April 24, 2013

టీఆర్ఎస్ దుర్మార్గపు పార్టీ : కోడెల

గుంటూరు : కేసీఆర్ దేశ ద్రోహి, ప్రజా ద్రోహి అని, టీఆర్ఎస్ దుర్మార్గపు పార్టీ అని టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సినిమా, విద్య, వ్యాపార సంస్థల నుంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దండుకుంటోందని ఆరోపించారు. స్పష్టతతోనే తెలంగాణ వస్తుంది తప్ప నలుగురిని చంపితేనో...లేక నలుగురు గావుకేక పెడితేనో తెలంగాణ రాదు అని ఆయన అన్నారు.

బయ్యారం గనులను వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌కు దోచిపెట్టినప్పుడు నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ దోపిడీ, అవినీతి జగన్ పార్టీలను అంతమొందించేందుకు విశాఖ సభ నాంది పలుకుతోందని ఆయన తెలిపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా ఇందిరమ్మకలలు అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో తిరుగుతున్నారని కోడెల విమర్శించారు