March 7, 2013

రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును విమర్శించడం దారుణం


గుడివాడటౌన్: కనీస గుర్తింపు లేని వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టి, ఎమ్మెల్యేని చేయడానికి కారకులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని విమర్శించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 5,6తేదీల్లో నియోజకవర్గంలో జరిగిన చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు మద్దతుగా తామున్నామంటూ అండగా ఉండి స్వార్థపరులకు చెంపపెట్టులా పాదయాత్రను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలని రావి చెప్పారు.

చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేయడం అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఏనాడూ అసెంబ్లీలో ప్రస్తావించని వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. వైసీపీకి అమ్ముడుపోయిన స్వార్థ రాజకీయ నాయకులకు కడుపు మండిన ప్రజలు రాబోయే ప్రజా కురుక్షేత్రంలో ఓట్లతో గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబుపై మరోసారి నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు, మహిళలు తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు బేతనపల్లి నాగేశ్వరరావు, అంగడాల సతీష్, గొర్రెల పాండురంగారావు, నూతక్కి బాలాజీ, అవధానం మల్లిబాబు, యార్లగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.