April 15, 2013

చంద్రబాబు సభకు భారీగా జనసమీకరణ


పార్వతీపురం టౌన్ : తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా జనరల్ బాడీ సమావేశం సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చెప్పారు. ఆదివారం పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉద యం 10 గంటలకు ఆర్అండ్‌బీ అతిథి గృహంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనం లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావే శం ముఖ్య ఎజెండాను వివరించారు. ఈనెల 27న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా విశాఖ లో జరిగే పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడు ముగింపు సభకు పార్టీశ్రేణులను కూడగట్టేందుకు చర్చ జరుగుతుందన్నారు.

విద్యుత్ కోతలు, చార్జీల పెంపు పై సంతకాల సేకరణ అంశం, 9 నియోజకవర్గాల్లో 9 లక్షల సంతకాలు సేకరించి పార్టీ అధిష్టానికి నివేదించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తం పై తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, విజయనగరం పార్లమెంటు ఇన్‌చార్జి బండారు సత్యనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజులు ముఖ్య ఆహ్వానితులుగా హాజరవుతారని వివరించారు.

సమావేశానికి పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఇన్‌చార్జిలు, జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, జిల్లా అనుబంధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లాకార్యవర్గం, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కోలా వెంకటరావు, మిరియాల ప్రకాశరావు, జిల్లా నాయకులు బార్నాల సీతారాం, ఎం.సత్యంనాయుడు, సీతానగరం మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు, రౌతు వేణుగోపాల్ పాల్గొన్నారు.