June 26, 2013

వీహెచ్‌,బలరాం నాయక్‌లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి


ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే క్రమంలో తమ ఎంపీలపై కాంగ్రెస్‌ ఎంపీలు విహెచ్‌, బలరాం నాయక్‌ తదితరులు అడ్డుకోవడం విచారకరమని టీపీపీ నేతలు ఈ. పెద్దిరెడ్డి, యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. గత 10 రోజులుగా డెహ్రాడూన్‌, బదరీనాథ్‌, హార్సిలీ పర్వతాల్లో చిక్కుకున్న తెలుగువారి సమాచారం తెలుసుకుని, వాతావరణ అనుకూలించనప్పటికీ పార్లమెంటు సభ్యులు రమేష్‌రాథోడ్‌ బదరీనాథ్‌ చేరి అక్కడ బాధితుల యోగక్షేమాలు తెలుసుకొన్నారు. బాధితులను డెహ్రాడూన్‌ తీసుకువచ్చి వీలైనంత త్వరగా విశాఖపట్టణానికి తరలించే యత్నం చేయగా కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ హన్మంతరావు, మంత్రి బలరాంనాయక్‌ బస్సులో ఎక్కిన యాత్రికులను ఏయిర్‌ పోర్టుకు రాకుండా అటకాయించి నేరుగా విశాఖపట్నం వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌లో దించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకుల దిగజారుడు తనాన్ని, నీచ రాజకీయ సంస్కృతిని తీవ్రంగాఖండిస్తున్నామన్నా రు. అలసి సొలసిన తెలుగు ప్రయాణికులను తాము నేరుగా వారి గమన్యస్థానాలైన విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే.. మధ్యలో కాంగ్రెస్‌ ఎంపీలు వచ్చి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేయలేని పనిని తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల ప్రజల్లో వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే వారు తమ ఎంపీలపై దాడికి పూనుకున్నారని మండిపడ్డారు.

వీహెచ్‌ది అత్యుత్సాహం : టీడీపీ నేత టీడీ జనార్ధనరావు
కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీలు రమేష్‌ రాథోడ్‌ తదితరుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు విమర్శించారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.