March 15, 2013

అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు రద్దు

మర్పల్లి: : టీడీపీ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో పాటు రైతు రుణాలను కూడా రద్దు చేసి మళ్లీ కొత్తగా రుణాలు ఇవ్వనున్నట్లు వికారాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పి.విజయకుమార్ అన్నారు. పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని నర్సాపూర్, ఘనాపూర్, జంషెడ్‌పూర్, కోటమర్పల్లి, కొత్లాపూర్, సిరిపురం, వీర్లపల్లి, పట్లూర్ గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యటించి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. కరెంట్ కోతలతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దివాకర్, మోమిన్‌పేట మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య నాయకులు సుధాకర్, శేఖర్ యాదవ్, రవీందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బట్టు రమేష్ పాల్గొన్నారు.