June 26, 2013

బద్రీనాధ్ యాత్రికులకు టిడిపి ఆర్ధిక సాయం

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాధ్‌లో చిక్కుకొన్న యాత్రికుల వద్ద భోజన ఖర్చులకు డబ్బులు లేవని తెలియడంతో వారికి రూ. నాలుగు లక్షలు పంపాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాహకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి పార్టీ నేతలు, ట్రస్టు నిర్వాహకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

బద్రీనాధ్‌లో ఉన్న టిడిపి ఎంపీ రమేష్ రాధోడ్ అక్కడ ఉన్న యాత్రికులతో ఈ సందర్భంగా టెలిఫోన్లో మాట్లాడించారు. అక్కడ 350 మంది తెలుగువారు గత పది రోజులుగా చిక్కుకొని ఉన్నారని, వారిలో కొందరు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్నారని జోషి అనే యాత్రికుడు చంద్రబాబుతో చెప్పారు. అక్కడకు వెంటనే ఒక వైద్య బందాన్ని పంపాలని చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి బద్రీనాధ్‌లో ఉన్న వారిని తరలించే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఎంపీలకు సూచించారు. ప్రాణాలకు తెగించి బద్రీనాధ్ వెళ్ళిన ఎంపీ రాధోడ్‌ను ఆయన అభినందించారు. బద్రీనాధ్‌లో ఉన్న వారి వివరాలు వెబ్‌సైట్లో పెట్టి వారి బంధువులకు వివరాలు తెలపాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.