June 26, 2013

హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ నుంచి హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ తెలుగు బాధితులు ఆందోళనలో ఉన్నట్లు తెలియడంతో ఆయన బయలుదేరి వెళ్ళారు. హెలికాఫ్టర్‌లో ఎక్కడానికి తెలుగు బాధితులకు టోకెన్లు ఇవ్వడం లేదని, వారు తిందితిప్పలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ సీఎం విజయబహుగుణ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు.

బధిరీనాథ్, కేధార్‌నాథ్‌లో తెలుగు బాధితులను అధికారులు పట్టించుకోవడంలేదని, భోజన వసతి కూడా కల్పించడంలేదని బాధితులు వాపోయారు. ఈ పరిస్థితిని అక్కడ సిఎం దృష్టికి తీసుకువెళ్ళి బాధితులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేయనున్నారు. అవసరమైతే అక్కడ ధర్నా చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఉత్తరాఖండ్ సీఎం చేతులు పైకిఎత్తివేస్తే చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసి తెలుగు బాధితులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. ఇందు కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అంతకు ముందు బుధవారం ఉదయం బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

డెహ్రాడూన్ నుంచి టీడీపీ నేత రమేష్ రాథోడ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బధిరీనాథ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని హెలికాఫ్టర్‌లో ఎక్కేందుకు టోకెన్లు ఇవ్వడంలేదని అన్నారు. భోజన సదుపాయం కూడా లేదని, వారి బాధను చూసి చలించిపోయానని ఆయన చెప్పారు. ఏది ఏమైనా తెలుగు బాధితులను ఆంధ్రప్రుదేశ్ తరలించే వరకు ఇక్కడే ఉంటామని, వారికి సహాయం అందిస్తామని రాథోడ్ అన్నారు.

బధిరీనాథ్‌లో సుమారు 250 మంది తెలుగు బాధితులు ఉన్నారని, వారిలో షుగర్, బీపీ రోగులు ఉన్నారని, వారికి వైద్య సదుపాయం కూడా లేదని రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు బాధితులు అందరూ వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఇక్కడే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో తమ నేత చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ చేరుకోనున్నారని రాథోడ్ చెప్పారు.