April 24, 2013
క్రమశిక్షణ రాహిత్యాన్ని క్షమించను..
నాయకుల కంటే కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకే ఈ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే పార్టీకే నష్టం వాటిల్లతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశం వేదికపైకి తొలుత గుడివాడ నాగమణిని ఆహ్వానించారు. తర్వాత ఫైవ్మెన్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, హర్ష, ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావులను పిలిచి, కోన తాతారావును పిలవకపోవడంతో కార్యకర్తల నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు సూచన మేరకు కోన తాతారావును వేదికపైకి ఆహ్వానించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
వర్గాలకు దూరంగా వుండండి తెలుగుదేశం పార్టీకి గాజువాక నియోజకవర్గం కంచుకోట అని, అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయకుండా వర్గ రాజకీయాలు చేయడమేమిటని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాజువాక గొడవలు నాకు తెలుసని, నాయకుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క నాయకుడు ప్రజలతో మమేకమై పనిచేసే పరిస్థితి లేకపోగా, నాయకత్వం కోసం పోటీ పడడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫైవ్మెన్ కమిటీని నియమించామని తెలిపారు. అందరిని కలుపుకొని కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కమిటీపైనే వుందన్నారు. సక్రమంగా పనిచేయకపోతే కమిటీలు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఐక్యంగా పనిచేయండి గాజువాకలో గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం, సీపీఎం బరిలోకి దిగడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీల పొత్తుల విషయమై ఎటువంటి నిర్ణయం చేయలేదని, పార్టీ శ్రేణుల మనోభావాలకనుగుణంగా గాజువాక విషయంలో ఆచితూచి అడుగేస్తామంటూ హామీ ఇచ్చారు.
పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్ఠ పరచడంలో భాగంగా బూత్, వార్డు, ఏరియా, నియోజకవర్గ కమిటీలను మరింత ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలను తమకు అందజేయాలని కోరారు.
Posted by
arjun
at
5:18 AM