April 15, 2013

వైసీపీలో ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్

చంద్రగిరి: చంద్రగిరిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో వేశారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అటుగా వెళ్లే వారి దృష్టి ఆ ఫ్లెక్సీపై పడుతోంది. చంద్రగిరిలో ఆదివారం రైతులతో వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరవుతున్న ముఖ్యనాయకులను ఆహ్వానిస్తూ తిరుపతి రూరల్‌కు చెందిన గురవారెడ్డి, దొడ్ల కరుణాకరరెడ్డి, కేశవులు, బ్రహ్మంరెడ్డి టవర్ క్లాక్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఇందులో వైఎస్ఆర్, జగన్, పెద్దిరెడ్డి, కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి ఫొటోలతోపాటు సినీ నటుడు జూనియర్ ఎన్‌టీఆర్ ఫొటో కూడా ఏర్పాటు చేశారు. ఇది మండలంలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో ఎలా పెడతారంటూ కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ బ్యానర్ వైపే ఆసక్తిగా చూడటం గమనార్హం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.