March 13, 2013

ఆ ప్రసంగం దారుణం: చంద్రబాబు

ఏలూరు : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం దశ, దిశ లేనిదని చంద్రబాబు అభివర్ణించారు. అసలు ఆ ప్రసంగంలో ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో చెప్పలేకపోయారని.. ప్రభుత్వం చేతకానితనానికి ఇదే నిదర్శనమని, సీఎం కిరణ్‌కు అనుభవం లేదని మరోసారి గవర్నర్ ప్రసంగం ద్వారా ధ్రువపడిందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన పూలపల్లిలో విలేకరులతో మాట్లాడారు.

ప్రసంగంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధమైన అనుభవాలు బయట ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు రాలేదు గానీ ఉన్న 10 లక్షల ఉద్యోగాలు కరెంటు లేక ఊడాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్క్‌మిషన్ కాస్తా మిల్క్ కమీషన్‌గా మారిందని, పశుక్రాంతి పశుభ్రాంతిగా మిగిలిందని ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ కిరణ్ సర్కార్ అసమర్థతే కారణమని బాబు విమర్శించారు.