April 24, 2013

టీడీపీ అధికారంలోకి వస్తే హామీలన్నీ నేరువేరుస్తాం


( రంగారెడ్డి అర్బన్) టీడీపీ అధినేత చంద్రబాబు 'మీ కోసం'పాదయాత్ర ముగించుకుని వస్తున్న సందర్భంగా ఈ నెల 28న శంషాబాద్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు జిల్లా టీడీపీ అధ్యక్షుడు టి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎర్రమంజిల్ కాలనీలోని టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీకోసం యాత్రను ఈనెల 27న విశాఖ పట్నంలో ముగించుకుని, 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్దఎత్తున స్వాగతం పలికేందుకు భారీ గా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. శంషాబాద్‌లో భారీ బహిరంగసభ, ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఇందుకోసం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తారన్నారు. దేశచరిత్రలో ఎవరూ చేపట్టని విధంగా చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని, ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనను ఆదరించారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రైతులకు రణమాఫీ, తొమ్మిది గంటలపాటు వ్యవసాయానికి కరెంటు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో మంత్రులు జైళ్లు పాలవుతున్నారని, ఏ మంత్రి ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటలపాటు విద్యుత్‌సరఫరా చేస్తామని,కనీసం రెండు మూడు గంటలపాటుకూడా సక్రమంగా సరఫరా చేయ డంలేదన్నారు. ఎలాంటి నిధులు కేటాయించకుండా ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ పథకం ఎందుకు పెట్టారో తెలియన అయోమయ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

అంతకుముందకు టీడీపీ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ శాసనసభపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఈ నెల 28న టీడీపీ అధినేత రాక సందర్భంగా నిర్వహించే ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి ప్రజలను భారీగా తరలించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యక్షులుగా జి.రాంచందర్‌గౌడ్, రొక్కం భీం రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్, కె.చంద్రయ్య, డి.నారాయణరెడ్డి, రాజుగౌడ్, ఇ.వెంకటేశం, బి.శివలిం గం, మీర్ మహ్మద్ అలీ, కె. లక్ష్మయ్య, జి మధుసూదన్‌రెడ్డి, జి.విఠల్‌రెడ్డి, సి. బల్వంత్‌రెడ్డి, ఎ.నర్సింగ్‌రావు, రాధాకృష్ణాయాదవ్,సి.అంజిరెడ్డి, ఎస్.కొండయ్య, ఎం. రాంరెడ్డి, జగదీష్ యాదవ్, ఆర్.వెంకటేష్‌యాదవ్, జంగయ్యయాదవ్, రంగారావు, ఎస్సీ కృష్ణారెడ్డి, కె. మహేందర్‌రెడ్డి, రాజశేఖర్ ఎన్నికైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ జిల్లా కమిటీల అధ్యక్షులుగా తెలుగు యువత అధ్యక్షుడు గణేష్‌గుప్తా, తెలుగునాడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా చిలుక మధుసూదన్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడిగా కె.శంకర్‌గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడి గా బోడ బిక్షపతి, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా రాజునాయక్, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా చింపుల సత్యనారాయణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇ.వి.సాగర్, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎస్.శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా కొమ్ము ఉపేందర్ ఎన్నికైనట్లు వెల్లడించారు. జిల్లా కార్యవర్గంపై ఇంకా కసరత్తు జరుగుతోంది. నేడు పూర్తి వివరాలు వెలువరించినున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ పదవుల కేటాయింపుల్లో పరిగి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని మాజీ జెడ్పీటీసీ చంద్రయ్య అధిష్టానం దృష్టికి తెచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల ఎంపికలో పరిగి నియోజకవర్గానికి ఒకటి కూడా కేటాయించలేదని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దీంతో పార్టీ నేతలు కల్పించుకుని ఎవరికీ అన్యాయం చేయమని,పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.