April 15, 2013

చంద్రబాబును మెప్పించిన అయ్యప్ప

నర్సీపట్నం: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబు తన వాగ్ధాటితో సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మరోసారి ఆకట్టుకున్నారు. ఆదివారం శృంగవరంలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో అయ్యన్న తనయుడు సుమారు అర్ధగంటపాటు చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. సందర్భం ఏదైనా కేవలం తెలుగుదేశం పార్టీని, అధినేత చంద్రబాబునాయుడును ప్రశంసించేందుకే విజయ్ ప్రాధాన్యత ఇచ్చారు. విజయ్ పొగడ్తలకు చంద్రబాబు ముసిముసిగా నవ్వుకుంటూ ఆనందపడ్డారు. నిర్వాహకులు తొలుత విజయ్‌ను వేదికపైకి పిలవకపోగా చంద్రబాబు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి
విజయ్‌ను వేదికపైకి పిలిపించడమే కాకుండా ప్రత్యేకంగా మాట్లాడమంటూ ప్రోత్సహించారు.

దాంతో విజయ్ వీరావేశంతో గంభీరంగా చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. చంద్రబాబు పాలన రాష్ట్రంలో సువర్ణ అధ్యాయాన్ని సృష్టించిందని, భవిష్యత్తులో మరోసారి సువర్ణయుగం రాబోతుందని ఆయన కొనియాడారు. గ్రామాల్లో మత్తులో జోగుతూ నిర్వీర్యమైపోతున్న యువతను తట్టిలేపడానికే 63సంవత్సరాల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేపడుతున్నారన్నారు. నర్సీపట్నం కంచుకోటను మరలా చంద్రబాబు చేతుల్లో పెట్టబోతున్నామని, అయ్యన్నపాత్రుడును మరోసారి ఎమ్మెల్యేగా చూడబోతున్నామని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఎమ్మెల్యే తదితరులను తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు.