March 13, 2013
తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్లు నాటకాలాడుతున్నాయి
చిత్తూరు టౌన్: జైల్లో వున్న పిల్ల
కాంగ్రెస్, జైలు బయట వున్న తల్లి కాంగ్రెస్ పార్టీలు వీలీనం కోసం
ఆరాటపడుతున్నాయి, ఈ రెండు పార్టీలు ఎప్పటికైనా కలిసేవేనని టీడీపీ రాష్ట్ర
కార్యదర్శి దొరబాబు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏ
పార్టీతోనూ పొత్తు పెట్టుకోము... మతతత్వ పార్టీలకు మేము మద్దతు ఇవ్వం...
భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకి లేదా థర్డ్
ఫ్రంట్కు మద్దతిస్తామని, ప్రభుత్వంతో చేరి కీలక మంత్రి పదవులు
తీసుకుంటామంటూ సాక్షాత్తు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి
అన్న మాటలివి అన్నారు. మాట తప్పం... మడమ తిప్పం... ఢిల్లీకి - కడప గడపకు
పోటీ అంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి
వైసీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారని విమర్శించారు.
సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా వున్న విజయలక్ష్మి తరచూ తన ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. ఇటీవల తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు గొప్పలు చెప్పిన పీసీసీ చీఫ్ బొత్సా పబ్బం హరిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్కు బెయిల్ ఇవ్వాలంటే కాంగ్రెస్లోకి వైసీపీ విలీనం కావాలని కాంగ్రెస్ పెద్దలు షరతులు పెట్టిన దానికి తలొగ్గిన విజయమ్మ ఇకపై టీడీపీ గురించి దుష్ప్రచారాలు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు నాని, బాలాజి నాయుడు, ఇందిర, విల్వనాధం, సురేష్, కృష్ణమూర్తి, శశికర్ బాబు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:57 AM