన్న తాము వివిధ సందర్భాల్లో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్నాం.

ఆసక్తి ఉన్నా ఎలా వెళ్లాలో తెలియక...ఆయన ఎక్కడ ఉన్నారో అర్థం కాక వెళ్లలేకపోతున్నామని చాలా మంది చెబుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాటు చేశాం'' అని వివరించారు. అటువంటి వారు 'వస్తున్నా మీకోసం ట్రిప్. కాం' వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చునని సూచించారు. "మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కాని రాష్ట్రం అభివృద్ది కోసం చంద్రబాబు రావాలని మేం కోరుకొంటున్నాం. ఒక్క పైసా లాభం లేకుండా కేవలం ఖర్చులు తీసుకొని ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. ఉదాహరణకు తణుకు యాత్రకు రానూపోనూ రూ. ఆరు వందలు తీసుకొంటున్నాం. చంద్రబాబు అభిమానుల కోసం మేం ఏర్పాటు చేసిన సౌకర్యం ఇది'' అని పవన్ వివరించారు.