March 7, 2013

వైఎస్ కుటుంబానిది నేర చరిత్ర..

వారిని ఎన్నుకుంటే పైశాచిక పాలనే
టీడీపీకి ద్రోహం చేస్తే పుట్టగతులుండవ్
పాదయాత్రలో చంద్రబాబు

  "లక్ష కోట్లు తిన్న జగన్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది అవినీతిపరులు పుట్టుకొస్తున్నారు. వారంతా వైసీపీలో చేరి అవినీతి అక్రమాలతో సంపాదించుకోవచ్చని భావిస్తున్నారు. అటువంటి వారిని చట్టసభలకు పంపిస్తే ప్రజలను దోచుకుంటూ పైశాచిక పాలన చేస్తారు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో గురువారం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు.. లింగాలలో మాట్లాడుతుండగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారిని క్షమించవద్దంటూ అక్కడి వారు చేసిన నినాదాలకు బాబు ఈ విధంగా స్పందించారు. టీడీపీకి ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవని మండిపడ్డారు.

ఇప్పుడు కూడా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనను అంతమొందించే దిశగా ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కరెంట్ సర్ చార్జీలతో రూ.1400 కోట్లు భారం మోపారని, మరోసారి సర్ చార్జీ వడ్డించనున్నారని చంద్రబాబు అన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో రూ.4500 కోట్లు దుర్వినియోగమయ్యాయని, వీటివల్ల రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. వైఎస్ చేసిన పాపాలన్నీ ప్రజలను పట్టి పీడిస్తుంటే, ప్రస్తుత పాలకులు ప్రజలను మరిన్ని కష్టాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి వైఎస్ కుటుంబాన్ని, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించిన ఎన్టీఆర్ కుటుంబాన్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.