March 15, 2013

టీడీపీతోనే సంక్షేమ పథకాల అమలు

కొండకొడిమ(వైరా): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు టీడీపీకే సాధ్యమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలనే కన్పించటం లేదని ప్రభుత్వం ఉనికి లేకుండాపోయిందని విమర్శించారు.మండలంలోని కొండకొడిమలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోటా నుంచి రాయితీపై మంజూరైన 140గ్యాస్ కనెక్షన్లను గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అన్నిరంగాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. ప్రజలు కష్టాలు తొలగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు అందించాలంటే టీడీపీని అందరూ ఆదరించాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి రావడంతోనే అన్నివర్గాల ప్రజల కష్టాలను తీరుస్తామని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 160రోజులుగా చేస్తున్న పాదయాత్రలో అన్నివర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అష్ణగుర్తిలో కూడా ఆయన పర్యటించి పార్టీలోకి చేరిన వారిని అభినందించారు.

ఈకార్యక్రమాల్లో వైరా సొసైటీ అధ్యక్షుడు తాతా రంగారావు, టీడీపీ మండల కన్వీనర్ ఆకుల ప్రసాద్, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్‌రావు, కొండకొడిమ మాజీ సర్పంచ్‌లు కొస్తాల నాగకోటేశ్వరరావు, దారా వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు వాకదాని వెంకటేశ్వరరావు, కొప్పుల వెంకటేశ్వర్లు, వైరా సొసైటీ డైరెక్టర్ వాకదాని శ్రీనివాసరావు, టీడీపీ మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు చల్లా జోజి, పగడవరపు పుల్లారావు, వైరా ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు పగడవరపు వీరభద్రం, దొంతెబోయిన నర్సింహారావు, మండల నాయకులు శ్రీరామనేని విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.