March 7, 2013

కార్యకర్తల చేతుల్లోనే టీడీపీ భవిష్యత్తు

శాంతిపురం: పార్టీని బలోపేతం చేయటం కార్యకర్తల చేతుల్లోనే ఉందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సీడీసీఎంఎస్ ఛైర్మెన్ శ్యామరాజ్ అన్నారు. బుధవారం స్థానిక లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో టీడీపీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగిల్ విండో, సీడీసీఎంఎస్ ఛైర్మెన్ శ్యామరాజ్‌ను మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా దుశ్యాలువలతో సన్మానిం చారు. ఆయనతోపాటు సింగిల్ విండో డైరెక్టర్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగిల్ విండో ఎన్నికల్లో కృషి చేసిన వారికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో, కార్యకర్తల అండదండలతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి రైతులు, ప్రజల అభివృద్ధికి పాటు పడుతానని శ్యామరాజ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచ్ స్థానాలను గెలిపించి చంద్రబాబుకు కానుకుగా అందించాలని అన్నారు. జి.శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఎన్నో విధాలుగా కృషి చేస్తున్న క్రమంలో అధికారం పోవడంతో అది కలగానే మిగిలిందన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ స్వర్ణాంధ్రప్రదేశ్‌ను అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వెళ్లిన ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకీపార్టీలోకి వచ్చామా అని మదన పడుతున్నారని, వారందరూ తిరిగి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సింగిల్ విండో ఎన్నికల్లో ఎలా కష్టపడి గెలిపించుకున్నామో స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా కష్టపడి గెలిపించుకోవాలన్నారు. కొంతమంది లేనిపోని మాటలు చెప్పి అపోహాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరు నమ్మరాదన్నారు. కార్యకర్తలు, నాయకులు 7, 8, 9వ తేదీల్లో జరగనున్న లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్, మునిరత్నం, చలపతి, నందిగం ఉదయ్‌కుమార్, నాగరాజు, దేవరాజులనాయుడు, మునిరత్నం, విశ్వనాథనాయుడు, జయరామిరెడ్డి, వెంకటమునిరెడ్డి, లోకీ, రమేష్, త్యాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.