April 24, 2013

కష్టాలు మనకి..సుఖాలు వారికి?

అనకాపల్లి రూరల్: అవినీతి సొమ్ము తిని కాంగ్రెస్ నాయకులు సుఖపడుతూ దున్నపోతుల్లా బలిశారని, కష్టాలను మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి మండలంలో పిసినికాడ హైవేపై ఉన్న జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పేరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు దోచుకుతినడమే ధ్యేయంగా ఉన్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పప్
పు, ఉప్పు, కిరోసిన్, పెట్రోల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారన్నారు.

కష్టాలన్నీ మన మీదకు నెట్టి సుఖాలు మాత్రం వారు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజలకు పప్పు, బెల్లంపెట్టి తన కుమారుడికి మాత్రం లక్షల కోట్ల రూపాయలను పంచారన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకునేందుకే తాను ఈ పాదయాత్ర ద్వారా మీ అందరి ముందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని మీ కోసం వచ్చానని ఆయన గుర్తు చేశారు.