April 4, 2013

'రండి..అవినీతిపై పోరాడదాం..!'


రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళనకు యువత ముందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వస్తు న్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా పిఠాపురంలో శుక్రవారం తెలుగు యువత సమ్మేళనంలో చం ద్రబాబు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. కసి, కృషితో పనిచేస్తే దేన్నయినా సాధించవచ్చన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు.

ఎన్టీఆర్‌లో ఉన్న కసి, కఠోరశ్రమ, సమయపాలన, దీక్షాదక్షతలు ఎవరికైనా ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గంటన్నరసేపు యువతలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తియుక్తులు, ప్రతిభాపాటవాల గురించి వివరించారు. మెదడుకు ఉన్న శక్తి సామర్థ్యాలు, అంకితభావం, క్రమశిక్షణ వంటివాటిపై చంద్రబాబు యువతకు క్లాస్ తీసుకున్నారు. చంద్రబాబు ప్రసంగం గంటన్నరలో గంటసేపు వ్యక్తిత్వ వికాసం తరహాలో సాగింది.

అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలి


అవినీతి టెర్రరిజం కంటే ప్రమాదకరంగా మారిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపై పోరాటానికి సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా యువతకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్, కాంగ్రెస్ నేతలు వ్యవస్థను సర్వనాశనం చేశారని.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యువత రాజకీయాలలోకి రావడం అవసరమన్నారు.

యువతకు రాజకీయాల్లో రిజర్వేషన్లు

టీడీపీ అధికారంలోకి వచ్చాకా యువతకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తామని చంద్రబాబు తెలిపారు. ఉన్నత చదువులు లేకపోయినా బిల్‌గేట్స్, ధీరూబాయ్ అంబానీ వంటి అనేకమంది అత్యున్నత విజయాలు సాధించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆత్మవిశ్వాసంతో ముదుకుసాగిపోవాలని సూచించారు.

యువత ఉపాధికి పథకాలు


టీడీపీ హయాంలో పెట్టిన సీఎంఈని వైఎస్ వచ్చి నిర్వీర్యం చేశాడని చంద్రబాబు విమర్శించారు. ఐటీలో ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చామని. రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోను యువతకు మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు.