March 29, 2013

కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి లోనైన యనమల

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అధికారం కోసం కాదు, ప్రజలకోసమే పోరాటం : చంద్రబాబు

తూ.గో,/హైదరాబాద్: సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈనాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, పాదాలు నొప్పులు పెడుతున్నా ప్రజల కోసం పాద యాత్ర చేస్తున్నారని ఆయన మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని యనమల అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద విద్యుత్ సమస్యపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే పార్టీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.