March 7, 2013

టీడీపీ హయాంలోనే అభివృద్ధి : లోకేష్ నాయుడు

రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి
కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలు

  రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, ప్రజలకు భద్రతపై కూడా భరోసా లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌నాయుడు విమర్శించారు. వీధికో బెల్టు షాపు పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు పెంచి కరెంట్ ఇవ్వడం లేదని లోకేష్ నాయుడు మండిపడ్డారు.

నారా లోకేష్ నాయుడు గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఇక్కడ ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి క్యూ కట్టిన పారిశ్రామిక వేత్తలు, ప్రస్తుతం బాబోయ్ అంటూ వెనక్కి వెళుతున్నారన్నారు. కాంగ్రెసు హయాంలో ఛార్జీలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉందని లోకేష్‌నాయుడు అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడమే అసలైన ఉపాధి అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే రూ.150 కోట్లతో కుప్పంను అభివృద్ధి చేస్తామని లోకేష్ నాయుడు చెప్పారు. పేదల కోసం తపించే నేతకు అధికారం ఇవ్వాలని తన తండ్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు.